Tuesday, June 11, 2019

Japan`s pm discusses iran situation with trumph ahead of Tehran visit



ట్రంప్ తో ఫోన్ లో సంభాషించిన జపాన్ ప్రధాని
ఇరాన్ పర్యటనకు వెళ్లనున్న జపాన్ ప్రధాని షింబో అబె అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ తో టెలిఫోన్ లో సంభాషించారు. షింబో బుధవారం ఇరాన్ పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం ఈ విషయమై 20 నిమిషాల పాటు ట్రంప్ తో ముచ్చటించారని అబె కేబినెట్ చీఫ్ సెక్రటరీ (మంత్రి) యోషిహిడె సుగా విలేకర్లకు తెలిపారు. అమెరికా, జపాన్ దేశాలలో పరిస్థితులు, ప్రాంతీయ అంశాలు, ముఖ్యంగా ఇరాన్ ప్రస్తుత వ్యవహారాలు ఉభయ దేశాల నేతల మధ్య చర్చకు వచ్చాయన్నారు. 1978 తర్వాత జపాన్ ప్రధాని ఇరాన్ లో పర్యటించనుండడం ఇదే తొలిసారి. నాటి జపాన్ ప్రధాని టకియో ఫుకుడా ఇరాన్ లో పర్యటించారు. నాలుగు దశాబ్దాలుగా ఇస్లామిక్ వాదం ప్రపంచ పటంపై ప్రముఖంగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని అబె పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. అదీ గాక టెహరాన్(ఇరాన్) అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్న దరిమిలా అమెరికాతో ఆ దేశ ద్వైపాక్షిక సంబంధాలకు పూర్తిగా విఘాతం కల్గింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ దశలో జపాన్ ప్రధాని అబె ఇరాన్ లో పర్యటించాల్సి రావడంతో ముందుగానే అమెరికా అధ్యక్షుడితో సంభాషించి ముందడుగు వేస్తున్నారు. ఇరాన్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని అబె ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖొమైనీ, అధ్యక్షుడు హసన్ రౌహనిలను విడివిడిగా కలుసుకుని సంప్రదింపులు జరుపనున్నారు.

Cyclone 'Vayu': Heavy rainfall prediction for Goa



గోవాను వణికిస్తోన్న `వాయు` తుపాను
తుపాను `వాయు` ప్రభావంతో గోవాను బుధవారం భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన `వాయు` తుపాన్ కారణంగా భారీ వర్షాలతో పాటు 250కి.మీ. నుంచి 300 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వర్గాలు హెచ్చరించాయి. ఐఎండి గోవా ఇన్ చార్జి డైరెక్టర్ కె.వి.పడ్గల్వార్ వివరాలు వెల్లడిస్తూ `వాయు` తుపాను గోవాతో పాటు సౌరాష్ట్ర(గుజరాత్)పై తీవ్ర ప్రభావం చూపనుందన్నారు. రాగల 36 గంటల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పాటు నీటిమట్టం భారీగా పెరగనుందని చెప్పారు. పర్యాటకులు తీరంలో ఈతకు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. తుపాను తీవ్రతను బట్టి నారింజ రంగు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు పెను గాలులు, భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

dawan ruled out of icc world cup may rahul open the innings with rohit sarma



వరల్డ్ కప్ టీమిండియా ఓపెనర్ గా రాహుల్!
ప్రస్తుత వరల్డ్ కప్ లో భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానాన్ని కె.ఎల్.రాహుల్ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా బ్యాట్ ఝళిపించి స్కోరు బోర్డును పరిగెత్తించగల సత్తా అతనికి ఉంది. వరల్డ్ కప్ లో వరుసగా రెండో విజయంతో ఊపుమీదున్న భారత్ కు ధావన్ దూరం కావడం పెద్ద లోటే. ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఇన్నింగ్స్ 9 ఓవర్ లో బౌలర్ కమిన్స్ విసిరిన బౌన్సర్ కు ధావన్ గాయపడ్డాడు. ధావన్ గ్లోవ్ ను బలంగా తాకిన బంతి భుజాన్ని రాసుకుంటూ హెల్మట్ గ్రిల్ పైకి దూసుకు వచ్చింది. ప్రాథమిక చికిత్స అనంతరం ధావన్ యథావిధిగా ఇన్నింగ్స్ కొనసాగించి 109 బంతుల్లో 117 పరుగులు చేసి భారత్ ఘన విజయానికి బాటలు వేశాడు. 2015 వరల్డ్ కప్ లోనూ ధావన్ జట్టులో అత్యధికంగా 412 పరుగులతో(రెండు సెంచరీలు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ ఏడాదే వన్డేల్లో అత్యంత వేగంగా 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో భారత బ్యాట్స్ మన్ గా రికార్డుల కెక్కాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లోనూ ఓపెనర్ గా ధావన్ నుంచి జట్టు అత్యధిక పరుగుల్ని ఆశించింది. బొటనవేలు గాయానికి మూడు వారాల విశ్రాంతి అవసరం కావడంతో ధావన్ వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి నం.4 బ్యాట్స్ మన్ రాహుల్ పై పడింది. ఓపెనర్ గా రాణించే అవకాశాలు రాహుల్ కే ఎక్కువగా ఉన్నాయి. గతంలో పలు అంతర్జాతీయ మ్యాచ్ ల్లో వివిధ ఫార్మట్ లలో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనుభవం ఉంది. టి-20 లో రెండు సెంచరీలు, వన్డేలో ఓ సెంచరీ చేశాడు. 2019 ఐపీఎల్ లో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్ గా పలు మ్యాచ్ ల్లో రాణించాడు. ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ పై మ్యాచ్ లో ఓపెనర్ గా ఇన్నింగ్స్ ప్రారంభించి సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. అనుభవజ్ఞుడే ఇన్నింగ్స్ ప్రారంభించాలని టీం మేనేజ్ మెంట్ భావించి తప్పనిసరైతే  కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఓపెనర్ గా రోహిత్ తో జత కలవొచ్చు. భారతజట్టు లో కెప్టెన్ ఓపెనర్ గా క్రీజ్ లో రాణించిన వారు గతంలో పలువురున్నారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ మాదిరిగా కోహ్లి ఆ బాధ్యతలు తలకెత్తుకుంటాడా లేదా రాహుల్ నే ఓపెనర్ గా పంపుతాడో తదుపరి 13వ తేదీ న్యూజిలాండ్ మ్యాచ్ నాటికే తేలనుంది.


