Monday, March 7, 2022

About 700 students are still trapped in Sumi, Ukraine

ఇంకా బంకర్లలోనే కొందరు..

ఉక్రెయిన్ లో ఇంకా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. సుమీ లోగల బంకర్లలో వీరంతా తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ లో నోఫ్లైజోన్ ఆంక్షలు నేటి నుంచి అమలు కావచ్చని భావిస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 700 మంది విద్యార్థులు సుమీలోనే  క‌నీస సౌక‌ర్యాలు లేక అల‌మ‌టిస్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులు దాటడానికి ఎదురుచూస్తున్నారు. అయితే రష్యా దాడులు తీవ్రమైన సమయంలో వారంతా ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. తొలుత వీరందర్ని రష్యా మీదుగా భారత్ కు తీసుకురావాలని మన రాయబార కార్యాలయం యత్నించింది. అయితే ప్రస్తుత తరుణంలో ఈ యత్నం ప్రమాదకరమని భావిస్తున్నారు. ఈ విద్యార్థుల్ని పోలెండ్, హంగేరీల మీదుగానే భారత్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Friday, March 4, 2022

CM YSJagan union minister Sekhawat Polavaram visit

కేంద్రమంత్రి పోలవరం సందర్శన

* సీఎం జగన్ తో కలిసి పునరావాస గృహాల పరిశీలన

ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సందర్శించారు. శుక్రవారం ఉదయం సీఎం జగన్ తో కలిసి ఆయన ఇందుకూరిపేటలోని పునరావాస గృహాల్ని పరిశీలించి అక్కడ సౌకర్యాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పూర్తికి కేంద్రం అన్ని విధాలా సహకారాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా షెకావత్ హామీ ఇచ్చారు. `పునరావాస కాలనీ అద్భుతంగా ఉంది.  కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాటకు మోదీ సర్కార్‌ కట్టుబడి ఉంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు పనుల పరిశీలనకు మధ్యలో మరోసారి పర్యటిస్తా`అని షెకావత్‌ తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ పోలవరం యావత్ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ ఏర్పాటుకు చేయూతనిస్తామని కేంద్రమంత్రి మాట ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పునరావాస పనులపై మరింత శ్రద్ధ పెట్టాలని అధికారుల్ని సీఎం కోరారు.

Monday, February 28, 2022

AP CM YSJagan launches third instalment jagananna thodu scheme

చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.526 కోట్లు 

జగనన్న తోడు పథకం కింద సుమారు 5లక్షల 10వేల మంది చిరువ్యాపారులకి మేలు చేకూరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సుమారు రూ.526కోట్ల మొత్తాన్నినేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కారు. ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సాయం అందనుంది. విడతల వారీగా లబ్ధిదారులు తమ రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. కాలవ్యవధి ప్రకారం రుణం చెల్లించిన అందరికీ వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా చిరువ్యాపారులకు తోడుగా ఉండడమే తమ లక్ష్యమని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే క్రమం తప్పకుండా రుణ వాయిదాలను బ్యాంకులకు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు జగనన్న తోడు కింద మూడో విడతతో కలిపి మొత్తం 14 లక్షల 16 వేల 14 మంది సాయం అందించినట్లయిందన్నారు. సోమవారం తాజాగా విడుదల చేసిన రూ.10 వేల వడ్డీ లేని రుణ సాయం అందని వారేవరైనా ఉంటే ఆందోళన చెందొద్దని సీఎం కోరారు. రుణ సాయం అందని వారు గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లను కలుసుకొని అవసరమైతే మళ్లీ జగనన్న తోడు పథకానికి దరఖాస్తు చేయాలన్నారు.

Thursday, February 24, 2022

Russia Attacks Ukraine, Air Raid Sirens Reported In Capital Kyiv

వార్ వన్ సైడ్

రష్యా అన్నంత పని చేసింది. ఉక్రెయిన్ తమ దేశంలో భాగమేనని మొదటి నుంచి చెబుతున్న రష్యా గురువారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) యుద్ధం ప్రకటించింది. గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ కీలక నగరాల్ని స్వాధీనంలోకి తెచ్చుకుంది. దేశంలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించిన ఉక్రెయిన్ ప్రతిఘటించి తీరతామని రష్యాకు సవాలు విసిరింది. రష్యా ఏకపక్ష దాడి, దురాక్రమణను ఐక్యరాజ్యసమితి అడ్డుకోవాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. బదులు చెప్పి తీరతామని రష్యాను అమెరికా మరోసారి హెచ్చరించింది. అధ్యక్షుడు జోబైడన్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. మరో వైపు ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ నిర్వహిస్తోంది. రష్యా సైనిక చర్యను నిలిపివేయాలని కోరింది. ఇప్పటికే రాజధాని కీవ్ ఎయిర్ పోర్ట్ ను రష్యా ఆక్రమించింది. ఉక్రెయిన్ లోని 23 అతికీలక ప్రాంతాల్లో రష్యా సైన్యం బాలిస్టిక్ మిస్సైల్స్ తో దాడి జరిపింది. త్రిముఖవ్యూహంతో ఉక్రెయిన్ భూభాగాన్ని చుట్టిముట్టిన రష్యా క్రమక్రమంగా ఆ దేశంలోకి చొచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. దాంతో ఉక్రెయిన్ హైవేలపై జనం పెద్ద సంఖ్యలో కార్లలో తరలిపోవడం కనిపిస్తోంది. ఇప్పటికే 11 నగరాల్లో రష్యా బలగాలు పాగా వేసినట్లు సమాచారం. బోరిస్పిల్, డాన్ బాస్, ఖార్కిన్, ఒడెస్సా, మరియుపోల్ తదితర ప్రాంతాల్లో రష్యా బాంబుల మోత మోగుతోంది. వాయు,జల, భూమార్గాల్లో రష్యా ముప్పేట దాడి చేస్తూ ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బెలారెస్, క్రిమియాలు రష్యాకు మద్దతుగా యుద్ధభేరి మోగిస్తున్నాయి. ఇంకో పక్క నాటో కూటమి ఉక్రెయిన్ కు బాసటగా యుద్ధానికి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 300 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలందుతున్నాయి.