Thursday, July 18, 2019

Imran Khan plans rally like modi`s style infront of president trumph in US tour


మోదీ ర్యాలీ తరహాలో ట్రంప్ ను ఆకట్టుకోవాలనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్

అగ్ర రాజ్యం అమెరికాను ప్రసన్నం చేసుకునే క్రమంలో పాకిస్థాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి పాక్ తో అమెరికా సంబంధాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ట్రంప్ హయాంలోనూ ఇరు దేశాల మధ్య  సంబంధాలు మెరుగుపడలేదు. ఉగ్రవాద మూలాల పాకిస్థాన్ లో అంతకంతకూ వేళ్లూనుకున్న నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా దూరం పెట్టింది. దాంతో ముంబయి   బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయిీద్ (జె.యు.డి. చీఫ్)ను అరెస్ట్ చేసిన పాకిస్థాన్ తమ సరిహద్దుల గగన తలంలో భారత్ విమానాల రాకపోకలకు ఆంక్షల్ని తొలగిస్తూ భారత్ తో పాటు అమెరికాను ఏకకాలంలో ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది. అమెరికా, పాక్ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఇమ్రాన్ నడుం బిగించారు. అందులో భాగంగానే నెల 22న ఆయన  అమెరికాలో పర్యటించనున్నారు. వైట్ హౌస్ లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. తన అమెరికా పర్యటన సందర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం ద్వారా ట్రంప్ దృష్టిలో పడాలని ఇమ్రాన్ ఉబలాటపడుతున్నారు. మోదీ ర్యాలీ తరహాలో ఈ ర్యాలీ ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ నాయకుల ర్యాలీలు అమెరికాలో గతంలో అనేకసార్లు నిర్వహించారు. కానీ పాక్ నాయకుడి ర్యాలీ ఏర్పాటు కాబోవడం ఇదే ప్రథమం. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ రాజధాని వాషింగ్టన్ డీసీలోని చైనాటౌన్ లో నిర్వహించతలపెట్టిన ఈ ర్యాలీ సందర్భంగా ఆయన అనుకూల వ్యతిరేక వర్గాల ప్రదర్శనలు జోరందుకోనున్నాయి.  అమెరికాలో పాకిస్థాన్ కు చెందిన పౌరులు దాదాపు అయిదు లక్షల మంది ఉంటారని అంచనా.  తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి వ్యతిరేకంగా ముజాహిర్లు, బలోచిస్థానీయులు, భుట్టో-జర్దారీ లకు చెందిన పీపీపీ అనుకూలురు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అభిమానులు ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జులై 23న యూఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీస్ (యూఎస్ఐపీ) ఆహ్వానంపై ఆ సంస్థ నిర్వహిస్తున్నమేధోమథనం కార్యక్రమంలో ఇమ్రాన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కూడా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. 



Wednesday, July 17, 2019

ICJ asks Pakistan to hold death sentence of kulbhushan jadhav, calls for fair trial


కులభూషణ్ జాదవ్ ఉరి నిలిపివేయాలని పాకిస్థాన్ కు ఐసీజే ఆదేశం
పాకిస్థాన్ చెరలో మగ్గుతున్న భారత మాజీ నేవీ కమాండర్ కులభూషణ్ జాదవ్ కు ఆ దేశ న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు విధించిన ఉరిశిక్షను నిలిపివేసి నిష్పక్షపాత న్యాయవిచారణ చేపట్టాలని పాకిస్థాన్ కు సూచించింది. ఐసీజేలో 15:1 నిష్పత్తిలో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) విభాగమైన ఐసీజే 1945లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ స్కోలో ఏర్పాటయింది. ప్రస్తుతం నెదర్లాండ్స్ లోని హేగ్ లో అంతర్జాతీయ న్యాయ విచారణలు నిర్వహిస్తోంది. 
 తమ దేశంలో గూఢచర్యం నిర్వహించి కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణలతో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ ఆయనను నిర్బంధించింది. వాస్తవానికి ఆయనను ఇరాన్ లో నిర్బంధించిన పాకిస్థాన్ నిఘా అధికారులు తమ దేశానికి తరలించారని భారత్ వాదిస్తోంది. 2003 నుంచి 2016 వరకు నేవీ కమాండర్ గా విధులు నిర్వర్తించిన కులభూషణ్ పదవీ విరమణ చేశారు. ఆయన వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు 10 ఏప్రిల్ 2017న ఇరాన్ వెళ్లిన సందర్భంగా అక్కడ పట్టుకుని పాకిస్థాన్ కు అపహరించుకు వెళ్లారు. కులభూషణ్ భారత రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్ తరఫున తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పాక్ ఆయనకు ఉరిశిక్ష విధించింది. భారత్ ఐసీజే దృష్టికి తీసుకెళ్లడంతో పాక్ న్యాయస్థానం తీర్పునకు అడ్డుకట్టపడింది. సుదీర్ఘ విచారణల అనంతరం  ఐసీజే నిష్పాక్షపాత, సమగ్ర విచారణ చేపట్టాలని పాక్ ఉన్నత న్యాయస్థానానికి సూచిస్తూ విధించిన ఉరిశిక్ష తీర్పును సస్పెండ్ చేసింది. 1970 లో మహారాష్ట్రలోని సాంగ్లిలో సుధీర్ జాదవ్, అవంతి జాదవ్ లకు కులభూషణ్ జన్మించారు. కులభూషణ్ కు ఉరిశిక్ష విధిస్తూ పాక్ న్యాయస్థానం విధించిన తీర్పుపై ఐసీజే వేటు వేస్తూ ఇచ్చిన తీర్పు భారత్ వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఈ కేసు విషయంలో పాక్ కు అమెరికా, చైనాలు మద్దతు ఇవ్వడం గమనార్హం.

