Monday, July 29, 2019

Financier 'kidnapped and freed' after paying Rs 1 crore in hyderabad


రూ.కోటి తీసుకొని ఫైనాన్షియర్ని విడిచిపెట్టిన కిడ్నాపర్లు

హైదరాబాద్ లో కిడ్నాపర్ల ముఠా రూ.కోటి వసూలు చేసి ఓ ఫైనాన్షియర్ ను సోమవారం విడుదల చేసింది. ఆదివారం రాత్రి దోమలగూడ లో గజేంద్ర ప్రసాద్ అనే ఫైనాన్షియర్ ను ఓ ముఠా కిడ్నాప్ చేసింది. అతని కుటుంబ సభ్యుల్ని రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. ఆ సొమ్ము ఇస్తేనే గజేంద్రను విడిచిపెడతామని హెచ్చరించారు. చివరకు కుటుంబ సభ్యులు రూ.కోటి చెల్లించడంతో ముఠా అతణ్ని అబిడ్స్ లో వదిలి పరారయింది. ఈ మేరకు గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గజేంద్ర తనకు ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో లావాదేవీల్లో వివాదమున్నట్లు తెలిపారు. గత రాత్రి తనను అపహరించిన కిడ్నాపర్లు తర్వాత నిర్భందించి దాడి చేశారన్నారు. గజేంద్ర ఒంటిపై గాయాలు కనిపిస్తున్నాయి. మొహం కూడా కమిలిపోయింది. కిడ్నాపర్లు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తుండగా రూ.5 లేదా 10 లక్షలు ఇస్తానని చెప్పగా తనను వాళ్లు తీవ్రంగా కొట్టారన్నారు. చివరకు రూ.50 లక్షలు తీసుకుని వదిలివేయాలని కోరినా కనికరించలేదని చెప్పారు. తప్పక రూ.కోటి ఇస్తానని చెప్పడంతో అంగీకరించి తనను విడుదల చేశారని గజేంద్ర పోలీసులకు వివరించారు. తన స్నేహితుడు ఆ మొత్తాన్ని కారులో తీసుకొని వచ్చి సమీపంలోని ఓ స్కూల్ వద్ద పార్క్ చేశారన్నారు. అనంతరం ఆ డబ్బును ముఠాలోని ఇద్దరు సభ్యులు వెళ్లి తీసుకుని వచ్చారన్నారు. ఆ తర్వాతే నిర్బంధ ప్రాంతం నుంచి తనను కిడ్నాపర్లు అబిడ్స్ కు తరలించి పరారయినట్లు తెలిపారు.

Sunday, July 28, 2019

Bachchan 'filled with pride' after successful rescue of Mahalaxmi Express passengers


మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల్ని రక్షించిన బృందాలకు అమితాబ్ అభినందనలు
మహారాష్ట్రలో ఇటీవల జలదిగ్బంధనానికి గురైన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల్ని రక్షించిన సహాయక రక్షణ బృందాల్ని ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. శనివారం థానే జిల్లా సమీపంలోని వంగణీ ప్రాంతంలో ఈ రైలు వరద నీటిలో చిక్కుబడి 1050 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. వారందరూ సుమారు 17 గంట పాటు రైల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. సమాచారం అందుకున్న సహాయక రక్షణ బృందాలు, భారత సైన్యం రంగంలోకి దిగి గంటల తరబడి శ్రమించి ప్రయాణికులందర్ని సురక్షితంగా వరద నీటి నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. స్పందించిన బిగ్ బి , "ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అభినందనలు .. వారు మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ నుంచి 700 మంది ప్రయాణికులను విజయవంతంగా రక్షించారు! ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రైల్వే, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కు ధన్యవాదాలు, మీరు చాలా గొప్ప కార్యం నిర్వర్తించారు .. ఇది సాహసోపేతమైన , విజయవంతమైన కార్యక్రమం. నేను ఎంతో గర్వ పడుతున్నాను. జై హింద్! అని ట్వీట్ చేశారు. ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రయాణికుల్ని ప్రాణాలొడ్డి రక్షించడానికి చేపట్టిన విజయవంతమైన సహాయక చర్య ఆయనను ఎంతగానో కదిలించింది. దాంతో ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారందర్ని అమితాబ్ ప్రశంసలతో ముంచెత్తారు.

