Sunday, October 10, 2021

happy birthday s s rajamouli@20

దర్శకధీర@20

రాజమౌళి ఈ పేరు సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్. తెలుగు సినిమా పరిశ్రమను మరోసారి మహోన్నతంగా ప్రపంచానికి చూపించిన ఘనుడు. బాహుబలి-1,2 సినిమాలను నభూతో నభవిష్యతి అనే రీతిలో మలిచిన గ్రేట్ మేకర్. జూనియర్ ఎన్టీయార్ హీరోగా స్టూడెంట్ నం.1 చిత్రంతో పరిశ్రమలో మెగా ఫోన్ చేతపట్టాడు. ఓటమి మాట తన డిక్షనరీలో లేదని నిరూపించిన ఈ జక్కన పుట్టినరోజు ఈరోజు. రాజమౌళి దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్టీయార్, రామ్ చరణ్‌లతో  రౌద్రం రణం రుధిరం’ (RRR) అనే భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చాలా యేళ్ల తర్వాత తెలుగు తెరపై తళుకులీననున్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. చరిత్రలో అసలు కలవని  కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఫాంటసీ కథలకు క్లాస్, మాస్ పల్స్ జోడించి హిట్లు మీద హిట్లు కొడుతూ తనకు తనే సాటిగా దూసుకెళ్తున్నాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం` తన చివరి చిత్రంగా తీస్తానని పలు ఇంటర్వ్యూల్లో రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా బహుబలి చిత్రాల్ని తలదన్నే మరో చిత్రరాజమవుతుందనడంలో సందేహమే లేదు.

Thursday, September 2, 2021

Pawan Kalyan birthday Chiranjeevi and tollywood celebrities best wishes

పవన్ కల్యాణ్@50

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 50వ పుట్టినరోజుని ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు ఘనంగా జరుపుకుంటున్నారు. గురువారం ఆయన బర్త్ డే  సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి `తమ్ముడు నిప్పు కణం` అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. `సినీ కథానాయకులు, ప్రజా నాయకులు పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను` అంటూ ఏపీ మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయఅధ్యక్షుడు నారా  చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, అల్లు అర్జున్, అనసూయ, శ్రీముఖిలతో పాటు పలువురు పవన్‌కి విషెస్ అందించారు. `హ్యాపీ బర్త్‌డే బాబాయ్.. అన్ని విషయాల్లో మీకు మంచి జరగాలని, విజయం వరించాలని కోరుకుంటున్నా` అని వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు పవన్, రానాల తాజా సినిమా భీమ్లా నాయక్ కు సంబంధించిన టైటిల్ సాంగ్ ని చిత్ర యూనిట్ అభిమానులకు బర్త్ డే కానుకగా విడుదల చేసింది. ఆ సాంగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Sunday, August 29, 2021

Silver Girl Has Given A Gift To Nation': Bhavina Patel's Table Tennis Medal

భవినా పతకంతో దేశం గర్విస్తోంది: రాహుల్

టోక్యో పారా ఒలింపిక్స్ లో భవినా బెన్ పటేల్ సాధించిన పతకం దేశానికి గర్వకారణమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఆదివారం ఆమె టేబుల్ టెన్నిస్ లో రజత పతకాన్ని సాధించారు. పారా ఒలింపిక్స్ లో భారత్ కు లభించిన రెండో పతకమిది. టీటీ క్లాస్-4 విభాగంలో బంగారు పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన భవినా చైనా క్రీడాకారిణి యింగ్ జో చేతిలో 0-3తో ఓటమి పాలయ్యారు. అయినా ఆమె సాధించిన విజయం పట్ల దేశం గర్విస్తోందని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా భవినా సాధించిన పతకం దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చారిత్రక విజయంగా ట్విటర్ లో పేర్కొన్నారు.

Thursday, August 26, 2021

`Immediate Task Is Evacuation`: Centre At All-Party Meet On Afghanistan

మనవాళ్లని వెనక్కితేవడమే తక్షణ లక్ష్యం: జైశంకర్

అఫ్గనిస్థాన్ లో చిక్కుకున్న మనవాళ్లనందర్నీ త్వరగా వెనక్కి తీసుకురావడమే తక్షణ లక్ష్యమని కేంద్రప్రభుత్వం పేర్కొంది. తాలిబన్ల ఆకస్మిక పాలన అమలులోకి వచ్చిన నేపథ్యంలో అఫ్గనిస్థాన్ లో తాజా సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన ప్రజలతో పాటు సుమారు 15వేల మంది భారతీయులు అక్కడ నుంచి స్వదేశానికి చేరుకోవాలని ఎదురుచూస్తున్నారు. తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. 31 పార్టీలకు చెందిన ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లతో పాటు రాజ్యసభ, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్), ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే నాయకుడు టీఆర్ బాలు, మాజీ ప్రధాని దేవేగౌడ తదితరులు పాల్గొన్నారు. అఫ్గన్ సంక్షోభం గురించి మోదీ తాజాగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లతో ఫోన్ లో మాట్లాడినట్లు జైశంకర్ తెలిపారు. మనవాళ్లని త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  ఇందుకుగాను ఈ-వీసా పాలసీని అమలులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. సాధ్యమైనంత త్వరలో భారతీయులందర్నీ స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.