Thursday, June 6, 2019

Prashant Kishor meets Mamata




సీఎం మమతతో ప్రశాంత్ కిశోర్ భేటీ


రాజకీయ వ్యూహ కర్త బిహార్ జనతాదళ్(యునైటెడ్) నాయకుడు ప్రశాంత్ కిశోర్(పీకే) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. గురువారం(జూన్6) వీరిద్దరు కోల్ కతాలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పార్టీ కార్యాలయంలో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కల్గించింది. గత కొద్ది కాలంగా టీఎంసీతో కలిసి పీకే పనిచేయనున్నారనే వార్తలకు ఈ భేటీ బలం చేకూర్చింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 18 లోక్ సభ స్థానాలు చేజిక్కించుకున్న దరిమిలా టీఎంసీ వర్గాల్లో కలవరం పెరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కేవలం 2స్థానాల్లోనే విజయం సాధించింది. 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా పీకేను దగ్గరకు తీసుకోవాలనే ఆత్రుత టీఎంసీ వర్గాల్లో పెరిగిపోయింది. పీకే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్త గా వ్యవహరించారు. 2015 ఎన్నికల్లో బిహార్ లో మహఘట్ బంధన్(ఆర్జేజీ,జేడీ(యూ),కాంగ్రెస్ కూటమి) వ్యూహకర్తగా పనిచేశారు. అనంతరం ఆయన జేడీయూ లో చేరి బిహార్ నాయకుడిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్.సి.పి. ప్రచార, వ్యూహకర్తగా పని చేశారు. ఆయన వ్యూహకర్తగా పనిచేసిన అన్ని పార్టీలు ఆయా ఎన్నికల్లో ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి. దాంతో దేశంలోనే గొప్ప రాజకీయ వ్యూహకర్తగా పీకే పేరు గడించారు.

at last kiwis won by 2 wickets against bangladesh


బంగ్లాదేశ్ పై గెలుపునకు చెమటోడ్చిన కివిస్
వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.9 లండన్ ఒవల్ మైదానంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు శ్రమించి ఎట్టకేలకు విజయం సాధించింది. టాస్ గెలిచిన కివిస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్ ను తొలుత బ్యాటింగ్ చేయాలని కోరాడు. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 49.2 ఓవర్లు ఆడి 244 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యం సునాయాసంగా కనిపించినా బంగ్లా బెబ్బులిలా పోరాడ్డంతో కివిస్ బ్యాట్స్ మన్ గెలుపునకు చెమటోడ్చాల్సి వచ్చింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ రాస్ టెలర్ 91 బంతుల్లో 82 పరుగులు చేయడంతో కివిస్ గెలుపు వాకిట నిలువగల్గింది. టెలర్ కు కేన్ విలియమ్సన్ 72 బంతుల్లో 40 పరుగులు అండగా నిలిచాడు. జట్టులో మార్టిన్ గుప్తిల్ 14 బంతుల్లో 25 పరుగులు, జేమ్స్ నిషమ్ 33 బంతుల్లో 25 పరుగులు చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. బంగ్లా బౌలర్లలో మొసాదెక్ హోసేన్ పొదుపుగా 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మహ్మద్ సైఫుద్దీన్ 41 పరుగులకు 2 వికెట్లు, మెహిది హసన్ 47 పరుగులిచ్చి 2 వికెట్లు, షాకిబ్ అల్ హసన్ 47 పరుగులకు 2 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. పటిష్టమైన కివిస్ జట్టు గెలుపు ఖాయమని తెలిసినా బంగ్లా బౌలర్లు క్రమతప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్ పై పట్టు సడలకుండా ఆడారు. ఓడినా తుదివరకు పోరాడి క్రికెట్ అభిమానుల్ని అలరించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టులో షాకిబ్ అల్ హసన్ 68 బంతుల్లో 64 పరుగులు, మహ్మద్ సైఫుద్దీన్ 29, మహ్మద్ మిథున్ 26 పరుగులతో బంగ్లా జట్టు 244 పరుగులు స్కోరు చేయగల్గింది. కివిస్ బౌలర్లలో మాథ్యూ జేమ్స్ హెన్రీ 47 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు, ఫెర్గుసన్,మిషెల్ శాంటనర్,గ్రాండ్ హోమ్ తలా ఓ వికెట్ తీశారు. ఈ రోజు మ్యాచ్ లో బంగ్లా బ్యాట్స్ మెన్ కన్నా ఆ జట్టు బౌలర్లు సమష్ఠిగా రాణించి క్రమతప్పకుండా కివిస్ బ్యాట్స్ మెన్ వికెట్లు తీస్తూ ఒత్తిడి తెచ్చారు. చివరికి న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. కివిస్ కిది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ లో శ్రీలంకపైనా గెలుపొందింది. బంగ్లాదేశ్ జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది.

