Thursday, January 30, 2020

Muzaffarnagar Coldest In Uttar Pradesh At 6 Degrees Celsius

ఉత్తరాదిన ఇంకా వణికిస్తున్న చలిపులి
ఉత్తరభారతదేశంలో ఇంకా శీతలవాతావరణం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని ముజఫర్ నగర్ లో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. లఖ్నవూ, బరేలీ, ఝాన్సీ, ఆగ్రాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. యూపీలోని మిగిలిన ప్రాంతాల వాతావరణంలో పెద్ద మార్పేమీ లేనట్లు వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో చాలా చోట్ల శుక్రవారం ఉదయం పొడి వాతావరణం, ఓ మాదిరిగా పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా.

Tuesday, January 28, 2020

AP Council Abolition is A Nonsense:KK

శాసనమండలి రద్దు అర్థరహితం:కేకే
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేయాలన్న నిర్ణయం ఓ అర్థరహిత చర్యగా రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. పెద్దల సభగా విధాన పరిషత్ కొనసాగాలనే తను కోరుకుంటున్నానన్నారు. మండలికి పెట్టే ఖర్చు దండగా అనే వాదనను ఆయన కొట్టిపారేస్తూ..నాన్సెన్స్ అని పేర్కొన్నారు. మన రాజ్యాంగం ప్రకారం శాసనవ్యవస్థలో ఉభయ సభలు ఉండాలి.. ఒక సభలో తొందరపాటు నిర్ణయాలేవైనా తీసుకుంటే పెద్దల సభలో వాటిని సరిచేసే అవకాశముంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ద్వితీయ అభిప్రాయం తప్పనిసరి అని కేకే అన్నారు. 80 ఏళ్ల కేకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్ లో డిప్యూటీ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. కొద్దికాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన `ఇండియన్ ఎక్స్ ప్రెస్` పత్రిక జర్నలిస్టుగా గుర్తింపుపొందారు. గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ గా రెండు పర్యాయాలు శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే కేకే `ది డైలీ న్యూస్` పత్రిక ఎడిటర్ గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం పెనవేసుకున్న అనుబంధం ఆయనది. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని నాడు తీవ్రంగా వ్యతిరేకించారు. 1984లో ఎన్టీయార్ హయంలోనూ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం చేసిన సందర్భంలో కేకే బాహటంగా తన వ్యతిరేకత ప్రకటించారు. తాజాగా ఇప్పుడు మండలి రద్దు అంశంపై ఆయన నిర్మోహమాటంగా అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదిలావుండగా ఉత్తరాంధ్ర నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాకలపాటి రఘువర్మ మండలి రద్దు తీర్మానాన్ని ఖండించారు. అమరావతిని మార్చడం సరికాదు.. మూడు రాజధానుల ప్రకటనకు అనుకూలంగా మాట్లాడి తప్పు చేశానని పేర్కొన్నారు.

Sunday, January 26, 2020

ITBP Celebrate 71st Republic Day by Hoisting National Flag at 17,000 Feet in Ladakh

హిమగిరులపై మువ్వన్నెల జెండా రెపరెపలు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐ.టి.బి.పి.) సిబ్బంది 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఐటీబీపీ సిబ్బంది 17,000 అడుగుల ఎత్తుకు జాతీయ జెండాను మోసుకు వెళ్లి ఎగురవేశారు. సైనికులు 'భారత్ మాతా కి జై', 'వందే మాతరం' అంటూ నినాదాలు చేశారు. జెండాను ఎగురవేసే సమయంలో లడఖ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉంది. అతిశీతల వాతావరణంలో దేశానికి అచంచల సేవలందిస్తున్న ఈ ఐటీబీపీ సైనికులను 'హిమ్వీర్స్' (హిమాలయాల ధైర్య సైనికులు) అని కూడా పిలుస్తారు. 1962 చైనా-భారత్ యుద్ధం నేపథ్యంలో ఐటీబీపీ ఏర్పడింది. సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) చట్టం ప్రకారం 1962 అక్టోబర్ 24 న నెలకొల్పిన ఐదు కేంద్ర సాయుధ పోలీసు దళాలలో ఐటీబీపీ ఒకటి. నాటి నుంచి హిమగిరులపై ఈ దళం భారత స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం దేశ పౌరుల ప్రాథమిక హక్కులు, విధులను నిర్దేశిస్తూ 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్ స్వతంత్ర గణతంత్ర దేశంగా అవతరించిన చరిత్రాత్మక క్షణానికి గుర్తుగా ఏటా జనవరి 26 న రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇది. 1929 లో ఇదే రోజున భారత సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించింది. 1949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఆమోదించింది.

Friday, January 24, 2020

Oxford Dictionary Gets 26 India English Words Like Aadhaar, chawl, dabba, hartal, shaadi

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 26 భారతీయ పదాలకు చోటు
దేశ ప్రజల గుర్తింపు కార్డు ఆధార్ కు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లో చోటు దక్కింది. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తాజా 10వ ఎడిషన్ శుక్రవారం విడుదలయింది. ఇందులో ఆధార్, చావల్ (బియ్యం), డబ్బా(బడ్డీ), హర్తాళ్ (ఆందోళన), షాదీ (పెళ్లి) వంటి 26 భారతీయ భాషా పదాలకు చోటు కల్పించారు. వీటితో పాటు ఆక్స్ ఫర్డ్ ఇండియన్ ఇంగ్లిష్ డిక్షనరీలో చాట్‌బాట్, ఫేక్ న్యూస్, మైక్రోప్లాస్టిక్, బస్ స్టాండ్, డీమ్డ్ యూనివర్శిటీ, ఎఫ్ఐఆర్, నాన్-వెజ్, రిడ్రెసల్, టెంపో, ట్యూబ్ లైట్, వెజ్, వీడియోగ్రాఫ్ తదితర 1,000 పదాలకు స్థానం లభించినట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎడ్యుకేషన్ డివిజన్) ఫాతిమా దాదా తెలిపారు. అలాగే డిక్షనరీ ఆన్‌లైన్ వెర్షన్‌లో విద్యుత్ కోసం (current- for electricity), దోపిడీదారుడు (looter), దోపిడీ (looting), ఉపజిల్లా (one of the areas that a district is divided) వంటి నాలుగు కొత్త భారతీయ ఆంగ్ల పదాలకు చోటు దక్కిందన్నారు. 77 సంవత్సరాల చరిత్ర కల్గిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తొలి నిఘంటువు తొలుత జపాన్‌లో 1942 లో ప్రచురితమయింది. ఓయూపీ ఏర్పడ్డాక ఆల్బర్ట్ సిడ్నీ హార్నబి ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ నుంచి 1948లో డిక్షనరీ మొదటి ఎడిషన్ విడుదలయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యాన్ని పొందిన ఆయా భాషా పదాల్ని అందిపుచ్చుకుంటూ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఎనిమిది దశబ్దాలుగా సరికొత్త ఎడిషన్లను ఆవిష్కరిస్తూ వస్తోంది. కేంబ్రిడ్జ్ తర్వాత అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీయే. ఈ వర్సిటీకి అనుబంధంగా ప్రారంభమైన ఓయూపీ ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయ ముద్రణా సంస్థ. 190 దేశాలలో 70 భాషల్లో ఓయూపీ ప్రచురణలు వెలువడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా, వృత్తిపరమైన పుస్తకాల్ని ఓయూపీ విడుదల చేస్తోంది.