Monday, June 10, 2019

6 convicted in gang rape, murder of 8-yr-old girl in Kathua; 1 acquitted


ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం హత్య

కథువా కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష

ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం దారుణ హత్య కేసులో నిందితులు ముగ్గురికి యావజ్జీవ శిక్ష, మరో ముగ్గురికి అయిదేళ్ల కఠిన కారాగారం విధిస్తూ సోమవారం (జూన్10) పఠాన్ (పంజాబ్) కోర్టు తీర్పిచ్చింది. పఠాన్ కోట్ జడ్డి తేజ్విందర్ సింగ్ ఒకర్ని ఈ కేసు లో నిర్దోషిగా విడిచిపెట్టారు. బాలుడు ప్రధాన ముద్దాయి సాంజిరామ్ కొడుకుపై జమ్ము హైకోర్టులో విచారణ కొనసాగునున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.  గత ఏడాది జనవరి 10న దక్షిణ కశ్మీర్ లోని కథువా జిల్లాలో గుర్రాలను మేపడానికి నిర్జన ప్రదేశానికి వెళ్లిన బాలికను అపహరించుకుపోయిన దుండగులు వారంరోజుల పాటు ఓ గుడిలో ఉంచి మాదకద్రవ్యాలు (డ్రగ్స్) ఇస్తూ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలిక తలను బండకేసి కొట్టి హత్యచేశారు. ఈ దారుణం జనవరి 10న జరగ్గా 17వ తేదీన బాలిక శవాన్ని కనుగొన్నారు. కథువా జిల్లాలోని హీరానగర్ తహశిల్ లోని రాసనా గ్రామంలో జరిగిన ఈ అమానవీయ ఘోర ఘటనలో ప్రధాన ముద్దాయి సాంజి రామ్ తో పాటు మొత్తం ఎనిమిది మందిపై ఏప్రిల్ లో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. బాలికపై జరిగిన ఈ ఘోర కలిపై కశ్మీర్ సహా యావద్దేశం అట్టుడుకిపోయింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరుల్లో నిరసనలు మిన్నంటాయి. ఘటన తీవ్రత దృష్ట్యా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి కేసును పొరుగునున్న పఠాన్ కోట్ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు 7 మే 2018న ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా కోర్టు విచారణను ఏ రోజుకారోజు సుప్రీం పర్యవేక్షించింది.  గ్రామంలో జరిగిన స్వల్ప స్థల వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన నిందితుడు సాంజిరామ్ మైనార్టీ గిరిజన ముస్లిముల్ని (నొమడిక్ వర్గాన్ని) తమ ప్రాంతం నుంచి వెళ్లగొట్టే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. సాంజిరామ్, అతని కొడుకు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరందరి పైన విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ఘోరం జరిగిన సమయంలో సాంజిరామ్ కొడుకు విశాల్ జల్గోత్రా మీరట్ లో ఉన్నట్లు కోర్టుకు ఆధారాలు సమర్పించడంతో న్యాయమూర్తి సంశయ లాభం (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద అతణ్ని నిర్దోషిగా విడిచిపెట్టారు. ప్రధాన నిందితుడు సాంజిరామ్, దీపక్ ఖజురియా, పర్వేశ్ కుమార్ లకు  రణబీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) నేర శిక్షాస్మృతి మైనర్ అపహరణ, దారుణం శారీరక హింస, అత్యాచారం, పాశవిక హత్యా నేరాల కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సాక్ష్యాలను తారుమారు చేయడం, నాశనం చేయడం వంటి నేరానికి పాల్పడిన ప్రత్యేక పోలీసు అధికారి సురేందర్ జోషి, ఆనంద్ దిత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్ ముగ్గురుకి అయిదేళ్ల కఠిన కారాగారం రూ.50 వేల జరిమానా విధించారు.