Wednesday, May 22, 2019

lok sabha polls 2019: highest ever voter turnout: election commission



లోక్ సభ ఎన్నికల్లో పెరుగుతూ వస్తోన్న ఓట్ల శాతం
గడిచిన ఒకటిన్నర దశాబ్దంగా జరుగుతున్న లోక్ సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓట్ల శాతం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇటీవల 17వ లోక్ సభ ఎన్నికల క్రతువు ఆరు వారాలు నిర్విఘ్నంగా కొనసాగి ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఏప్రిల్ 11న మొదలైన ఎన్నికల పోలింగ్ 7 దశల్లో మే 19న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 543 నియోజకవర్గాలకు గాను 542 స్థానాలకు(545 మంది మొత్తం సభ్యుల్లో 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియమిస్తారు) పోలింగ్ నిర్వహించారు. విచ్చలవిడిగా డబ్బుల కట్టలను కనుగొన్న తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గంలో  ఈసీ ఎన్నికను వాయిదా వేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 7దశల్లో సాగిన పోలింగ్ లో మొత్తం ఓటింగ్ 67.11 శాతంగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) పేర్కొంది. తొలిదశలో అత్యధికంగా 69.61 శాతం నమోదయింది. అన్ని రాష్ట్రాల్లో కన్నా హిమాచల్ ప్రదేశ్ లో ఈసారి అత్యధికంగా 72.25 శాతం ఓటింగ్ నమోదై రికార్డు నెలకొల్పింది. 2014 ఎన్నికల్లో 66.40 శాతం కన్నా ఈసారి కొంత మెరుగ్గా ఓటింగ్ జరిగింది. 2009 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మొత్తం 58.19 శాతమే ఓటింగ్ నమోదయింది. 2004లో 56 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Tuesday, May 21, 2019

mumbai model gets bail in fake currency case



నకిలీ నోట్ల కేసులో మోడల్ కు బెయిల్
నకిలీ నోట్లను బ్యాంక్ లో డిపాజిట్ చేసి అరెస్టయిన 28 ఏళ్ల మోడల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుపై గత నెల ఏప్రిల్ 19న ఆమెను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఆ మోడల్ సబర్బన్ బాంద్రా లోని బ్యాంక్ లో రూ.2 వేల నోట్లు 75 డిపాజిట్ చేశారు. అందులో 42 నోట్లు నకిలీవిగా కరెన్సీ కౌంటింగ్ మెషిన్ గుర్తించింది. బ్యాంక్ అధికారులు వాటిని పరిశీలించిన తర్వాత ఆమెపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. మోడల్ ఈ మొత్తాన్ని కేసులో సహ నిందితుడు రాహుల్ బరోద్ వద్ద నుంచి ఏవో అవసరాల నిమిత్తం తీసుకున్నట్లు ఆమె తరఫున లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిలో నకిలీ నోట్లు ఉన్న సంగతి ఆమెకు తెలియదని అందుకే తన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసేందుకు వెళ్లారని విన్నవించారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీస్ స్టేషన్ అధికారి కూడా ప్రాథమిక దర్యాప్తు లో ఆమెకు నకిలీ కరెన్సీని చలామణి చేసే ఉద్దేశం ఉన్నట్లు తేలలేదని కోర్టుకు తెలిపారు. ఏవ్యక్తి నకిలీ నోట్లను తమ సొంత బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసే సాహసం చేయరన్న ప్రాసిక్యూషన్ వాదనకు సమ్మతించిన అడిషనల్ సెషన్స్ జడ్జి ఎ.ఎం.ఖాన్ మోడల్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చారు.

PM Modi pays tribute to Rajiv Gandhi on his death anniversary



రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన మోదీ సోనియా రాహుల్ ప్రియాంక
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28 వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం (మే21) ఆయనకు  ఘన నివాళులర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ రాజీవ్ గాంధీ వర్ధంతి నేపథ్యంలో ఆయనకు ఘన నివాళులు అని పేర్కొన్నారు. యమునా నదీ తీరంలో గల వీర్ భూమి లోని రాజీవ్ సమాధిని సందర్శించి సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక ఘన నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సందేశంలో రాజీవ్ కు నివాళులర్పించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ ఆరో ప్రధానిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు పరిపాలించారు. 1991 మే 21న మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరంబుదుర్ బహిరంగ సభకు వెళ్లిన రాజీవ్ ను.. ఎల్టీటీఈ మానవబాంబు ద్వారా దారుణంగా హత్య చేసింది.

Monday, May 20, 2019

egyptian forces kill 12 suspected militants in raids

ఈజిప్టు భద్రతా బలగాల కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదుల హతం

ఈజిప్టులో భద్రతా బలగాలు సోమవారం(మే20) తనిఖీలు నిర్వహిస్తుండగా ఎదురపడిన 12 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఆదివారం ఈజిప్టు రాజధాని కైరోలోని గాజా పిరమిడ్ల సందర్శనకు వచ్చిన విదేశీయుల లక్ష్యంగా ఉగ్రవాదులు రోడ్డు పక్కన పెట్టిన బాంబు పేల్చడంతో బస్ లో ప్రయాణిస్తున్న 17 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గాజా పిరమిడ్లకు సమీపంలో నిర్మాణంలో ఉన్న పురావస్తు ప్రదర్శనశాల (మ్యూజియం) వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో బస్ లో మొత్తం 28 మంది ప్రయాణికులున్నారు. పేలుడు వల్ల మ్యూజియం కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పురావస్తు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈరోజు కాల్పులో చనిపోయిన 12 మంది ఉగ్రవాదులు బాంబు పేలుడు కుట్రదారులుగా భావిస్తున్నారు. అంతకుముందు ఈజిప్టులోని దక్షిణాఫ్రికా రాయబారి వుసి మువింబెల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు.