Wednesday, July 10, 2019

3 die of asphyxiation in Telangana


బావిలో మోటారు రిపేరుకు దిగి ముగ్గురు మృత్యువాత
తెలంగాణ లోని ఓ పురాతన బావిలో మోటారు మరమ్మతు చేయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు మృత్యుఒడికి చేరారు. ఈ విషాదం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ముత్యంపేట మండలానికి చెందిన కౌటలా గ్రామంలో చోటు చేసుకుంది. 35 అడుగుల లోతు గల ఈ బావిలోకి బుధవారం ఉదయం మోటార్ రిపేరు చేయడానికి వీరంతా దిగినట్లు తెలుస్తోంది. తొలుత ఓ వ్యక్తి ఈ బావిలోకి దిగి విషవాయువులు వెలువడిన కారణంగా ఊపిరాడక చనిపోయాడు. అతణ్ని రక్షించడానికి తోటి పనివాళ్లు ఇద్దరు ఒక్కొక్కరుగా అందులోకి దిగి అపస్మారక స్థితిలోకి చేరి ప్రాణాలు వదిలినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన ముగ్గురు 19 నుంచి 25ఏళ్ల లోపు యువకులు. మృతుల్ని రాజు(26), శ్రీనివాస్(25), మహేశ్(18) గా గుర్తించారు. మృతదేహాల్ని బావిలో నుంచి వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈనెల 8న నల్గొండ జిల్లాలోని షాలిగౌరారం మండలానికి చెందిన పెరికకొండారం గ్రామంలో ఓ 18 ఏళ్ల విద్యార్థిని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి చనిపోయింది. కావ్య అనే ఆ విద్యార్థిని బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. పశువులకు మేత వేయడానికి వెళ్లిన ఆమె నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయింది.

Tuesday, July 9, 2019

Puppy beaten to death in Thane housing complex, 1 booked


కుక్క పిల్లే కదా అని చంపేసి.. ఆనక ఇరుక్కున్న ఘనుడు
మహారాష్ట్రలో ఓ వ్యక్తి కుక్క పిల్లే కదా అని కొట్టి చంపి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఈ ఘటన జులై3 బుధవారం జరిగింది. థానె సమీపంలోని శాంతినగర్ ప్రాంతంలో భయాందర్ గృహ సముదాయాల టౌన్ షిప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తను నివసిస్తున్న అపార్ట్ మెంట్ ప్రాంగణంలోకి ఓ కుక్క పిల్ల జొరబడింది. దాన్ని చూసి ఆగ్రహం చెందిన సదరు వ్యక్తి దారుణంగా కర్రతో కొట్టి చంపాడు. కుక్క పిల్ల కళేబరాన్ని చూసిన ఇరుగుపొరుగులు ఎలా చనిపోయిందో తెలియక తర్వాత అక్కడ నుంచి తొలగించారు. అయితే రెండ్రోజులు గడిచిన తర్వాత వాట్సాప్ లో ఆ వీడియో ప్రత్యక్షమయింది. కుక్కపిల్లను కొట్టి చంపుతున్న వీడియోను సదరు వ్యక్తే రికార్డు చేసి పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా తమ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన కుక్కలన్నింటికి ఇదే గతి పడుతుందని వ్యాఖ్యానాన్ని జత చేశాడు. అతడికి ఈ మొత్తం వ్యవహారంలో స్నేహితుడొకరు సాయం చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోను చూసి చలించిపోయిన అపార్ట్ మెంట్ లోని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. థానె రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి కుక్క పిల్లను చంపిన సదరు వ్యక్తిపై నమోదు చేశారు. నోరు లేని మూగ జీవాల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం నేరం కిందకే వస్తుంది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం సెక్షన్ 11 ప్రకారం, ఐ.పి.సి (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్428, 429 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయదగ్గ నేరంగా పరగణించి పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

