Saturday, March 19, 2022

10 died 25 injured in bus accident in Karnataka

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

·        10 మంది దుర్మరణం, 15 మందికి గాయాలు

కర్ణాటకలోని ఓ ట్రావెల్స్ బస్ బోల్తా పడిన దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 26 మందితో ప్రయాణిస్తున్న ఎస్.వి.టి. బస్సు అతివేగంగా ప్రయాణిస్తుండడం వల్లే డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడిందని స్థానికులు తెలిపారు. వై.ఎన్.హోసకోట నుంచి పావగడకి బస్సు బయలుదేరింది. పలవలహళ్లి సమీపంలో ప్రమాదం బారినపడింది. ఈ దుర్ఘటనలో 15 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Monday, March 14, 2022

Chandrababu fires on Y.S.Jagan gov. visits West Godawari district today

కల్తీ సారా బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన కల్తీ సారా మృతుల కుటుంబ సభ్యుల్ని కలుసుకుని పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కల్తీ మద్యం మహమ్మారి రాష్ట్రంలో ఏరులై పారుతోందని ఇందుకు ప్రస్తుత వైఎస్ఆర్సీపీదే బాధ్యతన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అసెంబ్లీ ఆవరణలోని అగ్నిమాపకకేంద్రం నుంచి అసెంబ్లీ హాల్ ప్రధాన ద్వారం వరకు ప్లకార్డులు, మద్యం సీసాలు చేతపట్టుకుని ర్యాలీ తీశారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారనే కారణంతో అయిదుగురు టీడీపీ ఎమ్మెల్యేల్ని ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బాలవీరాంజనేయస్వామి, బుచ్చయ్యచౌదరి, పయ్యవుల కేశవ్ లు సస్పెండయిన వారిలో ఉన్నారు.

కల్తీ సారా ఘటనపై సీఎం భేటీ

ఏపీ అసెంబ్లీ లో సీఎం వై.ఎస్.జగన్‌తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయణ స్వామి భేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం వద్ద చర్చ జరిగింది. మరణాలకు కారణాలను మంత్రి ఆళ్ల నాని, ఏక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి సీఎంకు వివరించారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని జగన్ వారితో పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియపర్చాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ముఖ్యమంత్రి సూచించారు. ఘటనపై సభలో స్పందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Friday, March 11, 2022

Telangana CM KCR Diagnosed With 'Mild Chest Infection'

సీఎం కేసీఆర్ కి స్వల్ప అనారోగ్యం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఎడమవైపు ఛాతీలో కొద్దిగా నొప్పి వచ్చింది. దాంతో కేసీఆర్ ని హుటాహుటిన హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. అయితే ఈ ఆరోగ్య పరీక్షలు ఏటా యథావిధిగా నిర్వహించేవేనని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. రెండ్రోజులుగా కేసీఆర్ కొంచెం నలతగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యులు డా.ఎమ్వీరావు చెప్పారు. ఆయన ఎడమచెయ్యి లాగుతుందని తెలిపారన్నారు. భయపడాల్సింది ఏమీ లేదని కొద్దిపాటి ఇన్ఫెక్షన్ మాత్రమేనని డాక్టర్ రావు చెప్పారు. పరీక్షల సందర్భంగా ఆసుపత్రిలో ఆయన వెంట సతీమణి శోభ, కుమార్తె కవిత, మనుమడు హిమాన్షు, ఇతర కుటుంబసభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఈరోజు ఏర్పాటైన కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయింది. లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. 

Wednesday, March 9, 2022

CM KCR announces mega recruitment process for 91,142 jobs

కేసీఆర్.. సూపర్ హిట్

* అసెంబ్లీలో జాబ్స్ బాంబ్

* ప్రభుత్వ మెగా జాబ్ మేళా ప్రకటన

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అదరగొట్టారు. సుమారు లక్ష ఉద్యోగాల భర్తీ ప్రకటనతో సూపర్ హిట్ కొట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాక యావత్ దేశం దృష్టిని ఆయన అలవోకగా సాధించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆయన ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షాలకి, అటు కేంద్రంలో మోదీ సర్కారుకి నోటమాట రానట్లుగా జాబ్ బాంబ్ పేల్చారు. బుధవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన కేసీఆర్ ఏకబిగిన గంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న మొత్తం 91142 ఉద్యోగాల్ని ఈరోజే నోటిఫై చేస్తున్నామన్నారు. తక్షణం 80039 నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు సభ్యుల చప్పట్ల మధ్య ఘనంగా ప్రకటించారు. అదేవిధంగా 11103 కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తున్నామన్నారు. ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని చెప్పారు. ప్రతి ఏడాది ఉద్యోగ భర్తీ కేలండర్ విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్క హోంశాఖలోనే 18334 ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అలాగే విద్యాశాఖలో 20వేల పైచిలుకు పోస్టుల నియామకం చేపట్టనున్నట్లు చెప్పారు. వైద్యశాఖలో 12,755, బీసీ సంక్షేమశాఖ 4311, రెవెన్యూశాఖ 3560, ట్రైబల్ వెల్ఫేర్ 2399 పోస్టులు భర్తీ చేయనున్నారు.  ఈ పోస్టుల్లో 95శాతం స్థానికులకు రిజర్వేషన్ ఉంటుందని మిగిలిన 5 శాతం ఓపెన్ కేటగిరీ భర్తీ చేస్తామని సీఎం సగర్వంగా ప్రకటించారు.  తెలంగాణలో 11 ఏళ్ల తర్వాత గ్రూపుల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1: 503 పోస్టులు, గ్రూప్-2:582 గ్రూప్-3: కింద1373 గ్రూప్-4: 9168 ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామన్నారు. ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా గరిష్ఠ వయో పరిమితిని ప్రకటించడం విశేషం.