Monday, June 17, 2019

Kejriwal seeks action against cops for thrashing driver


తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి:కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలోని ముజఫర్ నగర్ లో ఆదివారం పోలీసులకు టెంపో డ్రైవర్ కు మధ్య జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. పోలీసుల దాడిలో గాయపడిన బాధిత టెంపో డ్రైవర్ కుటుంబ సభ్యుల్ని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితికి ఆదివారం నాటి ఘటన అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నేరాల శాతం పెరిగిపోతోందన్నారు. శాంతిభద్రతల అంశంపై కేంద్రహోం మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ దృష్టి సారించాలన్నారు. ఈ ఘటనలో తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు టెంపో డ్రైవర్ కు తొలుత వాగ్వాదం చోటు చేసుకుంది. సీనియర్ ఆఫీసర్ తో కూడిన పోలీసు బృందం టెంపో డ్రైవర్ తలపాగాను తీసివేయడానికి యత్నిస్తూ దాడికి పాల్పడ్డారు. దాంతో అతను పొడవాటి కత్తితో వారిపై ఎదురుదాడికి దిగాడు. రోడ్డుపై పోలీసుల్ని ఆ టెంపో డ్రైవర్ కత్తి చేత పట్టుకుని తరుముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోపోద్రిక్తులైన ఆ వర్గానికి చెందిన వారు పోలీసుల అనాగరిక వైఖరిపై ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాలు తీవ్రరూపం దాల్చకుండా చక్కదిద్దాలని సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విధి నిర్వహణలో దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పోలీసుల్ని సస్పెండ్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మొత్తం ఘటనపై ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులతో దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ ఘటన అప్పుడే రాజకీయ రంగు పులుముకుంటోంది. రాజౌరి గార్డెన్ బీజేపీ ఎమ్మెల్యే మణిందర్ సింగ్ శిర్సా మాట్లాడుతూ పోలీసులే తొలుత టెంపో డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అతని మత సంప్రదాయానికి విఘాతం కల్గించారన్నారు.

