Sunday, April 21, 2019

msdhoni career best in vain rcb beat csk in thriller ipl-12


ఆఖరి బంతికి ఆర్ సీ బీ విజయం


§ శివమెత్తిన ధోని..చివరి ఓవర్లో 24పరుగులు చేసినా తప్పని ఓటమి


   బెంగళూరు చిన్నస్వామి స్టేడియం మరోసారి ఉత్కంఠ పోరుకు వేదికయింది. ఆదివారం ఐపీఎల్ సీజన్-12 మ్యాచ్ లో అజేయంగా దూసుకువెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్ కే)ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీ బీ) ఒక్క పరుగు తేడాతో ఓడించింది. ఆర్ సీబీకి వరుసగా ఇది రెండో విజయం. టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లలో ఆర్ సీబీ 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ 7 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 37 బంతుల్లో అర్థ సెంచరీ 53 సాధించాడు. ఏబీ డివిలియర్స్(25), అక్షదీప్ నాథ్(24), మొయిన్ అలీ(26) రాణించారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్ కే వికెట్లు టపటపా పడిపోయాయి. 6-1, 6-2,17-3, 28-4 ఈ సంఖ్యలను చూస్తేనే డగ్ ఔట్ కు చేరాలనే సీఎస్ కే బ్యాటర్ల తొందర తెలుస్తుంది. డుప్లెసిస్, కేదార్ జాదవ్ లు అవుటయ్యారనే కంటే వికెట్లను పారేసుకున్నారంటే సబబుగా ఉంటుంది. క్రీజ్ లో ఉన్న రాయుడుతో ధోని జత కలిశాకే చెన్నై ఇన్నింగ్స్ కుదురుకుంది. అంతకు మించి బెంగళూరు సీమర్లు లైన్ అండ్ లెంగ్త్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై బ్యాట్స్ మన్ ను కట్టిపడేశారు. చక్కగా ఆడుతున్న రాయుడు(29) పెవిలియన్ కు చేరినా మ్యాచ్ ఫినిషర్ ధోని ఉండడంతో సీఎస్ కే ఆశలు సజీవంగా ఉన్నాయి. చివర్లో బ్రావో(5) కెప్టెన్ ధోనికి జత కలిశాడు. ఆఖరి 6 బంతుల్లో 26 పరుగులు చేయాలి. ధోని స్ట్రైకింగ్ లో ఉన్నాడు. తొలి బంతినే బౌండరీకి తరలించిన ధోని తర్వాత మూడు సిక్సర్లూ బాదాడు. ఒక సిక్సరయితే బంతి స్టేడియం బయటకు వెళ్లిపోయింది. చివరి బంతికి రెండు పరుగులు లేదా ఒక్కపరుగు చేస్తే సూపర్ ఓవర్.. ఉమేశ్ స్లో బాల్ వేయడంతో బైస్ రన్ కోసం ధోని పరిగెత్తుతూ ముందుకు వచ్చాడు. శార్దుల్ ను ఆర్ సీ బీ వికెట్ కీపర్ అద్భుతమైన త్రో తో రనౌట్ చేశాడు. దాంతో బెంగళూరు విజయదరహాసం చేసింది. స్కిపర్ ధోని 84 (48 బంతుల్లో 7x6, 5x4) నాటౌట్ గా నిలిచాడు. చెన్నై 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేయగల్గింది. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్ కు అవకాశాన్ని నిలుపుకుంది.

srilanka six blasts hit three churches three five star hotels as 140 killed over 400 injured

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు.. సినీ నటి రాధికకు త్రుటిలో తప్పిన ముప్పు

శ్రీలంక ఆదివారం(ఏప్రిల్21) బాంబు పేలుళ్లతో రక్త సిక్తమైంది. రాజధాని కొలంబో సహా నెగొంబొ, బట్టికలొవా ల్లోని చర్చిలు, స్టార్ హోటళ్లు లక్ష్యంగా జరిగిన పేలుళ్లకు 140 మందికి పైగా దుర్మరణం చెందారు. మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈస్టర్ సండే సందర్భంగా క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఉదయం 8.45 సమయంలో బాంబు పేలుళ్లు మొదలయినట్లు పోలీసు అధికారి రువాన్ గుణశేఖర తెలిపారు. మొత్తం ఆరు భారీ బాంబు విస్ఫోటనాలు సంభవించాయి. దాంతో మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లు రక్తసిక్తమయ్యాయి. కొలంబోలో 42 మంది, నెగొంబొలో 60 మంది, బట్టికలొవాలో 27 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలొదిరారు. మృతులు, క్షతగాత్రుల్లో పెద్ద సంఖ్యలో విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఈ పాశవిక బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఏ ఉగ్ర సంస్థ ఇంకా పేర్కొనలేదు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని దర్యాప్తు లో కుట్ర కోణం వెలుగుచూడగలదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. జాతుల సమస్యతో దశాబ్దాల పాటు నెత్తురోడిన శ్రీలంకలో ఇటీవల కాలంలో ఇంత పెద్దఎత్తున మారణహోమం జరగడం ఇదే తొలిసారి.
షాక్ కు గురైన నటి రాధిక 
తమిళ సినీ నటి రాధికా త్రుటిలో వరుస బాంబు పేలుళ్ల నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. కొలంబోలోని స్టార్ హోటల్ సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో రాధికా బస చేశారు. ఈ హోటల్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడుకు కొద్ది నిమిషాలు ముందే ఆమె బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన పట్ల రాధికా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆ తర్వాత విలేకర్లకు తెలిపారు.

