Saturday, February 20, 2021

YSSharmila shouts `Jai Telangana` slogan for the first time

తెలంగాణకు జై కొట్టిన షర్మిల

రాజన్న తనయ వై.ఎస్.షర్మిల తొలిసారి తెలంగాణకు జై కొట్టారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో ఉన్న ఆమె వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం షర్మిల స్వగృహం లోటస్ పాండ్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభిమానులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వై.ఎస్ తన పాలనలో పేదలు లక్షాధికారులు కావాలని ఆశించారన్నారు. వారి పిల్లలు ఉచితంగా ఉన్నత, వృత్తి విద్యలు చదువుకొని గొప్పవారు అవ్వాలని కలలు కన్నారని గుర్తు చేశారు. రైతే రాజులా తలఎత్తుకుని జీవించేలా పాలించారని షర్మిల చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని తమతమ ప్రాంతాల్లో జీవనస్థితిగతుల గురించి నిర్భయంగా నిజాయతీగా అభిప్రాయాలు వెల్లడించాలని అభిమానుల్ని కోరారు.  ఆ ఫీడ్ బ్యాక్ తో రానున్న కాలంలో తాము ఏవిధంగా ముందడుగు వేయాలనేది ఆలోచన చేస్తామన్నారు. అందుకనుగుణంగా 11 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని వారి ముందుంచారు. ఈ సమావేశం సదర్భంగా షర్మిల భావోద్వేగంతో మాట్లాడుతూ రాజన్న తెలంగాణకు ఎంతో చేశారని అందువల్లే ఆయన చనిపోయినప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గుండెలాగిపోయి మరణించారన్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే తెలంగాణకు తమ వంతు సేవలందిస్తామని చెప్పారు. దాంతో సమావేశానికి హాజరైన వారు ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేశారు. ప్రతిగా షర్మిల కూడా పలుమార్లు జై తెలంగాణ అంటూ వారితో గొంతు కలిపారు.

Friday, February 19, 2021

Kerala Doctors Remove Whistle Stuck In Woman's Respiratory System For 25 Years

25 ఏళ్లుగా మహిళ గొంతులో ఇరుక్కున్న విజిల్

  ·శస్త్రచికిత్స ద్వారా వెలికితీసిన కేరళ వైద్యులు

కేరళలోని కన్నూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు ఒక మహిళకు వీడని పీడ నుంచి విముక్తి  కలిగించారు. సదరు మహిళ శ్వాసకోశ వ్యవస్థ నుంచి విజిల్‌ను విజయవంతంగా వెలికితీశారు. దాంతో 25 ఏళ్లుగా విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆమెకు ఉపశమనం లభించింది. కేరళకు చెందిన ఆ మహిళ తన 15వఏట అనుకోకుండా ఈల మింగింది. అప్పుడు కంగారు పడిన బాలిక అధికంగా నీరు తాగింది. అంతటితో ఆ విజిల్  సమస్య తీరిపోయినట్లు భావించి మిన్నకుండిపోయింది. అయితే ఆ ఈల బాలిక గొంతు నుంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళంలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమెకు దగ్గు వీడని పీడగా మారింది. అలా రెండు దశాబ్దాలపాటు తీవ్రమైన దగ్గుతో బాధపడుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె 40వ పడిలోకి చేరింది. దగ్గు అంతకంతకు పెరిగిపోతుండడంతో తొలుత ఆస్తమా సోకిందని వైద్యులు అనుకున్నారు. కన్నూర్ జిల్లా మత్తన్నూరులో నివసిస్తున్న ఆమెకు వైద్యం అందిస్తోన్న ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ఏదో వస్తువు గొంతులో ఇరుక్కున్నట్లు గుర్తించారు. కేసును ప్రభుత్వ వైద్య కళాశాలకు రిఫర్ చేశారు. మెడికల్ కాలేజీ వైద్యులు రాజీవ్ రామ్, పద్మనాభన్ బృందం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి గాలిగొట్టంలో ఇరుక్కున్న విజిల్‌ను బయటకు తీసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సుదీప్ తెలిపారు.

Wednesday, February 17, 2021

Kalyanamasthu scheme revived after 10 years in Tirumala

మే 28 నుంచి మళ్లీ కల్యాణమస్తు!

తిరుమలలో మళ్లీ కల్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారయింది. దాదాపు దశాబ్దం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మళ్లీ ఈ కార్యక్రమం ప్రారంభించదలిచింది. దేశవ్యాప్తంగా కల్యాణమస్తు పేరిట సామూహిక వివాహాల్ని టీటీడీ నిర్వహించనుంది.  ఈ ఏడాది మే 28  మధ్యాహ్నం 12.34  నుంచి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుంచి 11:08  వరకు,  నవంబర్ 17 ఉదయం 9:56 నుంచి 10.02 వరకు కల్యాణమస్తు ముహూర్తాలు ఖరారు చేశారు. పాలకమండలిలో చర్చించి పెళ్లిళ్ల వేదికలను నిర్ణయిస్తామని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు.  కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా వివాహం చేసుకున్న వారికి  మంగళసూత్రం, నూతన వస్త్రాలు, 40 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామన్నారు.

Tuesday, February 9, 2021

YSSharmila`s new party YSRTP!

షర్మిల కొ్త్త పార్టీ వైఎస్ఆర్టీపీ!

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఈ రాష్ట్రంలో రాజన్నరాజ్యం మళ్లీ రావాల్సి ఉందని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల పేర్కొన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె మంగళవారం స్వగృహం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత షర్మిల నల్గొండకు చెందిన వైఎస్ అనుచరులైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. ఈరోజు ఫిబ్రవరి 9 వైఎస్ఆర్, విజయమ్మల పెళ్లిరోజని శుభసూచకంగా ఈ ఆత్మీయ సమావేశాలకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తను మాట్లాడ్డానికి రాలేదని వారు చెప్పేది వినడానికి వచ్చానన్నారు. స్థానికంగా గల సాధకబాధకాలు వినాలనుకుంటునట్లు చెప్పారు. ఈ రాష్ట్రానికి ఆనాటి వైఎస్ పాలన కావాలని తాము తీసుకువస్తామని షర్మిల తెలిపారు. ఆమె ప్రారంభించనున్న కొత్త పార్టీకి వైఎస్ఆర్టీపీగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఈసరికే ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. తెల్లనిరంగుపై మండే సూర్యుడి చిహ్నంతో జెండా కూడా ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా ఆమె మళ్లీ పాదయాత్ర చేపట్లనున్నట్లు తెలుస్తోంది.