Friday, June 7, 2019

dubai:8 indians among 17 killed in bus crash



దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం:8 మంది భారతీయుల సహా 17 మంది  

దుర్మరణం
దుబాయ్ లో శుక్రవారం(జూన్7) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒమన్ నుంచి వస్తున్న బస్ దుబాయ్ అల్ రషీదియా ఎగ్జిట్ రోడ్డుపై అతి వేగంగా ప్రయాణిస్తూ పక్కనే ఉన్న అడ్వర్టయిజ్ మెంట్ బోర్డును బలంగా ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 17 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో  అత్యధికులు ఒమన్ జాతీయులే. భారత్ కు చెందిన 8మంది ప్రాణాలు కోల్పోయారు. అల్ రషీదియా మెట్రో స్టేషన్ కు సమీపంలో ఈ ఉదయం 5.40 నిమిషాలకు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బోర్డును వేగంగా ఢీకొట్టిన క్రమంలో బస్ ఎడమ వైపు భాగం నుజ్జునుజ్జుయింది. ఆ వైపు కూర్చున్న ప్రయాణికులంతా మృతువాత పడినట్లు సమాచారం. రంజాన్ వేడుకలు ముగించుకుని ఒమన్ నుంచి తిరిగివస్తూ వీరంతా దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగే సమయానికి బస్ లో 31 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రుల్ని రషీద్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దుబాయ్ పోలీస్ చీఫ్ కమాండర్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలిఫా అల్ మెరి, దుబాయ్ అటార్ని జనరల్ ఎయిసమ్ ఎస్సా అల్ ముమైదన్ తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం బస్ డ్రైవర్ తప్పు మార్గంలో వాహనాన్ని నడిపాడు. అల్ రషీదియా మెట్రో స్టేషన్ వైపునకు అసలు బస్ ల ప్రవేశానికి అనుమతి లేదని తెలుస్తోంది. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం మస్కట్-దుబాయ్ ల మధ్య రోజుకు మూడు సార్లు నడిచే ఈ-05 బస్ సర్వీసుల్ని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేసింది. రషీద్ ఆసుపత్రికి చెందిన అనధికారిక వర్గాల  సమాచారం మేరకు మొత్తం 10 మంది భారతీయులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఆరుగురు కేరళీయులని సమాచారం.


Thursday, June 6, 2019

Prashant Kishor meets Mamata




సీఎం మమతతో ప్రశాంత్ కిశోర్ భేటీ


రాజకీయ వ్యూహ కర్త బిహార్ జనతాదళ్(యునైటెడ్) నాయకుడు ప్రశాంత్ కిశోర్(పీకే) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. గురువారం(జూన్6) వీరిద్దరు కోల్ కతాలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీ కార్యాలయంలో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కల్గించింది. గత కొద్ది కాలంగా టీఎంసీతో కలిసి పీకే పనిచేయనున్నారనే వార్తలకు ఈ భేటీ బలం చేకూర్చింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 18 లోక్ సభ స్థానాలు చేజిక్కించుకున్న దరిమిలా టీఎంసీ వర్గాల్లో కలవరం పెరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కేవలం 2స్థానాల్లోనే విజయం సాధించింది. 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా పీకేను దగ్గరకు తీసుకోవాలనే ఆత్రుత టీఎంసీ వర్గాల్లో పెరిగిపోయింది. పీకే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్త గా వ్యవహరించారు. 2015 ఎన్నికల్లో బిహార్ లో మహఘట్ బంధన్(ఆర్జేజీ,జేడీ(యూ),కాంగ్రెస్ కూటమి) వ్యూహకర్తగా పనిచేశారు. అనంతరం ఆయన జేడీయూ లో చేరి బిహార్ నాయకుడిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్.సి.పి. ప్రచార, వ్యూహకర్తగా పని చేశారు. ఆయన వ్యూహకర్తగా పనిచేసిన అన్ని పార్టీలు ఆయా ఎన్నికల్లో ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి. దాంతో దేశంలోనే గొప్ప రాజకీయ వ్యూహకర్తగా పీకే పేరు గడించారు.