YSRCP party men do not exceed limits Chandrababu warns Cm Jagan


చంద్రబాబు ఓదార్పు యాత్ర
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాల్లో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాల్ని కలుసుకుని పరామర్శించారు. తాడిపత్రి లోని వీరాపురం గ్రామంలో భాస్కరరెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. భాస్కరరెడ్డి మృతికి పరహారంగా చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వారికి అందించారు. అనంతరం ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ వై.ఎస్.ఆర్.సి పార్టీపై నిప్పులు చెరిగారు. ఆరుగురు తెలుగుదేశం కార్యకర్తల్ని వై.ఎస్.ఆర్.సి.పి. కి చెందిన వారు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. డీజీపీ గౌతమ్ సావంగ్ ను కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇదేనా జగన్ అందిస్తున్న ఉత్తమ పాలన అని చంద్రబాబు నిలదీశారు. వై.ఎస్.ఆర్.సి.పి. దుందుడుకు పోకడలకు పోతోందని అది మంచిది కాదని చెప్పారు. ఆ పార్టీ వారి ఆగడాలు శ్రుతి మించుతున్నాయని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉరుకోబోదని హెచ్చరించారు. సీఎం జగన్ సత్పరిపాలన అందించడానికి ఆరునెలల గడువు అడిగారు..వేచి చూస్తున్నాం.. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాం.. అని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక 40 రోజుల్లో ఉత్తమ పాలన మాట అటుంచి ఆ పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. తక్షణం వై.ఎస్.ఆర్.సి.పి. శ్రేణుల్ని అదుపులో పెట్టుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు తేల్చిచెప్పారు.

Monday, July 8, 2019

BCCI appoints Dravid as Head of Cricket at NCA


ఎన్.సి.ఎ. అధినాయకుడిగా మిస్టర్ డిపెండబుల్ ద్రవిడ్

నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్.సి.ఎ) హెడ్ గా భారత జట్టు మాజీ కెప్టెన్ క్రికెట్ వాల్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. సోమవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ మేరకు ప్రకటించింది. జులై 1నే వాస్తవానికి ద్రవిడ్ ఎంపిక జరిగింది. అయితే అతను ఇండియా సిమెంట్స్ లో వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాడు. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం బీసీసీఐ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. `ఒక వ్యక్తికి ఒకే పదవి` అనే నియమం ప్రకారం ఎన్.సి.ఎ. అధ్యక్షుడు ఆదాయాన్ని చేకూర్చే ఏ ఇతర పదవుల్లో ఉండకూడదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) సభ్యత్వాన్ని అందులో భాగంగానే వదులుకున్నారు. అడ్వయిజరీ కమిటీ (సి.ఒ.ఎ) ఇండియా సిమెంట్స్ పదవిని త్యజించడం లేదా దీర్ఘకాలిక సెలవు పెట్టుకుని ఎన్.సి.ఎ. హెడ్ బాధ్యతలు స్వీకరించాలని ద్రవిడ్ కు సూచించింది. ఇండియా సిమెంట్స్ సెలవు మంజూరు చేయడంతో ద్రవిడ్ ఎన్.సి.ఎ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వీలుకల్గింది. ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ ప్రకటించలేదు. ఎన్.సి.ఎ పదవిలో ద్రవిడ్ భారత క్రికెట్ కు సంబంధించి పలు కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ పురుషుల, మహిళల జట్ల హెడ్ కోచ్ లు సహా కోచ్ లందరికి ద్రవిడ్ నేతృత్వం వహిస్తారు. క్రీడాకారులకు కీలక శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇండియా-ఎ, ఇండియా అండర్-19, అండర్-23 జట్లు కూడా ఎన్.సి.ఎ హెడ్ పరిధిలోనే ముందంజ వేయనున్నాయి. ఇంతకు ముందు ఎన్.సి.ఎ. చైర్మన్ గా అనిల్ కుంబ్లే వ్యవహరించిన సంగతి తెలిసిందే.