Wednesday, May 15, 2019

i`ll fight it won't apologise for sharing mamata's photo: bjp activist



జైల్లో చాలా ఇబ్బంది పెట్టారు..క్షమాపణలు చెప్పను: ప్రియాంక శర్మ
`నేనేమీ క్షమాపణలు చెప్పేంత తప్పు చేయలేదు..ఈ కేసుపై పోరాడతా` అని మమతా బెనర్జీ ఫొటో మార్ఫింగ్ కేసులో అరెస్టయిన బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రియాంక శర్మ అన్నారు. న్యూయార్క్ మెట్ గాలాలో పాల్గొన్న ప్రియాంకచోప్రా ఫొటోలో సీఎం మమత ఫొటోను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేయడం, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడంతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టింది.  సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బుధవారం(మే15) ఉదయం ఆమె అలీపూర్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు.  ఈ సందర్భంగా ఆమె విలేకర్ల తో మాట్లాడుతూ జైలులో తన పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారని చెప్పారు. జైలర్ తనను జైలు గది లోకి నెట్టి తలుపు వేశారన్నారు. అప్పుడు ఆయనతో తనేమీ నేరస్తురాలిని కాదని ఈ విధంగా నెట్టడమేంటని ప్రశ్నించానన్నారు. జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ప్రియాంక శర్మ చెప్పారు. జైలుకు తరలించడంపై తన కుటుంబంతో పాటు తను కూడా వేదన చెందానన్నారు. ప్రియాంకశర్మ విడుదల సందర్భంగా దక్షిణ కోల్ కతాలో గల జైలుకు పెద్ద సంఖ్యలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు చేరుకుని ఆమెకు ఆహ్వానం పలికారు.

madona`s performance in doubt may 18 Eurovision conest



యూరో విజన్ లో మడోనా పాల్గొనడం అనుమానమే!
ఇజ్రాయిల్ నగరం టెల్ అవివ్ లో మే18న జరుగనున్న యూరో విజన్ పాటల ప్రదర్శనలో ప్రఖ్యాత పాప్ గాయని మడోనా పాల్గొనడం అనుమానంగానే ఉంది. మడోనా పాల్గొంటున్నట్లు ఆమె తరఫు అమెరికా, బ్రిటన్ ప్రచారకర్తలు ఏప్రిల్ లోనే ప్రకటించారు. అయితే ఇంతవరకు ఆమె ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయలేదని యూరోవిజన్ ఎగ్జిక్యూటివ్ సూపర్ వైజర్ జాన్ ఒలా శాండ్ తెలిపారు. ఆమె కాంట్రాక్ట్ పై సంతకం పెడితేనే తమ వేదికపై ప్రదర్శన ఇవ్వగలరన్నారు. తొలుత మడోనా రెండు పాటలు ప్రదర్శించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజా ఆల్బమ్ `మేడమ్ ఎక్స్` నుంచి ఓ పాట, 1989లో పేరొందిన తన మరో పాటను ఆమె వేదికపై ప్రదర్శిస్తారని భావించారు. 2010  నుంచి యూరోవిజన్ ను నిర్వహిస్తున్న శాండ్ మాట్లాడుతూ ఇంకా మడోనాతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తమ వేదికపై ప్రఖ్యాత కళాకారులు పాల్గొనాలనే కోరుకుంటామని అయితే అందుకు కొన్ని నియమనిబంధనలు కూడా పెట్టుకున్నామని వివరించారు. మే18న యూరో విజన్ కార్యక్రమంలో ద్వితీయ అర్ధభాగం మడోనా పాటల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఆమె టెల్ అవివ్ చేరుకుని రిహార్సల్స్ లో పాల్గొనాల్సి ఉంది. ఒకవేళ మడోనా ప్రోగ్రాం రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన యూరో విజన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Tuesday, May 14, 2019