at last kiwis won by 2 wickets against bangladesh


బంగ్లాదేశ్ పై గెలుపునకు చెమటోడ్చిన కివిస్
వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.9 లండన్ ఒవల్ మైదానంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు శ్రమించి ఎట్టకేలకు విజయం సాధించింది. టాస్ గెలిచిన కివిస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్ ను తొలుత బ్యాటింగ్ చేయాలని కోరాడు. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 49.2 ఓవర్లు ఆడి 244 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యం సునాయాసంగా కనిపించినా బంగ్లా బెబ్బులిలా పోరాడ్డంతో కివిస్ బ్యాట్స్ మన్ గెలుపునకు చెమటోడ్చాల్సి వచ్చింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ రాస్ టెలర్ 91 బంతుల్లో 82 పరుగులు చేయడంతో కివిస్ గెలుపు వాకిట నిలువగల్గింది. టెలర్ కు కేన్ విలియమ్సన్ 72 బంతుల్లో 40 పరుగులు అండగా నిలిచాడు. జట్టులో మార్టిన్ గుప్తిల్ 14 బంతుల్లో 25 పరుగులు, జేమ్స్ నిషమ్ 33 బంతుల్లో 25 పరుగులు చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. బంగ్లా బౌలర్లలో మొసాదెక్ హోసేన్ పొదుపుగా 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మహ్మద్ సైఫుద్దీన్ 41 పరుగులకు 2 వికెట్లు, మెహిది హసన్ 47 పరుగులిచ్చి 2 వికెట్లు, షాకిబ్ అల్ హసన్ 47 పరుగులకు 2 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. పటిష్టమైన కివిస్ జట్టు గెలుపు ఖాయమని తెలిసినా బంగ్లా బౌలర్లు క్రమతప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్ పై పట్టు సడలకుండా ఆడారు. ఓడినా తుదివరకు పోరాడి క్రికెట్ అభిమానుల్ని అలరించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టులో షాకిబ్ అల్ హసన్ 68 బంతుల్లో 64 పరుగులు, మహ్మద్ సైఫుద్దీన్ 29, మహ్మద్ మిథున్ 26 పరుగులతో బంగ్లా జట్టు 244 పరుగులు స్కోరు చేయగల్గింది. కివిస్ బౌలర్లలో మాథ్యూ జేమ్స్ హెన్రీ 47 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు, ఫెర్గుసన్,మిషెల్ శాంటనర్,గ్రాండ్ హోమ్ తలా ఓ వికెట్ తీశారు. ఈ రోజు మ్యాచ్ లో బంగ్లా బ్యాట్స్ మెన్ కన్నా ఆ జట్టు బౌలర్లు సమష్ఠిగా రాణించి క్రమతప్పకుండా కివిస్ బ్యాట్స్ మెన్ వికెట్లు తీస్తూ ఒత్తిడి తెచ్చారు. చివరికి న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. కివిస్ కిది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ లో శ్రీలంకపైనా గెలుపొందింది. బంగ్లాదేశ్ జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది.

Wednesday, June 5, 2019

Gujarat: Five killed as car jumps divider and hits tempo



గుజరాత్ లో కారు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంజాన్ పర్వదినం రోజున బుధవారం (జూన్5) ఉదయం కారు ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొన్న ప్రమాదంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన నవసరి జిల్లాలోని ఖరెల్ ప్రాంతంలో సంభవించింది. కారు సూరత్ కు ప్రయాణిస్తోంది. జాతీయ రహదారిపై అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు తొలుత రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి పక్క లైన్ లోకి ఎగిరిపడి దూసుకుపోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టెంపోను కారు బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ మితిమీరిన వేగంతో కారు నడుపుతుండడం వల్లే దానిపై నియంత్రణ కోల్పోయినట్లు గాన్దేవి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 20 ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది. కారు మొత్తం నుజ్జునుజ్జయిపోవడంతో అందులో నుంచి మృతదేహాల్ని చాలా సమయం శ్రమించి బయటకు తీయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గాన్దేవి ఆసుపత్రి మార్చురికి మృతదేహాల్ని తరలించారు.