Sunday, June 14, 2020

YSRCP MP Raghu Rama Krishna Raju sensational comments on Atchannaidu's arrest will bring disrepute to Jagan

అచ్చెన్న అరెస్ట్ పై వైఎస్సార్ సీపీ ఎంపీ పెదవి విరుపు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంతపార్టీనే ఇరుకున పెట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వై.ఎస్.ఆర్.సి.పి.లో ఉన్న ఆయన శనివారం మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టుపై పెదవి విరిచారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతిపక్ష నాయకుల అరెస్టులు జగన్ సర్కార్ కు మైనస్ కావొచ్చని అభిప్రాయపడ్డారు. అచ్చెన్నాయుడును చూసేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆస్పత్రిలోకి అనుమతించకపోవడం సరైన పద్ధతి కాదని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అయితే ఆయన తాజాగా బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై ప్రశ్నించగా ఏపీ సీఎం జగన్ పక్క చూపు చూసినా, ఓర చూపు చూసినా, దొంగ చూపు చూసినా తను మాత్రం ఆయననే చూస్తున్నానని  బదులిచ్చారు. కొందరు వైసీపీ నేతల అత్యుత్సాహం  జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందని చెప్పారు. అలాగే అచ్చెన్నాయుడు ఇంటి గోడ దూకి ఆయన్ను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. నిజంగా తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.  టీడీపీ నేతలు రోజుకొకరు అరెస్టు అవుతారని మంత్రులు అనడం సరి కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంత్రుల వ్యాఖ్యల వల్ల కావాలనే అరెస్టులు చేసినట్లు ప్రజలు భావించే ప్రమాదం ఉందని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అలాగే నాయకులపై ఎలాంటి ఆధారం లేకుండా ఎవరూ కేసులు పెట్టలేరన్నారు.

Monday, June 8, 2020

All major temples gear up for trial run from May 8 in Andhra Pradesh

తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం
ఆంధ్రప్రదేశ్ లో 80 రోజుల తర్వాత ఆలయాలు అన్నీ తెరుచుకున్నాయి. సోమవారం అన్ని ప్రముఖ ఆలయాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా తిరుమలలో స్వామి దర్శనం ప్రారంభమయింది. ఉదయం 11 గంటల వరకు ట్రయల్ రన్ నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 12 గంటలకు దర్శనానికి భక్తుల్ని అనుమతించింది. తిరుమలతో పాటు విజయవాడ, సింహాచలం, అన్నవరం తదితర ఆలయాల్లోనూ ట్రయల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి కనకదుర్గ ఆలయంలోకి భక్తుల్ని అనుమంతిచనున్నారు. అయితే మాస్కులు ధరించడం, శానిటైజేషన్ తప్పనిసరి అనే నిబంధనను కఠినంగా అమలు పరుస్తున్నారు. అదే విధంగా షాపింగ్ మాల్స్, హోటళ్లు (తినుబండారాలు విక్రయించే) తెరుచుకున్నాయి. వినియోగదారుల్ని వీటిల్లోకి నిబంధనల మేరకు అనుమతిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ అనంతరం ఇవి అందుబాటులోకి వచ్చిన తొలిరోజు కావడంతో జనం పరిమిత సంఖ్యలోనే మాల్స్, హోటళ్లలో కనిపిస్తున్నారు.   

Tuesday, June 2, 2020

MLA Nandamuri BalaKrishna interesting comments on Hindupur Industrial Hub

హిందూపురం వాసులకు బాలకృష్ణ శుభవార్త
తెలుగు సినీ పరిశ్రమ అగ్ర కథానాయకుల్లో ఒకరు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ విషయమై ఇటీవల ఏపీఐఐసీ చైర్ పర్సన్ సినీ నటి రోజాతో మాట్లాడానన్నారు. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ బాటలో హిందూపురం ప్రగతికే ప్రాధాన్యమివ్వనున్నట్లు బాలకృష్ణ పునరుద్ఘాటించారు. బెంగళూరుకు హిందూపురం దగ్గరగా ఉండడం నియోజకవర్గానికి కలిసివచ్చే అంశమన్నారు. `హిందూపురం సమీపంలో నాన్నగారు (ఎన్టీఆర్) ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడను అభివృద్ధి చేద్దామని చెప్పా.. రోజమ్మ కూడా తప్పకుండా చేద్దాం బాబూ` అన్నారని బాలకృష్ణ వివరించారు.  బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం ఏపీలో కూడా చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Sunday, May 31, 2020

Protests over police killings rage in dozens of US cities

అల్లర్లతో అట్టుడుకుతున్న అమెరికా

పోలీస్‌ కస్టడీలో నల్లజాతి వ్యక్తి మరణం దరిమిలా అమెరికాలోని పలు నగారాల్లో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. అమెరికాలో న్యూయార్క్, బ్రూక్లిన్, కెంటకీ, టెక్సాస్, అట్లాంటా, జార్జియా, మిచిగాన్, పోర్ట్ ల్యాండ్ తదితర నగరాల్లో ఆందోళనకారులు రెచ్చిపోవడంతో సైన్యాన్ని రంగంలోకి దించారు. సామాజిక దూరం నిబంధనలను గాలికొదిలేసి మాస్క్‌లు ధరించకుండా పలువురు ఆందోళనలకు దిగుతున్నారు. కాలిఫోర్నియాలో బ్యాంకు, పోర్ట్ ల్యాండ్‌లో పోలీసు వాహనాలకు, పలు చోట్ల షాపులు, ఇతర భవనాలకు నిప్పు పెట్టారు. మినియాపోలిస్‌లో శనివారం జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుణ్ని దొంగతనం నేరం కింద అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి ఆయన మెడపై మోకాలితో బలంగా నొక్కి కూర్చున్నాడు. దాంతో అతను గిలగిల్లాడుతూ ప్రాణాలొదిలాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ పట్ల పోలీస్ అధికారి క్రూర ప్రవర్తన దావానలంలా అమెరికా అంతటా వ్యాపించడంతో ఘర్షణలు పెల్లుబికుతున్నాయి. రాత్రి కర్ఫ్యూను సైతం ఉల్లంఘించి ఆందోళనకారులు హింసాకాండకు పాల్పడ్డారు. లాస్ ఏంజిల్స్‌లో నిరసనకారులు `బ్లాక్ లైవ్స్ మేటర్` అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అప్రమత్తమయ్యారు. 1992లో రోడ్నే కింగ్‌ అనే నల్లజాతీయుడిని పోలీసులు పొట్టనబెట్టుకోవడంతో ఇదే విధంగా అల్లర్లు చెలరేగాయి. దాంతో నాడు సైన్యాన్ని రంగంలోకి దిచారు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత అమెరికాలో అల్లర్ల అదుపునకు సైన్యాన్ని రంగంలోకి దించడం ఇదే ప్రథమం.