Thursday, April 15, 2021

4 persons from same family died after burnt alive in Visakhapatnam Madhurawada

కుటుంబాన్ని కడతేర్చి.. యువకుడి ఆత్మహత్య

బెహ్రెయిన్ లో స్థిరపడిన ఓ కుటుంబం విశాఖపట్నంలో కడతేరిన ఉదంతమిది. ఇంట్లోని పెద్ద కొడుకే తల్లి,తండ్రి, తమ్ముణ్ని చంపేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన సుంకర బంగారినాయుడు (52).. భార్య నిర్మల (44), దీపక్ (22) , కశ్యప్ (19) ఇద్దరు కొడుకులతో నగరంలో నివాసముంటున్నారు. మధురవాడ లోని మిథిలాపురి కాలనీలో ఆదిత్య ఫార్చ్యూన్స్ (ఫ్లాట్ నెం.505)లో  అద్దెకు దిగారు. ఎనిమిది నెలల నుంచి ఈ కుటుంబం ఇక్కడి గెటెడ్ కమ్యూనిటీకి చెందిన అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ఎన్.ఐ.టి.లో ఇంజనీరింగ్ చేసిన దీపక్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం సివిల్స్ కు సిద్ధమవుతున్నాడు. ఆ మానసిక ఒత్తిడితోనే ఇంట్లో తరచు గొడవపడేవాడని ఇరుగుపొరుగు వారి కథనం. గురువారం తెల్లవారుజామున కూడా ఇంట్లో గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. తండ్రి, తల్లి, తమ్ముణ్ని దీపక్ కొట్టి చంపడంతో వారి తలలపైన ఒంటిపైన తీవ్ర గాయాలున్నాయి. ఇంటి లోపల నేల, గోడలపై రక్తపు మరకల్ని గుర్తించినట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం కుటుంబ సభ్యుల్ని హత్య చేసి వారిపై పెట్రోల్ పోసి అంటించిన అనంతరం దీపక్ కూడా ఒంటికి నిప్పుపెట్టుకున్నట్లు తెలిపారు. దాంతో మొత్తం నాలుగు మృతదేహాలు కాలిన స్థితిలో పోలీసులు గుర్తించారు. తొలుత అగ్నిప్రమాదం జరిగి కుటుంబం సజీవదహనం అయినట్లు భావించారు. గెటెడ్ కమ్యూనిటీ కావడంతో బయట వ్యక్తులు లోపలకు వచ్చే వీలులేనందున ఆత్మహత్యలై ఉండొచ్చని ఆ తర్వాత అనుమానించారు. చివరకు పోలీసులు చుట్టుపక్కల విచారణ చేపట్టడంతో దీపక్ ఈ హత్యలకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 

Thursday, April 1, 2021

AP CM YSJagan launches covid vaccination for above 45 years people

కరోనా వ్యాక్సినేషన్ లో దేశానికే ఏపీ ఆదర్శం: సీఎం

కోవిడ్ టీకా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యావద్దేశానికే ఆదర్శంగా నిలవనుందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్‌ భారతితో కలిసి వెళ్లిన సీఎం జగన్ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. జగన్ తో పాటు భారతికి కూడా ఈ రోజు తొలిడోసు టీకా వేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జగన్ మాట్లాడుతూ కరోనాను నిలువరించలేమని దానితో సహజీవనం తప్పదని చెప్పారు. అయితే నివారణకు మనదగ్గర ఉన్న ఏకైక అద్భుత అస్త్రం టీకాయేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో మనకున్న వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ జాతీయస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ లో ఏపీని ముందువరుసలో నిలబెట్టగలవని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు రెండునెలల్లో రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా వేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

Monday, March 29, 2021

Bus accident near Visakhapatnam five passengers dead 30 injured

 విశాఖ హైవే రక్తసిక్తం

విశాఖపట్నం-విజయనగరం హైవే రక్తమోడింది. విజయనగరం జిల్లా సుంకరపేట వద్ద సోమవారం ఉదయం జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. గ్యాస్ లారీ, రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 30 మంది క్షతగాత్రులయ్యారు. వీరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఎదురెదురుగా వచ్చిన గ్యాస్ సిలండర్ల లారీ, ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అదే సమయంలో విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు  ప్రమాదానికి గురైన బస్సును ఢీకొంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే డంపింగ్ యార్డ్ ఉండడం.. తెల్లవారుజామున అక్కడ ఉన్న చెత్తను తగులబెట్టడంతో విపరీతంగా వెలువడిన పొగ కారణంగా డ్రైవర్లకు రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దాంతో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హటాహుటిని దుర్ఘటనా స్థలానికి  చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందులో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Friday, March 26, 2021

President Ramnath Kovind visits army hospital after experiencing chest discomfort

ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి

స్వల్ప అస్వస్థత కారణంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆర్మీ రిసెర్చ్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పిగా అనిపించడంతో రాష్ట్రపతి భవన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. ఈమేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రాష్ట్రపతి ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. దేశంలో రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలోనే రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. మార్చి 8న ప్రథమ మహిళ ఆయన సతీమణి సవితా కోవింద్‌ కు టీకా వేశారు.