Wednesday, April 17, 2019

CM reviews Polavaram project no worry about andhra pradesh election results


సీఎం పోలవరం పనుల సమీక్ష
·   ఏపీ ఎన్నికల ఫలితాలపై చింతలేదన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం (ఏప్రిల్17) పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. వేసవి కావడంతో తాగునీటి సరఫరాపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలపై తనకు చింతే లేదని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫలితాలు రావడానికి మే 23 వరకు చాలా సమయం ఉంది.. ప్రస్తుతం తన దృష్టంతా ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడ్డం..అభివృద్ధి పైనే ఉందని తెలిపారు. 2014 జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాను.. ఫలితాలు వచ్చే వరకు ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత తనదేనన్నారు. కొత్త విధానపర నిర్ణయాలు మినహా సాధారణ పరిపాలన సమర్ధంగా కొనసాగించాల్సి ఉందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అయిదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పేర్కొంటూ సీఎం ఇప్పటికే 69 శాతం పనులు పూర్తి చేశామని గత 45 రోజులుగా పనులు కొంత నెమ్మదించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.4,508 కోట్లు రీయింబర్స్ మెంట్ మొత్తం అందాల్సి ఉందన్నారు. తాగు నీటి ఎద్దడి నివారించేందుకు ఆయా ప్రాంతాల్లో 3,494 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ.184కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు.

a success story of twitter ceo jock dorsey with abnormal daily activities


వావ్ ట్విటర్ సీఈవో
ట్విటర్ సీఈవో జాక్ డోర్సి సాధించిన విజయం యువతకు చక్కటి ఆదర్శం. ఆ సక్సెస్ ఒక్కగంటలోనో, ఒక్క రోజులోనో వచ్చింది కాదు. ఏళ్ల తరబడి పరిశ్రమతోనే సాధించారు. అంతకు మించి అసాధారణ దినచర్యే తనను ముందుకు నడిపిందంటారాయన. డోర్సి ఉదయం 5కే నిద్ర లేస్తారు. గడ్డకట్టించే చల్లటి నీటితో స్నానం చేస్తారు.. రోజూ ఒకపూటే భోజనం చేస్తారు.. వారాంతంలో అయితే పూర్తిగా ఉపవాసమే.. సుమారు 9 కిలోమీటర్ల దూరంలోని ఆఫీసుకు నడిచే వెళ్తారు.. ఈ విషయాలన్నీ ఆయన ఓ ఫిట్ నెస్ పాడ్ కాస్ట్ షో లో వివరించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఇంతకీ 42 ఏళ్ల డోర్సి సంపద ఎంతో తెలుసా? ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 5 బిలియన్ డాలర్లు (రూ.3,450 కోట్లు). ఏటా ట్విటర్ యూజర్ల సంఖ్య 30 కోట్ల మంది కాగా డోర్సికి సంస్థ ద్వారా 2018 చివరి త్రైమాసికానికి సమకూరిన ఆదాయం 909 మిలియన్ డాలర్ల (రూ.630 కోట్లు)కు చేరుకుంది. ట్విటర్ షేర్లలో డోర్సికి 2.3శాతం వాటా ఉంది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడైన ఆయన అనేక పదవుల్లో ఒదిగిపోయి చివరికి సీఈవో స్థాయికి ఎదిగారు. స్క్వేర్ మొబైల్ పేమెంట్ సంస్థనూ ఆయన స్థాపించారు. పాడ్ కాస్ట్ షో లో డోర్సి తన దినచర్యను విపులీకరించారు. తెల్లవారగానే మూడు నిమిషాల పాటు చల్లటి నీటితో స్నానం చేశాక 15 నిమిషాలు 104 డిగ్రీల సెంటిగ్రేడ్ ఆవిరిలో ఉంటారట. గంట పాటు ధ్యానం కూడా తన దినచర్యలో భాగంగా ఉంటుందని తెలిపారు. సాయంత్రం ప్రొటీన్, సలాడ్ తీసుకొని రాత్రి వేళ బెర్రీలు, లేదా డార్క్ చాక్లెట్ తింటారట. ఈ విధంగా దినచర్య, ఆహార నియమాలు పాటించడం వల్ల రోజూ పగటి వేళ ఎంతో ఉత్సాహంగా చురుగ్గా పని చేయగల్గుతున్నట్లు వివరించారు. ఇలా 22 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నట్లు డోర్సి చెప్పారు.

