Thursday, March 19, 2020

PM appeals `Janata Curfew` on 22 march sunday till morning 7 to night 9

కరోనాపై యుద్ధానికి మోదీ పిలుపు
కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధానికి భారత ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. గురువారం రాత్రి ఆయన జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు. ఈ ఆదివారం మార్చి 22న ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు దేశ ప్రజలందరూ స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించాలని విన్నవించారు. ఈ నెల 31 వరకు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ప్రజల్ని కోరారు. కరోనాకు మందులేదని, వ్యాక్సిన్ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. జనం గుమిగూడవద్దని, జన సమూహాలున్న ప్రాంతాలకు వెళ్లరాదని కోరారు. అందరూ వర్క్ ఫ్రం హోం చేసుకోవాలన్నారు. నిత్యావసరాల కోసం బాధ పడొద్దని వాటిని ఇళ్లకే పంపుతామని భరోసా ఇచ్చారు. కోవిడ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని ప్రధాని చెప్పారు. కరోనా వైరస్ కు భయపడాల్సిన పని లేదని అయితే అజాగ్రత్త వహించరాదన్నారు. వాస్తవానికి యావత్ ప్రపంచం థర్డ్ వరల్డ్ వార్ ముంగిట నిలిచిందని చెప్పారు. వేగంగా ప్రగతి పథాన పయనిస్తున్న భారత్ కు కరోనా తీరని ఆటంకంగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య, పరిశుభ్రతా సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ప్రధాని ప్రశంసించారు. కరోనా కట్టడికి చేస్తున్న యుద్ధంలో సమష్టిగా పోరాడాలని పిలుపుఇచ్చారు. తద్వారా రానున్న రోజుల్లో ఈ రాకసిపై భారత్ తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Wednesday, March 18, 2020

Corona Affect: All movie theaters bandh in East Godavari

20 నుంచి తూ.గో.లో సినిమా హాళ్ల బంద్
కోవిడ్-19 ఎఫెక్ట్ సినిమా లవర్స్ ఎక్కువగా ఉండే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాను తాకింది.  కరోనా ప్రభావంతో జిల్లాలో థియేటర్లు మూతపడనున్నాయి. విషయాన్ని ఈస్ట్ గోదావరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్  అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో సినిమా హాళ్లన్నీ మూతపడ్డాయి. ఈనెల 31 వరకూ థియేటర్లతో పాటు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ మూసివేశారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` మొదలు చిన్న, పెద్ద సినిమాల షూటింగ్లు రద్దయ్యాయి. విడుదలైన సినిమాలకు కోట్లలో నష్టం జరగ్గా  నెలలో విడుదల కావాల్సిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయికరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం (20 తేదీ) నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్ల మూసివేయనున్నారునెల్లూరులో కరోనా కలకలం రేగడంతో ఇప్పటికే అక్కడ సినిమా హాళ్లన్నీ బంద్ ప్రకటించాయి. మరికొన్ని జిల్లాల్లో స్వచ్ఛందంగానే థియేటర్లను మూసేస్తున్నారుపెద్ద సంఖ్యలో జనసమూహాలు గుమిగూడే ప్రాంతాల్లో అత్యంత వేగంగా కరోనా ప్రబలుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టమైన హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలో తీసుకున్న తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా థియేటర్ల స్వచ్ఛంద బంద్ కు దారితీసే అవకాశం ఉంది. ఇక తెలంగాణతో పాటు కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ఇప్పటికే  అధికారికంగా బంద్ ప్రకటించాయి.

Monday, March 16, 2020

Telangana government passes resolution against CAA

సీఏఏను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
ముందునుంచి చెబుతున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సర్కార్  సీఏఏ (సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్) కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఇటీవల కేంద్రప్రభుత్వం  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏతెచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సవరణల్ని కేంద్రానికి సూచించింది. సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఏదో గుడ్డిగా యాక్ట్ ను వ్యతిరేకించడం లేదని సంపూర్ణ అవగాహనతోనే సీఏఏ ను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సీఏఏ యావద్దేశ సమస్య తప్పా మరొకటి కాదని తేల్చి చెప్పారు. తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని నమోదుకు ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డులేవీ పనికిరావని నిబంధన విధించడమేంటని ప్రశ్నించారు. ప్రజలు తమను నాయకులుగా ఎన్నుకోవడానికి ఉపయోగపడే ఓటర్ కార్డు వారు పౌరులుగా నమోదు కావడానికి ఉపయోగపడకపోవడం విడ్డూరమన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానానికి ఆమోదం తెలిపింది. తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్.. సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. అనంతరం అన్ని పార్టీల నేతలూ తీర్మానంపై మాట్లాడారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సీఏఏపై తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రతుల్ని చించేసి తన నిరసన వ్యక్తం చేశారు.

Sunday, March 15, 2020

Third Coronavirus death in india 71 year old from maharashtra dead?

మహారాష్ట్రలో మరొకరు బలి?
మహారాష్ట్రలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మరణించాడు. ఈ మధ్యనే సౌదీ అరేబియా నుంచి తిరిగివచ్చిన ఆ వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు సుగర్, బీపీ ఎక్కువకావడంతో ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ వృద్ధుడు కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా చనిపోయినట్లు నిర్ధారణ కాలేదు. కాగా ఇప్పటికే దేశంలో కరోనా కారణంగా చనిపోయిన ఇద్దరూ వృద్ధులే కావడం గమనార్హం. దేశంలో తొలి కరోనా మృతి కర్ణాటకలో సంభవించగా రెండో కేసు ఢిల్లీలో నమోదయింది. చనిపోయిన స్త్రీ,పురుషులిద్దరూ 65 ఏళ్లు పైబడినవారే.  మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల వ్యక్తి శనివారం మధ్యాహ్నం చనిపోయారు. బుల్దానా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఢిల్లీలో 69 ఏళ్ల కరోనా బాధితురాలు మృతి చెందింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ  ప్రకటించింది. ఢిల్లీలోని రామ్‌మనో‌హర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడయింది. అయితే ఆమెకూ బీపీ, సుగర్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడి వల్లే ఆమెకు కరోనా వైరస్ సోకింది.  ఆ వృద్ధురాలి కుమారుడు విదేశాల్లో పర్యటించి వచ్చినట్లు సమాచారం.