Thursday, January 30, 2020

SC Stays Proceedings Initiated By Woman Claiming To Be Daughter Of Singer Anuradha Paudwal

అనురాధ పౌద్వాల్ కు సుప్రీంలో ఊరట
ప్రముఖ గాయని అనురాధ పౌద్వాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓ 45ఏళ్ల మహిళ ఆమె కుమార్తె నని చెప్పుకుంటూ రూ .50 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మహిళ ఫిర్యాదు మేరకు తిరువనంతపురం(కేరళ) ఫ్యామిలీ కోర్టులో అనురాధ పౌద్వాల్ పై కేసు విచారణ ప్రారంభమయింది. అయితే పౌద్వాల్ అభ్యర్థన పిటిషన్ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసుపై గురువారం స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బొబ్డే నేతృత్వంలోని జస్టిస్ గవై, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి సదరు మహిళకు నోటీసు జారీ చేసింది. ఈ కేసును తిరువనంతపురం కోర్టు నుంచి ముంబై కోర్టుకి బదిలీ చేయాలని కోరుతూ పౌద్వాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు ధర్మాసనం ఆ మహిళకు తాజాగా నోటీసు ఇచ్చింది. పౌద్వాల్ పద్మశ్రీ పురస్కారంతో పాటు జాతీయ ఉత్తమగాయనిగా పలు అవార్డులు అందుకున్నారు. ఆమె సంగీత స్వరకర్త అరుణ్ పౌద్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే పౌద్వాలే తన తల్లి అంటూ సదరు మహిళ కేరళ ఫ్యామిలీ కోర్టుకెక్కారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు జనవరి 27న పౌద్వాల్ తన ఇద్దరు పిల్లలతో సహా హాజరుకావాలని ఆదేశించింది. దాంతో పౌద్వాల్ ముంబై కోర్టుకు కేసు బదిలీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

Muzaffarnagar Coldest In Uttar Pradesh At 6 Degrees Celsius

ఉత్తరాదిన ఇంకా వణికిస్తున్న చలిపులి
ఉత్తరభారతదేశంలో ఇంకా శీతలవాతావరణం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని ముజఫర్ నగర్ లో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. లఖ్నవూ, బరేలీ, ఝాన్సీ, ఆగ్రాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. యూపీలోని మిగిలిన ప్రాంతాల వాతావరణంలో పెద్ద మార్పేమీ లేనట్లు వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో చాలా చోట్ల శుక్రవారం ఉదయం పొడి వాతావరణం, ఓ మాదిరిగా పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా.

Tuesday, January 28, 2020

AP Council Abolition is A Nonsense:KK

శాసనమండలి రద్దు అర్థరహితం:కేకే
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేయాలన్న నిర్ణయం ఓ అర్థరహిత చర్యగా రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. పెద్దల సభగా విధాన పరిషత్ కొనసాగాలనే తను కోరుకుంటున్నానన్నారు. మండలికి పెట్టే ఖర్చు దండగా అనే వాదనను ఆయన కొట్టిపారేస్తూ..నాన్సెన్స్ అని పేర్కొన్నారు. మన రాజ్యాంగం ప్రకారం శాసనవ్యవస్థలో ఉభయ సభలు ఉండాలి.. ఒక సభలో తొందరపాటు నిర్ణయాలేవైనా తీసుకుంటే పెద్దల సభలో వాటిని సరిచేసే అవకాశముంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ద్వితీయ అభిప్రాయం తప్పనిసరి అని కేకే అన్నారు. 80 ఏళ్ల కేకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్ లో డిప్యూటీ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. కొద్దికాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన `ఇండియన్ ఎక్స్ ప్రెస్` పత్రిక జర్నలిస్టుగా గుర్తింపుపొందారు. గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ గా రెండు పర్యాయాలు శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే కేకే `ది డైలీ న్యూస్` పత్రిక ఎడిటర్ గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం పెనవేసుకున్న అనుబంధం ఆయనది. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని నాడు తీవ్రంగా వ్యతిరేకించారు. 1984లో ఎన్టీయార్ హయంలోనూ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం చేసిన సందర్భంలో కేకే బాహటంగా తన వ్యతిరేకత ప్రకటించారు. తాజాగా ఇప్పుడు మండలి రద్దు అంశంపై ఆయన నిర్మోహమాటంగా అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదిలావుండగా ఉత్తరాంధ్ర నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాకలపాటి రఘువర్మ మండలి రద్దు తీర్మానాన్ని ఖండించారు. అమరావతిని మార్చడం సరికాదు.. మూడు రాజధానుల ప్రకటనకు అనుకూలంగా మాట్లాడి తప్పు చేశానని పేర్కొన్నారు.

Sunday, January 26, 2020

ITBP Celebrate 71st Republic Day by Hoisting National Flag at 17,000 Feet in Ladakh

హిమగిరులపై మువ్వన్నెల జెండా రెపరెపలు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐ.టి.బి.పి.) సిబ్బంది 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఐటీబీపీ సిబ్బంది 17,000 అడుగుల ఎత్తుకు జాతీయ జెండాను మోసుకు వెళ్లి ఎగురవేశారు. సైనికులు 'భారత్ మాతా కి జై', 'వందే మాతరం' అంటూ నినాదాలు చేశారు. జెండాను ఎగురవేసే సమయంలో లడఖ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉంది. అతిశీతల వాతావరణంలో దేశానికి అచంచల సేవలందిస్తున్న ఈ ఐటీబీపీ సైనికులను 'హిమ్వీర్స్' (హిమాలయాల ధైర్య సైనికులు) అని కూడా పిలుస్తారు. 1962 చైనా-భారత్ యుద్ధం నేపథ్యంలో ఐటీబీపీ ఏర్పడింది. సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) చట్టం ప్రకారం 1962 అక్టోబర్ 24 న నెలకొల్పిన ఐదు కేంద్ర సాయుధ పోలీసు దళాలలో ఐటీబీపీ ఒకటి. నాటి నుంచి హిమగిరులపై ఈ దళం భారత స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం దేశ పౌరుల ప్రాథమిక హక్కులు, విధులను నిర్దేశిస్తూ 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్ స్వతంత్ర గణతంత్ర దేశంగా అవతరించిన చరిత్రాత్మక క్షణానికి గుర్తుగా ఏటా జనవరి 26 న రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇది. 1929 లో ఇదే రోజున భారత సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించింది. 1949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఆమోదించింది.