Saturday, June 22, 2019

union bank ATM robbery bid foiled in Mathura


మధుర లో ఏటీఎం చోరీ యత్నం భగ్నం
ఉత్తరప్రదేశ్ లోని మధురలో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు ఏటీఎం చోరీకి చేసిన యత్నం పోలీసుల రాకతో భగ్నమయింది. పోలీసు గస్తీ వాహనాన్ని చూసి దొంగలు పారిపోయారు. ఈ ఘటన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది. స్థానిక కృష్ణ విహార్ కాలనీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లక్ష్యంగా దొంగలు చోరీకి శతథా ప్రయత్నించారు. మెషిన్ ఎంతకూ తెరుచుకోకపోవడంతో గ్యాస్ కట్టర్లతో కత్తిరించాలనుకున్నారు. అదీ సాధ్యం కాలేదు. చివరకు మెషిన్ ను పెకిలించుకు పోవాలనుకుంటున్న సమయంలో శబ్దాలకు అనుమానం వచ్చిన పోలీసు గస్తీ వాహనం ఆ ప్రాంతానికి చేరుకోవడంతో దొంగలు పలాయనం చిత్తగించినట్లు నగర పోలీసు సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ తెలిపారు.


Friday, June 21, 2019

ram vilas paswan files nomination for by election to rajya sabha

రాజ్యసభ కు నామినేషన్ వేసిన కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ 

బిహార్ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి లోక్ జనశక్తి (ఎల్.జె.ఎస్) పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు  కార్యక్రమంలో  బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, రోడ్లు, భవనాల శాఖ సహాయమంత్రి నందకిశోర్ యాదవ్, విద్యుత్ శాఖ సహాయ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తదితర సీనియర్ ఎన్డీయే నాయకులు పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ బిహార్ పట్నా సాహెబ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నిక కావడంతో ఆ రాష్ట్రంలో ఏకైక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. నామినేషన్లకు ఈ నెల 25 తుది గడువు కాగా 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ జూన్ 28. వేరే ఎవరైనా నామినేషన్ వేస్తే జులై 5న ఓటింగ్ తేదీని నిర్ణయిస్తారు. రామ్ విలాస్ పాశ్వాన్ సొంత నియోజకవర్గం హజిపూర్ నుంచి ఈసారి లోక్ సభకు ఆయన చిన్న సొదరుడు పశుపతి కుమార్ పరాస్ ఎన్నికయ్యారు. పరాస్ బిహార్ రాష్ట్రమంత్రిగా వ్యవహరించారు. రామ్ విలాస్ పాశ్వాన్ 1977 నుంచి 2014 మధ్య కాలంలో హజిపూర్ నియోజకవర్గం నుంచి 9సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. తొలుత జనతా పార్టీ తరఫున 1977, 1980ల్లో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1984లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత 1989,91,96,98,99ల్లో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లో ఆయన లోక్ జన్ శక్తి పార్టీని స్థాపించి హజిపూర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో ఆ స్థానానికి లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు.

Australia beat Bangladesh by 48 runs warner hits 166


ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మరో మెట్టు పైకెదిగింది. ఆసియా క్రికెట్ లో భారత్ సరసన నిలిచే స్థాయి తమకే ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు నిరూపించుకుంది. ఐసీసీ వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.26 నాటింగ్ హామ్ వేదికపై గురువారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుపై బంగ్లాదేశ్ పోరాడి 48 పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ కనబర్చిన తెగువ ఆ జట్టు ఓడినా క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్పికర్ రహీం సెంచరీ (102*), ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ (62), షాకిబ్ అల్ హసన్(41), మహ్మదుల్లా(69) పరుగులతో చివరి  వరకు విజయం కోసం పోరాడారు. వెస్టిండీస్ పై గెలుపును ఈ మ్యాచ్ లో రిపీట్ చేస్తుందా అన్నట్లుగా బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించింది. అయిదో వికెట్ గా మహ్మదుల్లా అవుటయ్యా సరికి రహీంతో కలిసి 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు 44 ఓవర్లు ముగిసే సరికి 302 పరుగులు నమోదు చేసింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ 333 పరుగులు చేసింది. కంగారూ బౌలర్లలో మిషెల్ స్టార్క్, నాథన్ కోల్టర్ నైల్, మార్కస్ స్టోయినిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అడమ్ జంపా ఓ వికెట్ తీసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరే లక్ష్యంగా పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోయి 5 సిక్సర్లు, 14 బౌండరీలతో 166 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కెప్టెన్ ఆరన్ ఫించ్(53), ఉస్మాన్ ఖవాజా(89)లు అర్ధ సెంచరీ లతో కదం తొక్కారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన గ్లెన్ మాక్స్ వెల్ కూడా 10 బంతుల్లోనే 32 పరుగులు రాబట్టాడు. మార్కస్ స్టోయినిస్ 17 పరుగులతో కీపర్ అలెక్స్ కేరీ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ 3 వికెట్లు, ముస్తాఫైజర్ రహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  వార్నర్ గెలుచుకున్నాడు.

Thursday, June 20, 2019

raising issue of rahul`s use of mobile during president address frivolous:congress



రాహుల్ పార్లమెంట్ లో ఫోన్ చూసుకుంటున్నారంటూ..
బీజేపీ పనికిమాలిన ఆరోపణలు చేస్తోంది:కాంగ్రెస్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ తో బిజీ అయిపోయారనే బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలు పనికిమాలినవిగా పేర్కొంది. గురువారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా రాహుల్ 20 నిమిషాల సేపు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో మాట్లాడారని అరగంటకు పైగా ఫోన్ చూసుకుంటూ గడపారని బీజేపీ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా పార్లమెంట్ లో రాహుల్ తన ఫోన్ ద్వారా ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమైపోయారన్నారు. పలు విషయాలపై గంభీరంగా రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా కనీసం ఆ అంశాలపై రాహుల్ దృష్టి పెట్టలేదన్న బీజేపీ సభ్యుల ఆరోపణల్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలపై దృష్టి పెట్టిన రాహుల్ వాటిపైనే తమ నాయకురాలు సోనియాతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇటీవల పుల్వామా దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల స్మృత్యర్థం మౌనం పాటిస్తున్న సందర్భంలోనూ రాహుల్ ఫోన్ చూసుకోవడంలో నిమగ్నమయ్యారంటూ బీజేపీ సభ్యుడు పరేశ్ రావల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ లో షేర్ చేసిన వీడియో, ఫొటోలు నకిలీ వంటూ నెటిజెన్లు రావల్ పై మండిపడ్డారు. ఓ వైపు రాహుల్ ఫోన్ చేసుకుంటున్నట్లున్న దృశ్యంతో పాటు మరో పక్క ప్రధాని మోదీ గౌరవ వందనం చేస్తున్న ఫొటోను జత చేసి రావల్ ఫేస్ బుక్ పోస్టులో ఫొటో పెట్టారు. ఈ ఫొటోను చూస్తేనే ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి నాయకత్వంలో ఎంత తేడా ఉందో సుస్పష్టమౌతోందని కామెంట్ రాశారు. అయితే రాహుల్ ఫోన్ చూసుకుంటున్నట్లున్న ఫొటో నకిలీదిగా తేల్చిన కొందరు నెటిజన్లు `ఇది బుద్ధిమాలిన పని..నకిలీ వార్తాహరుడు పరేశ్ రావల్ మన ఎంపీ కావడం సిగ్గు చేటు` అని పేర్కొన్నారు.