Friday, June 14, 2019

one dead another man severe injuries in trees collapse incidents in Mumbai



ముంబయిలో చెట్లు కూలి ఒకరి దుర్మరణం మరొకరికి తీవ్రగాయాలు
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో వేర్వేరు ప్రాంతాల్లో చెట్లు కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.  ముంబయిలోని విజయ్ కర్ వాడి సమీపంలోని ఎస్.వి.రోడ్డుపై శుక్రవారం ఉదయం 6.30కు దుర్ఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా ఈదురుగాలులు వీస్తుండడం స్వల్ప వర్షం కురవడంతో ఆకస్మికంగా చెట్టు కూలిపోయింది. ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న శైలేష్ మోహన్ లాల్ రాథోడ్ (38) పై అమాంతంగా చెట్టు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతణ్ని శత్బది ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఘటనలో జోగేశ్వరి సబర్బన్ ప్రాంతంలోని తక్షశిల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లో చెట్టు కూలిపోగా అనిల్ గోసల్కర్(48) తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని హోలీ స్పిరిట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే సొసైటీలో భారీ వృక్షాల కొమ్మలను నరికివేయాలని ఏప్రిల్ 24 నే తాము సూచించినట్లు అధికారులు తెలిపారు. ఎస్.వి.రోడ్డు లో మార్గానికి అడ్డంగా కూలిపోయిన చెట్టును తొలగించే పనులు చేపట్టినట్లు బ్రిహ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) లోని విపత్తు సహాయక విభాగం అధికారులు చెప్పారు.

No comments:

Post a Comment