Sunday, July 7, 2019

Drones, snipers to keep hawk's eye on Kanwar Yatra


యూపీలో కున్వార్ యాత్రకు పటిష్ఠ బందోబస్తు
ఉత్తరప్రదేశ్ మీదుగా ఈనెల 17న సాగే కున్వార్ యాత్ర పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఏటా జరిగే ఈ కున్వార్ యాత్రలో వేల మంది శివ భక్తులు పాల్గొంటారు. హిందువులు పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఈ కున్వార్ యాత్ర ప్రారంభమవుతుంది. హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి(ఉత్తరాఖండ్), సుల్తాన్ గంజ్(బిహార్) యాత్రల సమాహారమే ఈ కున్వార్ యాత్ర. ఇందులో పాల్గొన్న భక్తులు ఆయా ప్రాంతాల్లోని పవిత్ర గంగా జలాన్ని సేకరించి యాత్ర కొనసాగిస్తారు. ఇందుకుగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించింది. యూపీ ప్రధానకార్యదర్శి అనూప్ చంద్ర పాండే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒ.పి.సింగ్(డీజీపీ) ఆధ్వర్యంలో ఆదివారం గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ఈ సమావేశంలో ఢిల్లీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానికి పశ్చిమ యూపీకి చెందిన గౌతమ్ బుద్ధా నగర్, ఘజియాబాద్, హపూర్ జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి. లు హాజరయ్యారు.
యాత్రకు ఎటువంటి విఘాతం కల్గకుండా ఆధునాతన పరికరాలతో నిఘా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆకాశమార్గం(ఏరియల్ సర్వీలెన్స్)లో హెలికాప్టర్, డ్రోన్స్ మోహరించనున్నారు. ఉగ్రవాద నిరోధక దళం(యాంటీ టెర్రర్ స్క్వాడ్-ఏటీఎస్) సేవల్ని కున్వార్ యాత్ర మార్గంలో వినియోగించనున్నారు. ప్రతి 5 కి.మీ. పరిధిలో పోలీసు, ఇతర సహాయక దళాల్ని మోహరిస్తున్నారు. ఏదైనా సహాయానికి నంబర్ 100 కు డయల్ చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కున్వార్ యాత్ర సందర్భంగా 2017లో 36, 2018లో 17 అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నట్లు డీజీపీ సింగ్ తెలిపారు. ఈ ఏడాది భక్తులకు ఎటువంటి అవరోధాలు కల్గకుండా చూసేందుకు మొత్తం 8వేల మందితో కూడిన పోలీసు దళాల్ని వినియోగిస్తున్నామన్నారు. మీరట్ ముజ్ఫర్ నగర్, సహరాన్పూర్ మార్గంలో ఏటీఎస్ దళాల్ని మోహరిస్తున్నట్లు డీజీపీ వివరించారు. వీరికి తోడుగా స్నైపర్స్ (అజ్ఞాతంగా కావలి కాచే సాయుధ బృందం) ను సిద్ధం చేశామన్నారు. యాత్ర సజావుగా సాగేందుకు కున్వార్ యాత్ర మొబైల్ యాప్ ను రూపొందించినట్లు మీరట్ డివిజన్ కమిషనర్ అనిత మెష్రామ్ తెలిపారు.

No comments:

Post a Comment