Saturday, February 27, 2021

TDP chief Chandra Babu completed his tour in kuppam

కుప్పంలో జూ.ఎన్టీఆర్ రావాలని నినాదాలు

చంద్రబాబు సమక్షంలోనే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పార్టీ ప్రచారబాధ్యతలు చేపట్టాలనే నినాదాలు మిన్నంటాయి. పంచాయతీ ఎన్నికల అనంతరం సొంత నియోజకవర్గం కుప్పంకు విచ్చేసిన చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కుప్పంలో గడిచిన మూడు రోజులుగా ఆయన విస్తృతంగా పర్యటించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మూడు నెలలకోసారి కుప్పంలో పర్యటిస్తానన్నారు. తనకు వీలులేకుంటే లోకేశ్ వచ్చి పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని సూచించారు. పర్యటన అనంతరం శనివారం ఆయన బెంగళూరు మీదుగా హైదరాబాద్ పయనమయ్యారు.

Wednesday, February 24, 2021

Ghatkesar B-pharmacy student commit suicide

ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని

బలవన్మరణం

తనను కిడ్నాప్ చేసి ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం చేశారనే డ్రామాతో హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఘట్‌కేసర్ విద్యార్థిని బుధవారం తుదిశ్వాస విడిచింది. ఆమె బలవన్మరణానికి పాల్పడ్డం యావత్ నగరవాసుల్ని కలచివేసింది. ఆ కేసులో తీవ్ర విమర్శల పాలైన విద్యార్థిని తొలుత మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్యం అందించి వైద్యులు ఇంటికి పంపారు. ఇంటికి వచ్చిన యువతి తిరిగి నిన్న రాత్రి మరోసారి షుగర్ ట్యాబ్లెట్లు మింగింది. ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సదరు యువతి కిడ్నాప్ డ్రామా ఆడి 10 రోజులవుతోంది. పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం వైద్యుల సూచనమేరకు ఆమెను మానసిక చికిత్సాలయానికి తరలించారు. కౌన్సిలింగ్ చేసి చికిత్స అందిస్తున్నారు. అంతలోనే మళ్లీ ఆత్మహత్యకు పాల్పడ్డంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Saturday, February 20, 2021

YSSharmila shouts `Jai Telangana` slogan for the first time

తెలంగాణకు జై కొట్టిన షర్మిల

రాజన్న తనయ వై.ఎస్.షర్మిల తొలిసారి తెలంగాణకు జై కొట్టారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో ఉన్న ఆమె వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం షర్మిల స్వగృహం లోటస్ పాండ్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభిమానులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వై.ఎస్ తన పాలనలో పేదలు లక్షాధికారులు కావాలని ఆశించారన్నారు. వారి పిల్లలు ఉచితంగా ఉన్నత, వృత్తి విద్యలు చదువుకొని గొప్పవారు అవ్వాలని కలలు కన్నారని గుర్తు చేశారు. రైతే రాజులా తలఎత్తుకుని జీవించేలా పాలించారని షర్మిల చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని తమతమ ప్రాంతాల్లో జీవనస్థితిగతుల గురించి నిర్భయంగా నిజాయతీగా అభిప్రాయాలు వెల్లడించాలని అభిమానుల్ని కోరారు.  ఆ ఫీడ్ బ్యాక్ తో రానున్న కాలంలో తాము ఏవిధంగా ముందడుగు వేయాలనేది ఆలోచన చేస్తామన్నారు. అందుకనుగుణంగా 11 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని వారి ముందుంచారు. ఈ సమావేశం సదర్భంగా షర్మిల భావోద్వేగంతో మాట్లాడుతూ రాజన్న తెలంగాణకు ఎంతో చేశారని అందువల్లే ఆయన చనిపోయినప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గుండెలాగిపోయి మరణించారన్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే తెలంగాణకు తమ వంతు సేవలందిస్తామని చెప్పారు. దాంతో సమావేశానికి హాజరైన వారు ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేశారు. ప్రతిగా షర్మిల కూడా పలుమార్లు జై తెలంగాణ అంటూ వారితో గొంతు కలిపారు.

Friday, February 19, 2021

Kerala Doctors Remove Whistle Stuck In Woman's Respiratory System For 25 Years

25 ఏళ్లుగా మహిళ గొంతులో ఇరుక్కున్న విజిల్

  ·శస్త్రచికిత్స ద్వారా వెలికితీసిన కేరళ వైద్యులు

కేరళలోని కన్నూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు ఒక మహిళకు వీడని పీడ నుంచి విముక్తి  కలిగించారు. సదరు మహిళ శ్వాసకోశ వ్యవస్థ నుంచి విజిల్‌ను విజయవంతంగా వెలికితీశారు. దాంతో 25 ఏళ్లుగా విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆమెకు ఉపశమనం లభించింది. కేరళకు చెందిన ఆ మహిళ తన 15వఏట అనుకోకుండా ఈల మింగింది. అప్పుడు కంగారు పడిన బాలిక అధికంగా నీరు తాగింది. అంతటితో ఆ విజిల్  సమస్య తీరిపోయినట్లు భావించి మిన్నకుండిపోయింది. అయితే ఆ ఈల బాలిక గొంతు నుంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళంలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమెకు దగ్గు వీడని పీడగా మారింది. అలా రెండు దశాబ్దాలపాటు తీవ్రమైన దగ్గుతో బాధపడుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె 40వ పడిలోకి చేరింది. దగ్గు అంతకంతకు పెరిగిపోతుండడంతో తొలుత ఆస్తమా సోకిందని వైద్యులు అనుకున్నారు. కన్నూర్ జిల్లా మత్తన్నూరులో నివసిస్తున్న ఆమెకు వైద్యం అందిస్తోన్న ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ఏదో వస్తువు గొంతులో ఇరుక్కున్నట్లు గుర్తించారు. కేసును ప్రభుత్వ వైద్య కళాశాలకు రిఫర్ చేశారు. మెడికల్ కాలేజీ వైద్యులు రాజీవ్ రామ్, పద్మనాభన్ బృందం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి గాలిగొట్టంలో ఇరుక్కున్న విజిల్‌ను బయటకు తీసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సుదీప్ తెలిపారు.