India beat Pakistan by 89 runs with affect of DRS



ఆల్ రౌండ్ ప్రతిభతో పాక్ ను చిత్తు చేసిన భారత్
వరుణుడు అసలు కరుణిస్తాడా? మ్యాచ్ జరుగుతుందా లేదా అనే మీమాంస తో ప్రారంభమైన భారత్- పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ లో చివరకు విజయం మెన్ ఇన్ బ్లూనే వరించింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.22 ఆదివారం మాంచెస్టర్ వేదికపై జరిగిన భారత్ పాకిస్థాన్ క్రికెట్ పోరులో గెలుపు ఆల్ రౌండ్ నైపుణ్యం పక్షానే నిలిచింది. వర్షం ఇరు జట్ల ఇన్నింగ్స్ లో రెండు సార్లు కొద్ది సేపు అంతరాయం కల్గించగా డక్ వర్త్ లూయిస్ (డీఆర్ఎస్) నిబంధనల ప్రకారం భారత్ 89 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసింది. ప్రపంచ కప్ సమరంలో భారత్ ఏడింటికి ఏడు సార్లు పాకిస్థాన్ పై గెలిచి రికార్డు నెలకొల్పింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫ రాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ 50 ఓవర్లలో 336/5 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ లేని లోటును వరల్డ్ కప్ లో తొలిసారి ఓపెనర్ గా దిగిన కె.ఎల్.రాహుల్(57) చక్కగా భర్తీ చేశాడు. నిలకడైన ఆటతీరుతో అర్ధ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. వరల్డ్ టాప్ ఓపెనర్ రోహిత్ శర్మ బాధ్యతంతా భుజాలకెత్తుకుని టోర్నీలో రెండో సెంచరీ కొట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం 337 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఆద్యంతం పేలవమైన ఆటతీరునే కనబర్చింది. చక్కటి లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేస్తున్న భువనేశ్వర్, బూమ్రా ల పేస్ జోడీకి విజయ్ శంకర్, హార్ధిక్ పాండ్యా జత కలిశారు. స్పిన్ తో కుల్దీప్ పాక్ బ్యాట్స్ మెన్ ను కట్టి పడేశాడు. అప్పటికే అయిదు వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేసి  పీకల లోతు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ను వర్షం కూడా దెబ్బతీసింది. 40 ఓవర్లలో 302 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించడంతో పాక్ చివరకు 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి ఓటమి పాలయింది. బౌలింగ్ ఛేంజ్ లో బంతిని అందుకున్న ఆల్ రౌండర్ మీడియం పేసర్ విజయ్ శంకర్ తొలివికెట్ గా ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ కు పంపాడు. వన్ డౌన్ బ్యాట్స్ మన్ బాబార్(48) ను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ లో కుదురుకున్న ఫకర్ జమాన్(62) కూడా కుల్దీప్ బౌలింగ్ లో చాహర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ వికెట్లను హార్ధిక్ పాండ్యా తీసుకున్నాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఔట్ చేసి తన ఖాతాలో రెండు వికెట్లు వేసుకున్నాడు. 35 ఓవర్ల గడిచిన ఇన్నింగ్స్ లో ఏ మాత్రం విజయావకాశాలు లేని దశలో వర్షం పడ్డంతో మ్యాచ్ నిలిచిపోయింది. కాసేపటికి మళ్లీ ప్రారంభమైనా పాక్ గెలిచే పరిస్థితి ఏమాత్రం కనిపించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో రోహిత్ (140), కోహ్లి(77), రాహుల్ (57) భారీ స్కోరుపై కన్నేసి పరుగులు రాబట్టారు. ముఖ్యంగా రాహుల్, రోహిత్ జోడి బ్యాట్ కు అందివచ్చిన బంతిని బౌండరీకి తరలిస్తూ లైన్ అండ్ లెంగ్త్ బంతులకు సింగిల్, డబుల్ రన్స్ తీస్తూ తొలి వికెట్ కు 23.5 ఓవర్లలో 136 పరుగులు జోడించారు. పరుగులు తీసే క్రమంలో రాహుల్ తొందరపాటు వల్ల రోహిత్ రనౌటయ్యే ప్రమాదంలో పడ్డాడు. ఫీల్డింగ్ లోపం కూడా పాక్ జట్టులో కొట్టొచ్చినట్లు కనిపించింది. కోహ్లి బౌన్సర్ ను ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్ కు తగిలిందనకుని ఔటవ్వకుండానే పెవిలియన్ చేరి పొరపాటు చేశాడు. అంతకుముందే వర్షం వల్ల మ్యాచ్ 46.2 ఓవర్ల వద్ద నిలిచిపోయింది. ఆ తర్వాత కోహ్లి అనుకోకుండా పెవిలియన్ చేరడంతో చివర్లో 14 బంతుల్ని విజయ్ శంకర్, కేదార్ జాదవ్ ఎదుర్కొన్నారు. పాక్ బౌలర్లలో పొదుపుగా పరుగులిచ్చిన మహ్మద్ అమీర్ మరోసారి మూడు వికెట్లు పడగొట్టగా హసన్ అలీ, వహాబ్ రియాజ్ లకు చెరో వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  మరోసారి రోహిత్ శర్మ ను వరించింది. 