Saturday, April 20, 2019

anna hazare says sweeping electoral reforms needed to end malpractices

సమూలంగా ఎన్నికల సంస్కరణలు అవసరం: హజారే
దేశంలో ఎన్నికల అక్రమాలు అరికట్టడానికి సమూలంగా సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని ప్రముఖ సామాజిక సేవ, ఉద్యమకర్త అన్నా హజారే అభ్రిపాయపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఓటర్లు డబ్బు తీసుకుని ఓటు వేయడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటర్లు మూల స్తంభాలన్నారు. ప్రస్తుత రాజకీయాల వల్ల అటు పార్లమెంట్, అసెంబ్లీల పవిత్రత అడుగంటిపోతోందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పార్టీలు, గుర్తులతో పోటీ ఎందుకన్నారు. భారత సంవిధానంలో ఎక్కడా పార్టీలు, గుర్తుల ప్రస్తావన లేదని కేవలం వ్యక్తి(నాయకుడు) అని మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు రాశారని హజారే గుర్తు చేశారు. 25 ఏళ్లు నిండిన భారతీయ పౌరులెవరైనా పోటీ చేయొచ్చన్నారు. ప్రజల్ని ఏదోవిధంగా మభ్యపెట్టి డబ్బు ఎరవేసి లోబర్చుకుని రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు, గుర్తుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) పలుమార్లు మనవి చేసినా స్పందన లేదని చెప్పారు. ప్రధాని మోదీకి అనేక అంశాలపై 32 లేఖలు రాసినా పట్టించుకోకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. లోక్ పాల్ దృష్టికి కూడా ఎన్నికల అవకతవకల విషయాన్ని తీసుకెళ్లానన్నారు. కచ్చితంగా ఈ అక్రమ దందాకు ఏదో ఒక రోజు చరమగీతం పాడగలమని హజారే ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో దశ పోలింగ్ లో భాగంగా ఈనెల 23న అహ్మద్ నగర్(మహారాష్ట్ర) లో ఓటు హక్కు వినియోగించుకుంటానని 81 ఏళ్ల హజారే తెలిపారు. సరైన అభ్యర్థికే ఓటు వేస్తానని లేదంటే నోటా (none of the above)  బటన్ నొక్కుతానని చెప్పారు.

judiciary is under threat says chief justice after reports of harassment allegations against him


న్యాయ వ్యవస్థ ప్రమాదంలో ఉంది: సీజేఐ గొగొయ్
దేశంలో న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం ప్రమాదంలో పడిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగొయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ మహిళ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది.  సీజేఐ గొగొయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో ఏ విధమైన ఆర్డర్ ఇవ్వకుండా విడిచిపుచ్చింది. ‘ఇది నమ్మలేకపోతున్నా..ఇంత చౌకబారు ఆరోపణలు ఎదుర్కొంటానని నేనెన్నడూ ఊహించలేదు’ అని గొగొయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘20 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా అవిశ్రాంతంగా పని చేశాను.. నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6.80 లక్షలు మాత్రమే.. ఏరోజూ అవినీతికి పాల్పడ లేదు..ఇదేనా భారత ప్రధానన్యాయమూర్తిగా నాకు ఇచ్చే రివార్డు’ అని ప్రశ్నించారు. ఈ నీచమైన ఆరోపణలు చేసిన మహిళపై పోలీస్ స్టేషన్లో రెండు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు సీజేఐ తెలిపారు. ప్రస్తుత పోకడలు న్యాయ వ్యవస్థను  బలి పశువును చేసేలా తయారయ్యాయని కానీ అలా ఎన్నటికీ జరగదని గొగొయ్ పేర్కొన్నారు. సీజేఐపై మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు ఏదో ఆశించి చేస్తున్న బెదిరింపు (బ్లాక్ మెయిల్)గా కనిపిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు.