Tuesday, November 3, 2020

3 Killed in Vienna `Terror Attack` At 6 Locations

వియన్నాలో ఉగ్రపంజా

          · ముంబయి దాడి తరహాలో ఘటన

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. దేశంలో మంగళవారం నుంచి రెండో విడత కరోనా లాక్ డౌన్ విధించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా సోమవారం అర్ధరాత్రి వరకు హోటళ్లు, మార్కెట్, మాల్స్ లో ఆనందంగా గడిపారు. ఇదే అదునుగా వియన్నా లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ముష్కరులు ఇష్టానుసారం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు దుర్మరణం చెందగా మరో 15 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సెంట్రల్ వియన్నా అంతటా సోమవారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో జట్లుగా విడిపోయిన ఉగ్రవాదులు పెద్దఎత్తున కాల్పులకు దిగారు.  ఈ దుశ్చర్యను ఛాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ `పాశవిక ఉగ్రవాద దాడి`గా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా బంధించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలంతా నగరం మధ్యలోనే సురక్షితంగా ఉండాలని సరిహద్దు తనిఖీలను ముమ్మరం చేశామని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ (హోం) మంత్రి కార్ల్ నెహమ్మర్ తెలిపారు. పిల్లలు మంగళవారం పాఠశాలకు హాజరు కానవసరం లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారత్ లో పన్నేండేళ్ల క్రితం (2008 నవంబర్ 26-29 తేదీల్లో) పాక్ నుంచి దేశంలోకి చొరబడిన లష్కర్ ఎ తోయిబాకు చెందిన ముష్కరులు 166 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. నాడు ఈ ఉగ్రదాడిలో మొత్తం 10 మంది పాల్గొన్నారు.

Saturday, October 31, 2020

Government directs private schools to cut tuition fee by 30%

30% ఫీజుల కోతకు సర్కారు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూలు, కాలేజీ ఫీజుల్లో కోత విధిస్తూ శుభవార్తను అందించింది. స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ (ఎ.పి.ఎస్.ఇ.ఆర్.ఎం.సి) సిఫారసు ఆధారంగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2020-21) ఫీజుల్లో 30% తగ్గించి వసూలు చేయాలని ఆదేశించింది. విద్యా సంవత్సరానికి గాను ట్యూషన్ ఫీజులో 70 శాతం మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు తెలియపర్చింది.
కోవిడ్ -
19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వెసులుబాటు తప్పనిసరి అయినందునే ఈమేరకు ఆదేశాలిచ్చినట్లు జగన్ సర్కారు స్పష్టం చేసింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు 2020-21 సంవత్సరానికి సమీక్షించి ఫీజులు నిర్ణయించాలని ఎ.పి.ఎస్‌.ఇ.ఆర్‌.ఎం.సి. ఇంతకుముందే ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఈ  మే 26 న నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేగాక సంబంధిత డేటాను సమర్పించాలని యాజమాన్యాల్ని ఆదేశించింది. ఇదిలావుండగా తాజా ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.                                                                  
నవంబర్ 2 నుంచి 9,10 తరగతులు, ఇంటర్‌కు క్లాస్‌లు జరుగుతాయి. 23 నుంచి 6,7,8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయి. రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

Tuesday, October 27, 2020

Unlock guidelines issued in September to remain in force till November 30: MHA

నవంబర్ 30 వరకు అన్ లాక్-5 నిబంధనలే 

అన్ లాక్-5 నిబంధనలే నవంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి రాగా జూన్ 1 నుంచి దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను అమలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ లాక్-5 నిబంధల్ని నవంబర్ ముగిసేవరకు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ కొద్దిరోజుల క్రితం స్వయంగా మీడియా ముందుకు వచ్చి కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లాక్‌డౌన్ తీసేయడం అంటే కరోనా పోయినట్లు భావించొద్దని ఆయన స్పష్టం చేశారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు దాని విషయంలో అజాగ్రత్త వద్దని సూచించారు. పండగల సమయంలో కరోనా విషయంలో మరింత అప్రమత్తత అవసరమని సూచించారు. గత నెల అన్ లాక్-5 సడలింపులను ప్రకటించిన కేంద్రం అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు అనుమతించింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలు, విద్యాసంస్థలే నిర్ణయం తీసుకోవాలని కోరింది. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇదే సమయంలో ఆన్ లైన్, డిస్టెన్స్ విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని షరతు పెట్టింది.

Monday, October 26, 2020

Kanyaka Parameswari Mata decoration with worth above Rs.1 crore currency notes

రూ.కోటి కాంతుల కన్యకాపరమేశ్వరీ

తెలంగాణ గద్వాల్ లోని ప్రసిద్ధ శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆలయం సోమవారం కరెన్సీ నోట్లతో దగదగలాడింది. ఈరోజు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది. కన్యకాపరమేశ్వరీ మాతను రూ.1,11,11,111 విలువైన కరెన్సీతో అలంకరించారు. రంగురంగుల కరెన్సీ నోట్లను పుష్పాల మాదిరిగా మలచి అమ్మవారికి అలంకరించారు. చాలా కాలం లాక్ డౌన్ కారణంగా మూసివున్న ఆలయం దసరా పర్వదినం వల్ల తెరుచుకోవడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రంగురంగుల దీపపు కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ ఆలయం హైదరాబాద్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతేడాది దసరాతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య కూడా తగ్గింది. అదేవిధంగా గత దసరాలో అమ్మవారిని రూ.3 కోట్ల 33 లక్షల 33 వేల 33 నోట్లతో అలంకరించినట్లు ఆలయ కోశాధికారి పి.రాము తెలిపారు.