Wednesday, June 5, 2019

Gujarat: Five killed as car jumps divider and hits tempo



గుజరాత్ లో కారు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంజాన్ పర్వదినం రోజున బుధవారం (జూన్5) ఉదయం కారు ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొన్న ప్రమాదంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన నవసరి జిల్లాలోని ఖరెల్ ప్రాంతంలో సంభవించింది. కారు సూరత్ కు ప్రయాణిస్తోంది. జాతీయ రహదారిపై అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు తొలుత రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి పక్క లైన్ లోకి ఎగిరిపడి దూసుకుపోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టెంపోను కారు బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ మితిమీరిన వేగంతో కారు నడుపుతుండడం వల్లే దానిపై నియంత్రణ కోల్పోయినట్లు గాన్దేవి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 20 ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది. కారు మొత్తం నుజ్జునుజ్జయిపోవడంతో అందులో నుంచి మృతదేహాల్ని చాలా సమయం శ్రమించి బయటకు తీయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గాన్దేవి ఆసుపత్రి మార్చురికి మృతదేహాల్ని తరలించారు.

Tuesday, June 4, 2019

srilanka beat afganistan by 34 runs cricket world cup match number 7


అప్ఘానిస్థాన్ పై 34 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక
వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.7లో అప్ఘానిస్థాన్ ను ఓడించి శ్రీలంక టోర్నీలో తొలి గెలుపునందుకుంది. మంగళవారం కార్డిఫ్ సోఫియా గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన అప్ఘాన్ కెప్టెన్ గుల్బద్దీన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పడుతూ లేస్తూ 201 పరుగులకు(36.5 ఓవర్లకే) ఆలౌటయింది. వర్షం కారణంగా మధ్యలో మ్యాచ్ కు ఆటంకం కల్గడంతో డక్ వర్త్ లూయిస్ నిబంధనలు(డీఎల్ఎస్) ప్రకారం 41 ఓవర్లలో 187 పరుగుల విజయలక్ష్యంతో అప్ఘాన్ బ్యాటింగ్ కు దిగింది.జట్టులో నజీబుల్లా జర్దాన్ 56 బంతుల్లో 43 పరుగులు, హజ్రతుల్లా జజయ్ 25 బంతుల్లో 30 పరుగులు, గుల్బద్దీన్ నయీబ్ 32 బంతుల్లో 23 పరుగులు మాత్రమే రాణించారు. స్వల్ప స్కోరు ను ఛేదించడం సులభమేనన్న భ్రమలో అప్ఘాన్ బ్యాట్స్ మన్ తేలిగ్గా తీసుకోవడంతోనే ఆరంభంలో త్వరత్వరగా వికెట్లను కోల్పోయారు. ఆ తర్వాత ఛేదనలో పుంజుకుంటున్న దశలో అప్ఘాన్ వికెట్లు కాపాడుకోలేక పోవడంతో ఓటమి పాలయింది. శ్రీలంక స్ట్రయిక్ బౌలర్లు నువాన్ ప్రదీప్ 4 వికెట్లు, లసిత్ మలింగా 3 వికెట్లు తిసర పెరెరా, ఇసుర ఉదాన చెరో వికెట్ తీసుకుని అప్ఘాన్ పతనాన్ని శాసించారు. 32.4 ఓవర్లకే ఆలౌటయిన అప్ఘానిస్థాన్ బ్యాట్స్ మన్ 152 పరుగులు మాత్రమే చేయగలిగారు. శ్రీలంక టోర్నీ తొలిమ్యాచ్ లో మూడ్రోజుల క్రితం ఇదే వేదికపై న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడినా 34 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో గెలిచి ముందంజ వేసింది. శ్రీలంక బ్యాట్స్ మన్లలో కుశాల్ పెరెరా 81 బంతుల్లో 78 పరుగులతో రాణించాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే 45 బంతుల్లో 30 పరుగులు, లహిరుతిరుమాన్నె 34 బంతుల్లో 25 పరుగుల చేయడంతో శ్రీలంక చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచగల్గింది. అప్ఘాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 4/30 రషీద్ ఖాన్2/17 దవ్లాత్ జర్దాన్ 2/34 రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్ (4/31) నిలిచాడు.