Friday, May 8, 2020

Atleast 16 migrant workers were crushed to death by a Goods Train in Aurangabad and 5 more condition serious

వలస కూలీల ఉసురు తీసిన రైలుబండి
పొట్టచేతపట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసవచ్చిన అభాగ్యులు వాళ్లు.. స్వస్థలాలకు తిరుగుపయనమవుతూ కానరాని లోకాలకు తరలిపోయారు. ఈ విషాద దుర్ఘటన మహారాష్ట్రలోని ఔరంగబాద్ సమీపంలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్-జల్నా రైల్వే లైన్‌లో ట్రాక్ పై నిద్రిస్తున్న 16 మంది జీవితాల్ని గూడ్సు బండి చిదిమేసింది. దుర్ఘటనలో మరో అయిదుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం చొరవతో ఏర్పాటయిన శ్రామిక్ రైలులో స్వరాష్ట్రానికి చేరుకోవాలని కొండంత ఆశతో వలస కూలీలు గురువారం బయలుదేరారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మే 17 వరకు పొడిగించిన దరిమిలా రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు ఈ రైలు ఎక్కేందుకు జల్నా నుంచి భుసావాల్ కు బయలుదేరారు. వారంతా శుక్రవారం అక్కడ నుంచి శ్రామిక్ రైలులో స్వస్థలాలకు చేరుకోవాల్సి ఉంది. అప్పటికే 35 కి.మీ. నడక సాగించిన వాళ్లు రాత్రి కావడంతో ఓ ఫ్లై ఓవర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై నిద్రకు ఉపక్రమించారు. అలసట కారణంగా కూలీలంతా గాఢ నిద్రావస్థలో ఉన్నారు. ట్రాక్ పై మనుషులున్న సంగతిని లోకో పైలట్ గుర్తించినా రైలు నిలుపుచేసే సమయం చిక్కలేదని తెలుస్తోంది. దాంతో గూడ్సు వారిపై నుంచి దూసుకుపోగా కూలీల దేహాలు ఛిద్రమై ట్రాక్ కు ఇరువైపులా పడిపోయాయి. కొనఊపిరితో ఉన్న అయిదుగుర్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ట్రాక్ సమీపంలో కూర్చున్న మరో ముగ్గురు మాత్రం ఈ ఘోరం నుంచి సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఘోర ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Sunday, May 3, 2020

Rahul Gandhi raises security concerns over Arogya Setu app

`ఆరోగ్య సేతు`పై రాహుల్ గాంధీ డౌట్
ఆరోగ్య సేతు యాప్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా ప్రయివేట్ నిర్వహణ సంస్థకు యాప్ బాధ్యతలు కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. డేటా భద్రతకు భంగం కలగడం, వ్యక్తిగత గోప్యత సమస్యలు పెరుగుతాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అనేది మనల్ని సురక్షితంగా ఉంచాలే తప్పా నష్టపరిచేదిలా ఉండకూడదని హితవు పలికారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో యాప్ కీలకంగా మారుతుందని కేంద్రం భావిస్తున్నతరుణంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కలవరం కల్గిస్తున్నాయి. యాప్ అధునాతన నిఘా వ్యవస్థ అని ఆయన తీవ్రంగా ఆరోపించారు. యాప్ ద్వారా అనుమతి లేకుండానే మనపై నిఘా  నెలకొంటుందని చెప్పారు. మరోవైపు సోమవారం (మే4) నుంచి దేశంలో ఆయా కార్యాలయాల్లో పని చేసే వారు తమ మొబైళ్లలో యాప్ ను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.

Friday, May 1, 2020

Famous 'Putin's Tiger' Spotted in Chinese National Park

చైనాలో రష్యా పులి `బోరిస్`
సైబేరియన్ జాతికి చెందిన ప్రఖ్యాత పెద్దపులి బోరిస్ ను చైనా అడవుల్లో ఇటీవల గుర్తించారు. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పులిగా పేరొందింది. చైనా-రష్యా సరిహద్దుల్లోని అడవిలో అస్వస్తతతో ఉండగా పులిని రక్షించి అముర్స్కి టైగర్ (అముర్ టైగర్) కేంద్రానికి తరలించారు. అక్కడ సంపూర్ణ ఆరోగ్యం పొందిన తర్వాత 2014లో స్వయంగా పుతిన్ దాని సహజ ఆవాసమైన అడవుల్లోకి వదిలారు. బోరిస్ తో పాటు గర్ల్ ఫ్రెండ్ `స్వెత్లయ` కూడా పుతిన్ చేతుల మీదుగా నాడు అరణ్యానికి తరలింది. జంట రెండు  పిల్లలకు జన్మనిచ్చాయి. తాజాగా పుతిన్ పులి బోరిస్ ను చైనా `తైపింగ్గౌ నేషనల్ నేచర్ రిజర్వ్` లో గుర్తించారు. దీని అసాధారణ చర్మం వల్లే ఛాయాచిత్రాల  ద్వారా సులభంగా కనుగొనగలిగారు. రాజసం ఉట్టిపడే బోరిస్ పులికి వైపు చారలు లేని ప్రదేశం ఉండడం విశేషం. దాని ద్వారానే పులిని తేలిగ్గా గుర్తించగల్గుతున్నారు.

Thursday, April 30, 2020

Rishi Kapoor passes away at 67 Big B confirms the news on twitter

రిషికపూర్ మృతికి ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం
నటుడు, నిర్మాత, దర్శకుడిగా రాణించి హిందీ చలనచిత్ర పరిశ్రమను ఏలిన రిషికపూర్(67) మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. బాలీవుడ్ దిగ్గజం రణబీర్ రాజ్ కపూర్ ద్వితీయ పుత్రుడైన రిషి 2018 నుంచి కేన్సర్ తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. గతంలో ఆయన న్యూయార్క్లో చికిత్స తీసుకొని భారత్ వచ్చారు. ఇటీవల వ్యాధి మళ్లీ ముదరడంతో ముంబయిలోని ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందారు. 'మేరా నామ్ జోకర్' సినిమా ద్వారా బాలనటుడిగా రిషి తెరంగేట్రం చేశారు. 1974 లో ఆయన  'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మెప్పించారు. దాంతోపాటు `ది బాడీ` అనే మూవీలోనూ, వెబ్ సిరీస్ లో కూడా ఆయన నటించారు. తండ్రి పేరునే కొడుకుకు (రణబీర్ కపూర్) రిషికపూర్ పెట్టుకున్నారు. లెజెండ్ తరలిపోయారని టాలీవుడ్ ప్రముఖ వెటరన్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కోలివుడ్ అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు రిషికపూర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. రిషి మరణవార్తను బిగ్ బీ అమితాబ్ ట్విటర్ వేదికగా తొలుత ధ్రువీకరించారు. ఆలిండియా సూపర్ స్టార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్ తో మరణించిన రోజు వ్యవధిలోనే మరో అగ్రనటుడు రిషి అదే వ్యాధి తోనే కన్నుమూయడంతో బాలీవుడ్ తీవ్ర శోకంలో మునిగిపోయింది.