Pet deer kills man in Australia in rare attack


ఆస్ట్రేలియాలో పెంపుడు లేడి దాడిలో భర్త మృతి భార్యకు గాయాలు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కు 200 కి.మీ. దూరంలోగల వంగరట్టా గ్రామంలో బుధవారం(ఏప్రిల్17)ఉదయం పెంపుడు లేడి దాడిలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. భర్త లేడికి ఆహారం అందిస్తుండగా కొమ్ములతో కుమ్మేసింది. ఘటనను చూసి అతనికి సహాయంగా భార్య వచ్చింది. దాంతో ఆమె పైనా లేడి దాడికి దిగింది. భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసు సార్జంట్ పాల్ పర్సెల్ విలేకర్లకు తెలిపారు. భార్య,భర్తల వయసు 46 కాగా వీరికి 10 ఏళ్ల కొడుకున్నాడు. లేడి తల్లి పైనా దాడి చేస్తుండడం చూసిన కొడుకు రక్షించడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. సమీపంలోని కర్రతో ఎదురుదాడికి దిగి ఆ లేడి నుంచి తల్లిని రక్షించినట్లు సమాచారం. ఇటువంటి పెంపుడి జంతువుల దాడిలో మనుషులు చనిపోయిన, గాయపడిన ఘటనలు ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో జరగలేదని తెలిసింది. ఈ సీజన్ లో ఎద సమయం కావడంతో లేడి విపరీతమైన కోపోద్రిక్తలకు గురికావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు జంతుశాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Tuesday, April 16, 2019

ec finally in action mode restricts four leaders from campaigning


ఈసీ కొరడా ఝళిపించింది

·  సుప్రీం తలంటుతో గుర్తుకు వచ్చిన అధికారాలు

ప్రజాస్వామ్య హితైషుల కోరిక నెరవేరింది. సుప్రీంకోర్టు తలంటడంతో ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) రాజకీయులపై పంజా విసిరింది. తమిళనాడు వేలూరు లోక్ సభ ఎన్నిక వాయిదా, ప్రచార పర్వంలో అదుపుతప్పిన నేతల నోటికి తాళం వేయడం, ఆంధ్రప్రదేశ్ లో అయిదు నియోజకవర్గాల్లో రీపోలింగ్ పై పరిశీలన వంటి కఠిన నిర్ణయాల్ని మంగళవారం (ఏప్రిల్16)ఈసీ తీసుకుంది. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పి.ఐ.ఎల్) పై సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్(సీజేఐ) నేతృత్వంలో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈసీపై పరుష వ్యాఖ్యల్ని చేసింది. స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంఘానికి ఆర్టికల్ 324 ప్రకారం సంక్రమించిన అధికారాలు గుర్తున్నాయా? లేక తామే గుర్తు చేయాలా? అంటూ సూటిగా ప్రశ్నించింది. దాంతో గంట వ్యవధిలోనే ఈసీ తనకు గల విశేషాధికారాల కొరడాను ఝళిపించింది.
రామ్ పూర్(యూపీ) అభ్యర్థులుగా ఉన్న జయప్రద(బీజేపీ) పై అజాంఖాన్(ఎస్.పి సీనియర్ లీడర్) చేసిన చౌకబారు విమర్శల్ని ఈసీ సీరియస్ గా పరిగణించింది. ‘17 ఏళ్లుగా మీకు తెలిసిన జయప్రద నాకు 17 రోజుల్లోనే పూర్తిగా అర్థమయింది.. ఆమె ధరించే లోదుస్తులు ఖాకీ అని’ అంటూ అజాంఖాన్ నిసిగ్గుగా వ్యాఖ్యానించారు. దాంతో ఈసీ ఆయన నోటికి తాళం వేసింది. మూడు రోజులు ఆయన ప్రచారం చేయరాదని ఆంక్షలు విధించింది. మేనకాగాంధీ (కేంద్రమంత్రి, బీజేపీ), మాయవతి(బీఎస్పీ అధినేత్రి), యోగి ఆధిత్య నాథ్(ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ) ప్రచార పర్వంపైన ఈసీ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. షహరాన్ పూర్ ఎన్నికల ప్రచారంలో మేనకా గాంధీ మాట్లాడుతూ ముస్లింలు తనకు ఓటు వేయకుంటే వారికోసం తను పనిచేయనని వ్యాఖ్యానించారు. దాంతో మేనకాగాంధీ కూడా మూడు రోజులు ప్రచారం నిర్వహించ కుండా ఈసీ ఆంక్షలు విధించింది.
షహరాన్ పూర్, బరేలీ ఎన్నికల సభల్లో మాయవతి ప్రచారం నిర్వహిస్తూ ముస్లింలు బీఎస్పీ, ఎస్పీ, ఆర్.ఎల్.డి. కూటమికే ఓటేయాలని కాంగ్రెస్ కు వేయొద్దని కోరారు. యోగి ఆధిత్యనాథ్ బడాన్ ర్యాలీలో మాట్లాడుతూ బీఎస్పీ, ఎస్పీ, ఆర్.ఎల్.డి. కూటమితో అలీ ఉంటే బీజేపీకి బజరంగ్ భలీ అండ ఉందని పేర్కొన్నారు. దాంతో మాయవతి, యోగి ఆధిత్యనాథ్ లు రెండు రోజుల పాటు ప్రచారం చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ అయ్యాయి.  తమిళనాడులో వేలూరులో పెద్ద ఎత్తున డబ్బు సంచులు బయట పడిన నేపథ్యంలో అక్కడ ఈనెల 18న జరగాల్సిన ఎన్నికని ఆక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న ముగిసిన ఎన్నికల్లో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి చోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్ కు సీఈవో ద్వివేదీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్ నిర్వహించే అంశంపై పరిశీలన చేస్తోంది.