Sunday, June 16, 2019

Avon march in prague most of the women dressed in pink


ప్రేగ్ లో ఘనంగా ఎవాన్ మార్చ్
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో ఎవాన్ మార్చ్ 19వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రెస్ట్ కేన్సర్ బాధితులు వారి తల్లిదండ్రులకు సంఘీభావంగా ఏటా ఎవాన్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ మార్చ్ లో వేల సంఖ్యలో మహిళలు గులాబీ రంగు దుస్తుల్లో పాల్గొనడం రివాజు. జున్ 15 శనివారం ప్రేగ్లోని ఓల్డ్ టౌన్ స్కేర్ లో మార్చ్ కు పెద్ద సంఖ్యలో హాజరైన యువతులు అనంతరం వైభవంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మన మనసుల్లో ఏముందో ముఖ్యం కాదు మనం అందరి హృదయాలకు ఏమి చేరుస్తున్నామన్నదే ప్రధానం’  అనే నినాదంతో ఈ ఏడాది ఎవాన్ మార్చ్ నిర్వహించారు. ద ఎవాన్ హెల్త్ బ్రెస్ట్ ప్రాజెక్టు సంస్థ పింక్ రిబ్బన్ లతో కూడిన ఉత్పత్తుల్ని, ఎవాన్ మార్చ్ టి-షర్టుల్ని ఈ సందర్భంగా విక్రయించింది. బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న వారికి సహాయంగా నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమాలకు ఈ సొమ్మును ఆ సంస్థ అందజేస్తుంది. ఏటా చెక్ రిపబ్లిక్ లో 7వేల మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో 1900 మంది మరణిస్తున్నట్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయో స్టాటస్టిక్స్ అండ్ అనలైజెస్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసన్ ఆఫ్ ది మసారిక్ యూనివర్సిటీ, చెక్ అసోసియేషన్ ఆఫ్ మేమోడయాగ్నొస్టిక్స్ నివేదికల ద్వారా తెలుస్తోంది. కణతిని కేన్సర్ తొలిదశలోనే గుర్తిస్తే 90 శాతం వ్యాధిని నివారించే అవకాశముంటుంది. మేమోగ్రఫీ విధానంలో చేసిన బ్రెస్ట్ కేన్సర్ పరీక్షల ద్వారా అత్యంత సమర్ధంగా కచ్చితమైన నివేదికను పొందొచ్చు.

Uttara Pradesh dgp took out traffic awareness rally in lucknow


ట్రాఫిక్ చైతన్యం కోసం యూపీ డీజీపీ సైకిల్ ర్యాలీ
వాహనచోదకులకు ట్రాఫిక్ చైతన్యం కల్పించడంలో భాగంగా ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓం ప్రకాశ్ సింగ్ ఆదివారం లక్నోలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాళీదాసు మార్గం రోడ్ నం.5లో  ఉదయం 6 కు ప్రారంభించిన ర్యాలీ సుమారు 10 కిలోమీటర్లు సాగింది. లాల్ బాగ్ వద్ద కు చేరుకున్న అనంతరం డీజీపీ ఓంప్రకాశ్ మాట్లాడుతూ వాహనచోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ముఖ్యంగా మోటారు బైక్ లు నడిపేవారు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించడం తప్పనిసరన్నారు. తద్వారా వారి ప్రాణాలకే కాక సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. అదే విధంగా కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. శరీర వ్యాయామానికి, ఆరోగ్యానికి సైకిల్ తొక్కడం (సైక్లింగ్) ఎంతో మేలంటూ అది ప్రజలకే కాక పోలీసులకు వర్తిస్తుందని తెలియపర్చడానికే ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు డీజీపీ వివరించారు. ఈ ర్యాలీలో డీజీపీ ఓం ప్రకాశ్ వెంట ఎస్.ఎస్.పి. కళానిధి నాథని, ఏడీజీ రాజీవ్ కృష్ణ, ఎస్పీ వికాస్ చంద్ర త్రిపాఠి సహా పలువురు పోలీసులు పాల్గొన్నారు. దేశంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 15 వేల మంది దుర్మరణం చెందడమో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రులకు పరిమితమౌతోన్న ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. వీటిలో అధిక శాతం మరణాలు హెల్మెట్ ధరించని మోటారు బైక్ చోదకులు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవ్  చేస్తున్నవారివే కావడం గమనార్హం. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే రోజూ 98 మంది బైకర్లు హెల్మెట్ పెట్టుకోక రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. యూపీలో ఈ సంఖ్య 2019 నాటికి తగ్గినా ఇంకా ప్రమాదకర స్థాయిలోనే మరణాలు రోడ్డు ప్రమాదాల్లో నమోదవుతున్నాయి.