zimbabwe sold 97 elephants to china dubai for $2.7m



చైనా దుబాయ్ లకు ఏనుగుల్ని విక్రయించిన జింబాబ్వే
మా దేశంలో ఏనుగుల సంఖ్య పెరిగిపోతోంది.. వాటిని కాపాడుతూ పోషించే శక్తి మాకు లేదు.. అమ్మేస్తాం.. కొంటారా.. అంటోంది ఆఫ్రికా దేశం జింబాబ్వే. అందుకు తగ్గట్లు గానే ఆరేళ్లలో వంద లోపు ఏనుగుల్ని ఆ దేశం విక్రయాల ద్వారా వదిలించుకుంది. ఇటీవల లెక్కల ప్రకారం ఏనుగుల విక్రయం ద్వారా రూ.14 కోట్ల 55 లక్షలు(2.7మిలియన్ డాలర్లు) ఆర్జించింది. 2012 నుంచి ఇప్పటి వరకు చైనా, దుబాయ్ లకు జింబాబ్వే 97 ఏనుగుల్ని విక్రయించింది. ఇందులో చైనాకు అత్యధికంగా 93 ఏనుగుల్ని, దుబాయ్ కి నాలుగు ఏనుగుల్ని అమ్మేసింది. ఈ విషయన్ని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ప్రిస్కా ముఫ్మిర వార్తా సంస్థలకు తెలిపారు. విక్రయించిన ఏనుగులన్నీ రెండు మూడేళ్ల లోపువేనన్నారు. తమ అభరణ్యాలు, ఇతర పార్కుల్లో 55 వేల ఏనుగుల్ని మాత్రమే సంరక్షించగలమని అయితే ప్రస్తుతం జింబాబ్వేలో 85 వేల ఏనుగులున్నట్లు ఆయన వివరించారు. ఒక్కో ఏనుగును కనీసం రూ.9లక్షల నుంచి రూ.29లక్షలకు ($13,500- $41,500) విక్రయించామన్నారు. ముఖ్యంగా వేటగాళ్ల బారి నుంచి ఏనుగుల్ని రక్షించడం కూడా ఆఫ్రికా దేశాలకు ఇబ్బందిగానే పరిణమించింది. వాటిని సంరక్షించేందుకు అయ్యే ఖర్చును ఆ దేశాలు భరించే స్థితిలో లేవు. ఈ నేపథ్యంలో అవసరమైన దేశాలకు వాటిని విక్రయించడమే మార్గమని భావిస్తున్నాయి. బోట్స్వానా రాజధాని కసానే లో ఇటీవల జరిగిన ఎలిఫాంట్ సమ్మిట్ సందర్భంగా బోట్స్వానా, జాంబియా, నమిబియా, జింబాబ్వే దేశాల నేతలు ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విక్రయాల్లో ప్రస్తుతం జింబాబ్వే ముందు వరుసలో ఉంది.

116 iron nails wire removed from man's stomach in rajasthan faridabad



రాజస్థాన్ లో వ్యక్తి పొట్ట నుంచి 112 మేకుల్ని వెలికితీసిన వైద్యులు
రాజస్థాన్ లో ఓ వ్యక్తి కడుపులో వందల సంఖ్యలో మేకుల్ని కనుగొన్న వైద్యులు ఆశ్చర్యానికి గురయిన ఘటన ఇది. తీవ్రంగా కడుపు నొప్పితో బాధ పడుతున్న బుండికి చెందిన 42 ఏళ్ల భోలా శంకర్ కు ఫరిదాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు సోమవారం (మే13) శస్త్ర చికిత్స చేసి మేకుల్ని తొలగించారు. ఏకంగా 6.5 సె.మీ. పొడవుగల 112 మేకుల్ని చూసిన వైద్యులు ఆశ్చర్యచకితులయ్యారు. కొద్ది రోజుల క్రితం డాక్టర్ అనిల్ సైనీ సీటీ స్కాన్, ఎక్స్ రేలు తీసి శంకర్ కడుపులో మేకులున్నట్లు కనుగొన్నారు. అతనికి సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించి వాటిని విజయవంతంగా తొలగించారు. శంకర్, అతని కుటుంబ సభ్యులు తోట పనులు చేస్తుంటారు. అంత పొడవాటి మేకుల్ని శంకర్ ఎలా మింగాడన్నది వైద్యులకు అంతుచిక్కడం లేదు. పెద్ద సంఖ్యలో గల ఆ మేకులన్నీ శంకర్ జీర్ణకోశంలోని చిన్న ప్రేవుల్లోకి చేరుకుంటే ప్రాణానికి హాని జరిగేదని డా.సైనీ తెలిపారు.  అంతేగాక అతని కడుపులో నుంచి ఓ ఇనుప తీగను, ఇనుప గుళికను కూడా విజయవంతంగా వెలికి తీశామన్నారు. ప్రస్తుతం శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అతని మానసిక స్థితిపై కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఇదే తరహా శస్త్ర చికిత్సను ఫరిదాబాద్ వైద్యులు 2017లోనూ నిర్వహించి ఓ వ్యక్తి ప్రాణాల్ని కాపాడారు. బద్రియల్(56) కడుపులో నుంచి 2.5 సె.మీ పొడవున్న 150 సూదుల్ని నాడు వైద్యులు తొలగించారు.