Thursday, July 4, 2019

Westindies beat Afghanistan by 23 runs in icc world cup


నామమాత్రపు మ్యాచ్ లో అఫ్గనిస్థాన్ పై వెస్టిండీస్ గెలుపు
ఐసీసీ వరల్డ్ కప్-12లో అఫ్గనిస్థాన్ పరాజయాలు పరిపూర్ణమయ్యాయి. ఆడిన తొమ్మిదింటికి  9 మ్యాచ్ ల్లో పరాజయం పాలయినా ఆ జట్టు చివరి మ్యాచ్ లోనూ వెస్టిండీస్ పై పోరాట పటిమను ప్రదర్శించింది. హెడ్డింగ్లే లీడ్ మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్ నం.42లో అఫ్గన్ల పోరాటం మరోసారి అబ్బురపరిచింది. అయినా బలమైన జట్టు వెస్టిండీస్ ఆ జట్టును 23 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటికే ఇరు జట్లు నాకౌట్ స్థానాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో కరేబియన్ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మరోసారి పేలవమైన ఫామ్ తో 7 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఇవిన్ లూయిస్(58), కలిసి వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్(77) రెండో వికెట్ కు 88 పరుగులు జోడించారు. ఆ తర్వాత షిమ్రాన్ హెట్మర్(39), నికోలస్ పూరన్(58), కెప్టెన్ హోల్డర్(45) రాణించడంతో విండీస్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. అఫ్గన్ బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులిచ్చారు. అందరికంటే ఎక్కువగా దవ్లాత్ జద్రాన్ 73 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ షిర్జాద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో 1 వికెట్ తీశారు. 
అనంతరం 312 పరుగుల ఛేదన లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన అఫ్గనిస్థాన్ మరోసారి తను బలమైన జట్టుగా ఎదుగుతున్న తీరును ప్రపంచ క్రికెట్ ముందు ప్రదర్శించింది. ఓ దశలో గెలుపు అవకాశాలు కనిపించాయి. కెప్టెన్ గుల్బుద్దీన్(5) మరోసారి సింగిల్ డిజిట్ కే డగౌట్ చేరాడు. మరో ఓపెనర్ రహ్మత్ షా(62), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్(86) రెండో వికెట్ కు 133 పరుగులు జోడించి జట్టు గెలుపుపై ఆశలు కల్పించారు. ఆ తర్వాత జద్రాన్(31), అస్ఘర్ అఫ్గన్(40), సయ్యద్ షిర్జాద్(25) మాత్రమే విండీస్ బౌలర్లను ఎదుర్కొని చెప్పుకోదగ్గ పరుగులు చేయగలిగారు. 288 పరుగులకు అఫ్గనిస్థాన్ ఆలౌటయింది. విండీస్ బౌలర్లలో కార్లోస్ బ్రాథ్ వెయిట్ 4, కెమర్ రోచ్ 3 వికెట్లు పడగొట్టగా ఒషానే థామస్, క్రిస్ గేల్ చెరో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను హోప్ గెలుచుకున్నాడు.

Loksabha passes aadhaar bill:it use is vital but voluntary,sats govt.


లోక్ సభలో ఆధార్ సవరణల బిల్లు ఆమోదం
భారత పార్లమెంట్ దిగువ సభ గురువారం సవరణలతో కూడిన ఆధార్ బిల్లు-2019ను ఆమోదించింది. కేంద్ర న్యాయ, సాంకేతిక సమాచార శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు సభ ఆమోదం తెల్పింది. ఆధార్ కార్డు చాలా కీలకమని అయితే వ్యక్తులు స్వచ్ఛందంగా వినియోగించే వీలు కల్పిస్తూ ఈ బిల్లును తాజాగా ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వం, ప్రజల్లో పారదర్శకత చాలా పెరిగిందని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అక్రమాలకు ఈ కార్డు చరమగీతం పాడిందన్నారు. 4.23 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లు, 2.98 కోట్ల అక్రమ రేషన్ కార్డులు తొలగించడం సాధ్యమైందన్నారు. ఆయా లబ్ధికారక పథకాల్లో కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమాల పాలవ్వకుండా ఆధార్ ద్వారా అడ్డుకట్ట పడిందన్నారు. తద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదా అయినట్లు రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం వ్యక్తులు తమ ఇష్ట ప్రకారం బ్యాంక్ ఖాతాలు, ఫోన్ సిమ్ కార్డుల కోసం ఆధార్ ను వినియోగించుకోవచ్చు. వ్యక్తుల ఆధార్ వివరాల్ని ఏ సంస్థలు స్టోర్ చేయకూడదు. ఆ విధంగా ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.కోటి జరిమానా విధిస్తారు. ఆధార్ బయోమోట్రిక్ దుర్వినియోగం అయ్యే అవకాశమే లేదని మంత్రి చెప్పారు. కంటి పాప(ఐరిస్), వేలిముద్రలు(ఫింగర్ ప్రింట్స్), ఇతర వ్యక్తిగత వివరాలు(పర్సనల్ డేటా) భారత ప్రభుత్వ ఆధీనంలోని యంత్రాంగంలోనే అత్యంత భద్రంగా సురక్షితంగా స్టోర్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 123 కోట్ల మంది ఆధార్ కార్డును కల్గి ఉన్నారని వారు ఆయా అవసరాల నిమిత్తం ఆధార్ ను వినియోగించుకుంటున్నారని రవి శంకర్ వివరించారు.

Wednesday, July 3, 2019

England enters semis crushed out Newzealand by 119 runs in icc world cup

వరల్డ్ కప్ సెమీస్ చేరిన ఇంగ్లాండ్ 119 పరుగుల తేడాతో కివీస్ చిత్తు
ఐసీసీ వరల్డ్ కప్12 లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు సగర్వంగా సెమీ ఫైనల్స్ కు చేరింది. బ్యాటింగ్బౌలింగ్ఫీల్డింగ్ అన్నింటా న్యూజిలాండ్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఆ జట్టును 119 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బుధవారం డర్హం రివర్ సైడ్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ నం.41లో ఇంగ్లాండ్ పిడుగు జానీ బెయిర్ స్టో తనపై గల అంచనాలు నిలబెట్టుకుంటూ టోర్నీలో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. క్రీడా పండితుల అంచనాలకు తగ్గట్లు టైటిల్ ఫెవరేట్ గా పరిగణింపబడుతున్న ఇంగ్లాండ్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. టోర్నీ ఆరంభంలో వరుస మ్యాచ్ ల గెలుపుతో పులిలా కనిపించిన న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ తో ఈ రోజు మ్యాచ్ లో పిల్లిలా మారిపోయింది. అద్భుతాలు చేయగలదనుకున్న దశ నుంచి ఒక్కో మెట్టు కిందకు జారిపోయింది. ముఖ్యంగా ఆతిథ్య జట్టుతో మ్యాచ్ లో లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ పోరాడకుండా బ్యాట్ ఎత్తేసి పెవిలియన్ బాట పట్టింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్(60)బెయిర్ స్టో(106)జోరూట్(24)ఇయాన్ మోర్గాన్(42) జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు. పేసర్స్పిన్నర్ తేడా లేకుండా అందరి బంతుల్ని ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ బాదేశారు. జేమ్స్ నిషమ్ మాత్రమే ఇంగ్లాండ్ బ్యాటర్ల బాదుడు నుంచి తప్పించుకున్నాడు. 41 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మాట్ హెన్రీ 54 పరుగులిచ్చి 2 వికెట్లుట్రెంట్ బౌల్ట్ 56 పరుగులకు 2 వికెట్లు తీసుకోగా మిషెల్ శాంటనర్టిమ్ సోథీ చెరో 1 వికెట్ పడగొట్టగలిగారు. 306 పరుగుల ఛేదన లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ గెలుపు ధీమా చూపలేకపోయింది. ప్రత్యర్థి బౌలర్ల ప్రతిభ కన్నా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ నిర్లక్ష్యం వల్లే వికెట్లు టపటపా పడిపోయాయి. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో హెన్రీ నికోల్స్(0) అవుట్ కాకపోయినా ఫీల్డ్ అంపెర్ ఎల్బీడబ్లూ ఇవ్వడంతో వెనుదిరిగాడు. వాస్తవానికి ఆ బంతి వికెట్ల పై నుంచి వెళ్తున్నట్లు రీప్లే లో బయటపడింది. థర్డ్ అంపైర్ (డీఆర్ఎస్) అవకాశాన్ని హెన్రీ వదిలేసుకున్నాడు. మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (8) కూడా త్వరగా వెనుదిరిగాడు. రాస్ టేలర్(28)కెప్టెన్ కేన్ విలియమ్సన్(27)లు మ్యాచ్ ను ప్రత్యర్థికి అప్పగిస్తూ అనవసరంగా రనౌట్లయి వెనుదిరిగారు. మార్క్ వుడ్ షార్ట్ పిచ్ఓవర్ పిచ్ బౌన్సర్లతో కివీస్ బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టి 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జోరూట్ మినహా మిగిలిన ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ వోక్స్జోఫ్రా ఆర్చర్లియమ్ ప్లంకెట్అడిల్ రషీద్బెన్ స్టోక్స్ 1 వికెట్ చొప్పున పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మొత్తానికి బాధ్యతగా బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్కడు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ లథమ్(57) మాత్రమే. ఆ జట్టు ఇంకా అయిదు ఓవర్లు మిగిలి ఉండగానే పట్టుమని 200 పరుగులు కూడా చేయకుండా 45 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా బెయిర్ స్టో నిలిచాడు.

Ambati Rayudu retires all forms of cricket after being ignored this World Cup

అంబటి రాయుడు అలక:అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటన

భారత క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు అలకబూనాడు. వరల్డ్ కప్ కు తనను ఎంపిక చేయలేదని అప్పటి నుంచి రాయుడు కినుక వహించాడు. చివరకి అతణ్ని స్టాండ్ బైగా ప్రస్తుత వరల్డ్ కప్ కు ఎంపిక చేశారు. శిఖర్ ధావన్ గాయంతో వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో మరో స్టాండ్ బై గా ఎంపికైన పంత్ కు మ్యాచ్ లు ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విజయ్ శంకర్ కూడా గాయంతో వైదొలగడంతో రాయుడికి అవకాశం దక్కవచ్చని అందరూ భావించారు. అయితే మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో రాయుడు ఇక తను భారత జట్టులోనే కొనసాగకూడదని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. మంచి భవిష్యత్ ఉన్న రాయుడు క్రికెట్ అంటే వరల్డ్ కప్ గానే భావించడం సరికాదు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర అంతర్జాతీయ మ్యాచ్ లో పాల్గొనడం కూడా ప్రతిష్ఠాత్మకమేనని గ్రహించాలి. 2013లో భారత జట్టుకు ఎంపికై జింబాబ్వేపై తొలి వన్డే ఆడాడు. ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే చివరి మ్యాచ్. 55 వన్డేల్లో 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలున్నాయి. అలాగే ఆరు టీ-20 మ్యాచ్ లు ఆడిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు 124. రాయుడు మొత్తం 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 6,151 పరుగులు చేశాడు. రాయుడు రిటైర్మెంట్ లేఖ అందినట్లు బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.