Wednesday, December 16, 2020

TRS gets cracking on crucial Nagarjunasagar bypoll

మార్చిలో తిరుపతి, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు!

తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక మార్చిలో జరగవచ్చని తెలుస్తోంది. ఆ మేరకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇటీవల నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాలమరణం చెందిన సంగతి తెలిసిందే. దాంతో టీఎస్ లో మరో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల సీటును పార్టీ కోల్పోయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాలమరణంతో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదు. మరోసారి అలా జరగకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వైఎస్ఆర్ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించారు. ఆ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఈ రెండు స్థానాలకు మార్చిలో ఒకేసారి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tuesday, December 15, 2020

Eluru mystery disease: Traces of organochlorine, organophosphorus found in blood samples

వీడిన ఏలూరు వింత వ్యాధి మిస్టరీ

ఎట్టకేలకు ఏలూరు వింత వ్యాధి గుట్టును కేంద్ర వైద్య బృందాలు రట్టు చేశాయి. కూరగాయల్లో మోతాదు మించిన పురుగుల మందులు వాడకం, అదే విధంగా కల్తీ బియ్యం కూడా కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  వింత వ్యాధి బారిన పడిన బాధితుల రక్తంలో సీసం, నికెల్ ఉన్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. మరికొన్ని సంస్థలు మాత్రం బాధితులు తీసుకున్న ఆహారంలో పురుగుల మందు వంటి రసాయన అవశేషాలు ఉన్నట్లుగా ప్రాథమిక పరిశోధన ఫలితాల్లో వెల్లడించాయి. మూర్చ, నోట్లో నురగ, తలనొప్పి, వికారం, వాంతులు, మతిమరపు, వెన్నునొప్పి, ఆందోళన వంటి లక్షణాలతో వందల మంది గత వారంలో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే 622 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. అందులో ఒకరు మృత్యుపాలయిన సంగతి తెలిసిందే. బాధితుల్లో 90శాతం మంది డిశ్చార్జి అయ్యారు. అయితే గాలి, నీరు ద్వారా వింత వ్యాధి ప్రబలలేదని స్పష్టమయింది. అలాగే పాలు, మాంసాహారం కారణం కాదని సమాచారం. కార్తీక మాసం కావడంతో చికెన్, మటన్ విక్రయాలు కూడా తగ్గాయి. అదీ గాక బాధితుల్లో 83 శాతం మంది  వ్యాధికి గురైన సమయంలో కేవలం శాకాహారం భోజనమే చేసినట్లు చెప్పారు. తాజా నివేదిక ప్రకారం కూరగాయల్లో పురుగుల మందుల అవశేషాలు కనిపించాయి. బియ్యంలో పాస్పరస్ ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తోంది.

Monday, December 14, 2020

Thousands of iPhones looted, violence cost us Rs 440 crore in Wistron Bengaluru


 కోలారు ఐఫోన్ ప్లాంట్ విధ్వంసంలో నష్టం రూ.440 కోట్లు

 వేతనాలు చెల్లించాలంటూ కాంట్రాక్టు కార్మికులు సాగించిన విధ్వంసంలో రూ.440కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లు విస్ట్రాన్ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన ఐఫోన్ ప్లాంట్ సిబ్బంది తమ జీతాల సమస్యను పట్టించుకోవడం లేదంటూ శనివారం ఉదయం విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు సమీపంలోని కోలార్ జిల్లాలో గల నర్సాపురలోని ఈ ప్లాంట్‌లో యాపిల్ ఐఫోన్ విడి భాగాలను అమరుస్తుంటారు. ఈ విస్ట్రాన్ ప్లాంట్‌లో మొత్తం ఆరు కాంట్రాక్ట్ సంస్థల నుంచి 8,900 మందిని నియమించుకున్నారు. ప్లాంట్ లో మరో  1,200 మంది శాశ్వత ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంట్రాక్టు సిబ్బంది తమ జీతాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. దాంతో వందలకోట్ల ఆస్తి నష్టం సంభవించింది. వేల సంఖ్యలో ఐఫోన్‌లు లూటీ అయ్యాయి. నష్టాన్ని ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని పోలీస్ స్టేషన్‌లో సమర్పించిన ఫిర్యాదులో యాజమాన్యం వెల్లడించింది. దాదాపు 5,000 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. దాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న 132 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విస్ట్రాన్ ప్లాంట్‌ దాడి ఘటనపై ఎస్పీ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఆందోళనకారులు ప్లాంట్ అద్దాలు పగలగొట్టి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్స్, ఫ్లోర్,సీలింగ్స్, ఏసీ తయారీ పూర్తయిన స్మార్ట్‌ఫోన్లు ఇలా దేన్ని వదలకుండా విధ్వంసం సృష్టించినట్లు వివరించారు. భారత్‌లో ఏర్పాటైన తొలి ఐఫోన్ యూనిట్ విస్ట్రాన్‌పై దాడిని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో ఆ సంస్థ జాప్యం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ తెలిపారు. మూడ్రోజుల్లో సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఇప్పటికే కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Sunday, December 13, 2020

390 kgs Ganjaa seize in Rajahmundry

రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ గంజాయి కలకలం రేగుతోంది. ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా భారీగా గంజాయి సాగవుతోందని ఇటీవల తరచు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో పెద్దఎత్తున గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గామన్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని నర్సీపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.