Tuesday, July 16, 2019

Mischievous Penguins Raid Sushi Bar in newzealand Even After Being Removed by the Police


వెల్లింగ్టన్ వాసుల్ని భయపెట్టిన నీలిరంగు పెంగ్విన్ల జోడి
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ లో చిట్టి పెంగ్విన్ పక్షుల జోడి కలకలం రేపింది. మంగళవారం ఈ ఘటన స్థానిక సుషి బార్ లో చోటు చేసుకుంది. వెల్లింగ్టన్ రైల్వే స్టేషన్ కు సమీపంలో గల ఈ బార్ లో సోమవారం కూడా ఈ పక్షుల జోడిని అక్కడ సిబ్బంది గమనించారు. మళ్లీ మంగళవారం కూడా ఈ పక్షులు బార్ ప్రాంగణంలోని ఓ రూమ్ ఏసీ బాక్స్ వద్ద తచ్చాడాయి. వీటి జాడను గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వీటిని పట్టుకుని తీసుకెళ్లి కిలోమీటర్ దూరంలో గల హార్బర్ ప్రాంతంలో విడిచిపెట్టారు. అదే ప్రాంతంలో అప్పుడప్పుడు ఈ నీలి రంగు పెంగ్విన్ పక్షులు తిరుగాడుతుంటాయి. అయితే ఇలా రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో వీటిని చూడ్డం అరుదేనట. ఇంతకీ జనం అంతగా భయాందోళనకు గురి కావడానికి కారణమేంటంటే ఇవి అన్ని పక్షుల్లా మనుషులకు భయపడవు. పైగా ఇవే మనుషులపై దాడి చేస్తాయి. తమ ఉనికికి ఇబ్బందిగా అనిపించినా వీటి ఏకాంత వాసానికి భంగం కల్గినా ఆహారం లభించకపోయినా మనుషులే లక్ష్యంగా సూదంటి ముక్కు, గోళ్లతో మనుషుల్ని గాయపరుస్తుంటాయని అధికారులు తెలిపారు. దాంతో వీటిని క్రూర జంతువుల మాదిరిగా ప్రమాదకర పక్షుల జాబితాలో జనం చేర్చారు. అదీ గాక ఇవి ఒకచోట గూడు ఏర్పాటు చేసుకున్నాయంటే ఎంత దూరం తీసుకెళ్లి విడిచినా తిరిగి అదే చోటుకి వచ్చి చేరతాయట. దాంతో బార్ సిబ్బంది సత్వరం స్పందించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి వీటి బెడదను వదిలించుకున్నారు. సుషి బార్ సిబ్బంది రేడియో న్యూజిలాండ్ (ఆర్.ఎన్.జి) తో ఈ నీలి పెంగ్విన్ల సమాచారాన్ని పంచుకున్నారు. వీటిని వెల్లింగ్టన్ హార్బర్ ప్ర్రాంతంలో విడిచివచ్చిన పోలీస్ కానిస్టేబుల్ జాన్ జు సోషల్ మీడియా (ఫేస్ బుక్)లో ఈ సమాచారాన్ని పోస్టు చేశాడు. జంతు సంరక్షణ శాఖ (డిపార్ట్ మెంట్ ఆఫ్ కన్జర్వేషన్-డీఓసీ) కార్యనిర్వహణాధికారి జాక్ మేస్ మాత్రం ఈ పక్షులు మళ్లీ తిరిగి రావచ్చని భావిస్తున్నారు. తొలుత ఈ పెంగ్విన్ల రాకను బార్ సిబ్బంది వీనీ మోరిస్ పసిగట్టింది. అయితే ఈ పక్షులంటే జనానికి భయం కావచ్చు గానీ అవి మాత్రం ప్రేమించదగినవేనని ఆమె పేర్కొంది.