Saturday, July 27, 2019

All 1,050 passengers of stranded Mahalaxmi Express rescued:Railways


ఈ నీళ్ల పైన రైలుంది
·       ముంబయిలో పోటెత్తిన వరదలు
·       మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ నుంచి 1050 మంది ప్రయాణికుల తరలింపు
కుంభవృష్టి తాజాగా మహారాష్ట్రలోని ముంబయి, థానేల్ని అతలాకుతలం చేసింది. ఉల్హాస్ నది పోటెత్తడంతో సెంట్రల్ రైల్వే జోన్ లోని రైల్వే ట్రాక్ లు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం రాత్రి ముంబయి నుంచి కోల్హాపూర్ బయలుదేరిన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వరదల తాకిడికి ముంపునకు గురై నిలిచిపోయింది. బద్లా పూర్, వంగణి రైల్వే స్టేషన్ల మధ్యమార్గంలో రైలు వరద పోటెత్తి ప్రవహించడంతో జలదిగ్బంధనానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న 1050 మంది రైల్లోనే చిక్కుబడిపోయారు. వారందర్ని శనివారం మధ్యాహ్నం సహాయ రక్షణ బృందాలు సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చాయి. మొత్తం ప్రయాణికులందర్ని వారు చేరుకోవాల్సిన గమ్య స్థానం కోల్హాపూర్ కు వేరే మార్గంలో మరో రైలులో తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి కుండపోత వర్షానికి వరద పోటెత్తడంతో మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తున్న రైల్వే ట్రాక్ ముంపునకు గురైంది. గంటల కొద్దీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణికులు కాలం గడిపారు. శనివారం ఉదయానికే సహాయ రక్షణ బృందాలు రైలు జలదిగ్బంధానికి గురైన ప్రాంతానికి చేరుకున్నాయి. భారత నేవీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ వీరికి సహకరించారు. సహాయ రక్షణ చర్యలు చేపట్టిన సెంట్రల్ రైల్వే సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్), జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్)  ప్రయాణికులందరి ప్రాణాలు కాపాడాయి. లైఫ్ జాకెట్లు, బోట్ల తో భారత నేవీ బృందం కూడా వరదల్లో దిగ్బంధనానికి గురైన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వద్దకు చేరుకుని ప్రయాణికుల్ని సురక్షితంగా తీరానికి చేర్చడానికి సహకరించింది. వెలుపలికి తీసుకువచ్చిన ప్రయాణికుల్ని తొలుత బద్లాపూర్ లోని కన్వెన్షన్ హాల్ కు తరలించారు. వైద్య సహాయం అవసరమైన ప్రయాణికుల్లో కొందర్ని అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ రైల్వే సిబ్బంది ప్రయాణికులంతా తేరుకున్నాక వారి గమ్య స్థానం కోల్హాపూర్ కు వేరే మార్గంలో ప్రత్యేక రైలులో తరలించే ఏర్పాట్లు పూర్తి చేసింది.


Friday, July 26, 2019

Rahul priyanka pay tribute to kargil war heroes


కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన రాహుల్ ప్రియాంక
20వ విజయ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. కార్గిల్ లో పాకిస్థాన్ చొరబాటుదారులపై భారత్ సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై26న విజయ దివస్ ను ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలోఅసువులు బాసిన వీర జవాన్లకు రాహుల్, ప్రియాంక శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు ఆ వీర జవాన్లని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం దేశాన్ని రక్షించడానికి ప్రాణాలు పణంగా పెట్టిన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అదే విధంగా దేశ రక్షణలో నిరంతరం ప్రాణాలొడ్డి పోరాడుతున్న మహిళా, పురుష జవాన్లకు వందనాలంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
చొరబాటుదారుల పీచమణచిన భారత సైన్యం
సైన్యం నాటి విజయ క్షణాల్ని స్మరించుకుంటూ నూతనోత్తేజంతో సవాళ్లను ఎదుర్కొనేందుకు `విజయ్ దివస్` ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. 1999 జులై 26 న కార్గిల్ లో చిట్టచివరి చోరబాటుదారుణ్ని మట్టుబెట్టాక భారత సైన్యం విజయగర్వంతో జాతీయ పతాకను కార్గిల్ లో ఎగురవేసింది. మే 3న పాక్ ముష్కరుల చొరబాటును గుర్తించిన దగ్గర నుంచి జులై 26 వరకు `ఆపరేషన్ విజయ్` చేపట్టిన భారత్ సైన్యం (వైమానిక దళం ప్రధాన భూమిక పోషించింది) ఎడతెగని పోరాటం చేసి కార్గిల్ భూభాగాన్ని కాపాడింది. `టోలింగ్` శిఖరాన్ని రాజ్ పుతానా రైఫిల్స్-2 స్వాధీనం చేసుకోగా, జమ్ముకశ్మీర్ రైఫిల్స్-13 `పాయింట్ 4875(బాత్రా టాప్)`ను భారత్ వశం చేసింది. `ఖలుబార్` శిఖరాన్ని 1/9  గూర్ఖా రైఫిల్స్ స్వాధీనం చేసుకుని జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. అదేవిధంగా టైగర్ హిల్, జుబర్, కుకర్ థాంగ్ శిఖరాలపై ఐఏఎఫ్ యుద్ధ విమానాలు మిగ్-21 మిగ్-27 మిరాజ్- 2000లు లేజర్ గైడెడ్ బాంబుల్ని ప్రయోగించి పాక్ చొరబాటుదారుల బంకర్లను భస్మీపటలం చేశాయి.