Saturday, June 15, 2019

CM Jagan tremendous speech in NITI aayog meeting



నీతి ఆయోగ్ భేటీలో అదరగొట్టిన జగన్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి జగన్ యావద్దేశానికి బలంగా తన వాదనను వినిపించారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు, సీనియర్ కేంద్రమంత్రులు సాక్షిగా తన వాణితో ఆకట్టుకున్నారు. సాక్షాత్తు ప్రధాని మోదీ విముఖంగా ఉన్న ప్రత్యేకహోదా అంశంపై జగన్ సాహసోపేతంగా మాట్లాడిన తీరు పలువురు ముఖ్యమంత్రుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా ఏర్పడిన కొత్త రాష్ట్రంలో 59 శాతం జనాభా ఉండగా 47 శాతం ఆదాయాన్ని పంచడం అసమంజసమన్నారు. ఒక వ్యవసాయాధారిత రాష్ట్రంగా ప్రస్తుతం ఏపీ మిగిలిపోయిందన్నారు. ఉపాధి కోసం రాష్ట్ర యువత, జనాభా వలసబాట పడుతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు విభజన హామీలిచ్చిన ప్రభుత్వం,2014 నాటి కొత్త ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడలేదన్నారు. తెలంగాణ కంటే ఏపీ తలసరి ఆదాయం తక్కువన్నారు. విభజన నాటికి ఏపీ అప్పులు రూ.97 వేల కోట్లు కాగా ప్రస్తుతం రూ.2.59 లక్షల కోట్లకు చేరాయని ఏటా అసలు, వడ్డీలకు కలిపి రూ.40 వేల కోట్లు చెల్లించాల్సిన అగత్యం పట్టిందని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఆర్థికంగా కాస్తయినా నవ్యంధ్రప్రదేశ్ కోలుకోగలదని జగన్ అన్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ప్రత్యేకహోదా తమకు సంబంధించిన అంశం కాదని దీనిపై తాము ఏవిధమైన నివేదికలు ఇవ్వడం విముఖత తెల్పడం చేయలేదన్నారని చెప్పారు. అభిజిత్ సేన్ పేర్కొన్న ఈ అంశం ప్రతిని జగన్ నీతి ఆయోగ్ సమావేశం ముందుంచారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా వేడుకున్నారు. గత నీటి ఆయోగ్ సమావేశంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు స్వల్ప సమయమే ఇచ్చినా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకత అంశాన్ని సమర్ధంగా వినిపించారు.

Karnataka CM meets PM; seeks funds to tackle drought



ప్రధాని మోదీని కలిసిన కర్ణాటక సీఎం కుమారస్వామి
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శనివారం రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. రాష్ట్రం కరవుతో అల్లాడుతోందని తక్షణ సాయంగా రూ.2,064 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కర్ణాటకలో 45శాతం తక్కువ వర్షపాతం నమోదయి కరవు పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులు పాలవుతున్నారన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ మేరకు ఆయన సహాయం విషయమై ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించారు. అంతేకాకుండా కర్ణాటకకు కేంద్రం పెండింగ్ లో ఉంచిన నిధులు రూ.1500 కోట్లను కూడా విడుదల చేయాలని సీఎం కుమారస్వామి ప్రధానికి విజప్తి చేశారు. మహాత్మాగాంధీ  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎ) కింద ఈ మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో గల 156 తాలూకాలు కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 107 తాలూకాల్లో తీవ్ర కరవు తాండవిస్తోంది. సుమారు 20.40 లక్షల హెక్టార్ల సాగు భూమి కరవుతో ప్రభావితమైందని అందులో 19.46 లక్షల హెక్టార్ల సాగుభూమి బీడు పడినట్లు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది.

Friday, June 14, 2019

Bowlers and Root help England rout West Indies in world cup



వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ ఘన విజయం
వర్షాలతో నిస్తేజంగా మారిన వరల్డ్ కప్ క్రికెట్ సంబరంలో ఇంగ్లాండ్ ప్రొఫెషనల్ ఆటతీరుతో మళ్లీ జోష్ నింపింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.19 సౌథాంప్టన్ వేదికపై శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన పోరులో ఇంగ్లాండ్ ఆల్ రౌండ్ షో చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ జోరూట్ ఈ మ్యాచ్ లో సరిగ్గా వంద పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రూట్ కి టోర్నీలో ఇది రెండో సెంచరీ. బౌలింగ్ లోనూ రెండు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వెస్టిండీస్ ను 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు చేసింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ వెస్టిండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 212 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఇంగ్లాండ్ ఛేదించింది. ఇంగ్లాండ్ కేవలం 33.1 ఓవర్లలోనే జానీ బెయిర్ స్టో(45), క్రిస్ వోక్స్ (40) వికెట్లను కోల్పోయి 213 పరుగులు చేసింది. ఆ రెండు వికెట్లను షానాన్ గాబ్రియల్ పడగొట్టాడు. మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు లో సెకండ్ డౌన్ లో క్రీజ్ లోకి వచ్చిన నికోలస్ పూరన్ మాత్రమే 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షిమ్రన్ హెట్మెయర్ (39), క్రిస్ గేల్ (36) మాత్రమే జట్టులో చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. బ్యాటింగ్ లో 9 పరుగులే చేసిన కెప్టెన్ హోల్డర్ బౌలింగ్ లోనూ రాణించలేదు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ చెరి 3 వికెట్లు తీసుకోగా రూట్ 2 వికెట్లు, ప్లంకెట్, క్రిస్ వోక్స్ లు చెరో వికెట్ పడగొట్టారు.

one dead another man severe injuries in trees collapse incidents in Mumbai



ముంబయిలో చెట్లు కూలి ఒకరి దుర్మరణం మరొకరికి తీవ్రగాయాలు
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో వేర్వేరు ప్రాంతాల్లో చెట్లు కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.  ముంబయిలోని విజయ్ కర్ వాడి సమీపంలోని ఎస్.వి.రోడ్డుపై శుక్రవారం ఉదయం 6.30కు దుర్ఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా ఈదురుగాలులు వీస్తుండడం స్వల్ప వర్షం కురవడంతో ఆకస్మికంగా చెట్టు కూలిపోయింది. ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న శైలేష్ మోహన్ లాల్ రాథోడ్ (38) పై అమాంతంగా చెట్టు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతణ్ని శత్బది ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఘటనలో జోగేశ్వరి సబర్బన్ ప్రాంతంలోని తక్షశిల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లో చెట్టు కూలిపోగా అనిల్ గోసల్కర్(48) తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని హోలీ స్పిరిట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే సొసైటీలో భారీ వృక్షాల కొమ్మలను నరికివేయాలని ఏప్రిల్ 24 నే తాము సూచించినట్లు అధికారులు తెలిపారు. ఎస్.వి.రోడ్డు లో మార్గానికి అడ్డంగా కూలిపోయిన చెట్టును తొలగించే పనులు చేపట్టినట్లు బ్రిహ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) లోని విపత్తు సహాయక విభాగం అధికారులు చెప్పారు.