World hunger not going down, at the same time obesity also growing up


ఆకలి..ఊబకాయం రెండూ పైపైకే
ప్రగతి బాటలో పరుగులు పెడుతోన్న ప్రపంచంలో ఆకలి కేకలు ఓ వైపు, ఊబకాయం మరో వైపు ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ప్రతి 9 మందిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు వరల్డ్ ఆర్గనైజేషన్స్ నివేదికలు ఉద్ఘోషిస్తున్నాయి. ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ తాజా నివేదిక ప్రకారం 82 కోట్ల మంది (820 మిలియన్లు) పోషకాహార లేమితో ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది ఈ సంఖ్య 81 కోట్ల 10 లక్షలుంది. 2030 నాటికి పోషకాహార లేమితో బాధపడే మనుషులే లేకుండా చూడాలన్న లక్ష్య సాధన ప్రస్తుతం క్లిష్టంగా మారింది. అంతేకాకుండా 2050 నాటికి అదనంగా మరో 200 కోట్ల మంది (2 బిలియన్లు) పోషకాహార లేమి ని ఎదుర్కోనున్నారనే నివేదికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఒ), అంతర్జాతీయ ద్రవ్యనిధి, వ్యవసాయాభివృద్ధి సంఘం (ఐ.ఎఫ్.ఎ.డి), ఐక్యరాజ్యసమితి బాలల సంఘం (యూనీసెఫ్), ప్రపంచ ఆహార కార్యక్రమాల అమలు సంఘం (డబ్ల్యు.ఎఫ్.పి), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ)ల అధినేతలు సంయుక్తంగా ఈ విపత్కర పరిస్థితి అడ్డుకట్టకు ముందడుగు వేయాల్సిన ఆవ్యశ్యకతను ఈ నివేదక స్పష్టం చేస్తోంది. 
అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే పోషకాహార లేమితో బాధపడుతున్న వారి జనాభా ఎక్కువగా ఉంది. దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లోనే దాదాపు 50 కోట్ల మంది పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ఆఫ్రికా దేశాల మొత్తం జనాభాలో వీరి శాతం ఏకంగా 30.8 గా నమోదయింది. ముఖ్యంగా అయిదేళ్ల లోపు శిశు మరణాల్లో అత్యధిక శాతం పోషకాహార లేమి కారణంగానే అని స్పష్టం చేస్తోన్న నివేదిక భవిష్యత్ లో ఆరోగ్యకర సమాజం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. ఏటా 30 లక్షల మంది పిల్లలు పోషకాహార లేమితో మృత్యుదరి చేరుతున్నారు. ప్రపంచం మొత్తం 66 లక్షల మంది పిల్లలు రోజూ సరైన ఆహారం తినకుండా బడులకు వెళ్తుండగా అందులో 23 లక్షల మంది పిల్లలు ఆఫ్రికా దేశాలకు చెందినవారు కావడం గమనార్హం.  స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (sustainable development goal SDG-2) సాధనకు అంతర్జాతీయ సంస్థలు కూడి రావాల్సిన సమయం ఆసన్నమైంది. 
ఊబకాయం సమస్య అన్ని ఖండాలు, అన్ని ప్రాంతాల్లో నమోదయింది. ముఖ్యంగా యువత, పాఠశాలల బాలల్లో అత్యధికులు ఈ ఊబకాయం సమస్య బారిన పడుతున్నారు.  సరైన ఆహార నియమాలు పాటించక అనారోగ్యకర ఆహారాన్ని(జంక్ ఫుడ్స్) తీసుకుంటున్న ఆయా దేశాల్లోని పిల్లలు ఈ ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రతి 10 మందిలో 9 మంది ఈ సమస్యకు లోనవుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. డబ్ల్యు.హెచ్.ఒ. నివేదిక ప్రకారం 2016 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య 65 కోట్లు. ఇందులో 39% 18 ఏళ్ల లోపు వాళ్లే. 1975 నుంచి 2016 నాటికి ఊబకాయల సంఖ్య మూడింతలు పెరగడం గమనార్హం.