Friday, January 3, 2020

Farmers in Amaravati protest against AP CM Jagan's idea of 3 capitals to the state

ఏపీలో సకల జనుల సమ్మె ఉద్రిక్తం
ఆంధ్రప్రదేశ్ కు `మూడు రాజధానులు వద్దు ప్రస్తుత రాజధాని అమరావతే ముద్దు` అంటూ రైతులు ఆందోళన ఉధృతం చేశారు. గత 16 రోజులుగా రోడెక్కిన రైతులు శుక్రవారం సకల జనుల సమ్మెకు పిలుపు ఇచ్చారు. దాంతో రాజధాని సమీపంలోని బాధిత 29 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మందడం కు ర్యాలీగా తరలడానికి సిద్ధమైన `జనసేన` అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను పోలీసులు దారిలోనే నిలిపివేశారు. దాంతో ఆయన రోడ్డుపై ధర్నాకు దిగారు. సకల జనుల సమ్మె పిలుపు నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి. రైతులకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ఎక్కడికక్కడ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఈ క్రమంలో మహిళల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ ప్రతిపక్ష నాయకులు విరుచుకు పడ్డారు. మహిళల్ని బస్సుల్లో అక్కడ నుంచి పోలీసులు తరలించారు. పోలీసుల తీరును తప్పుబడుతూ రైతులు ఆ వాహనాలకు అడ్డంగా పడుకుని కొద్దిసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వం అణచివేత చర్యలకు పూనుకుంటోందని..ఎన్నడూ ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు తమ ఆవేదన వెలిబుచ్చేందుకు రోడ్డు పైకి వస్తే వారిపై పోలీసులు దౌర్జన్యం చేశారని ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇది మా సమస్య కాదని మౌనంగా ఉంటే రేపొద్దున మరో బాధ వారిని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడు వారికి సహకరించే వారుండరని అందుకే సమష్ఠిగా పోరాడాలని సూచించారు.

Wednesday, January 1, 2020

AP Governor and CM, Opposition Leaders 2020 New Year Wishes to the People

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్, సీఎం, ప్రతిపక్ష నాయకుల శుభాకాంక్షలు
2020 నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వాభూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాభినందనలు చెప్పారు. జనవరి 1 బుధవారం అమరావతిలోని రాజ్ భవన్ వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ కు పిల్లలు పుష్పగుచ్ఛాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు డాలర్ శేషాద్రి తదితరులు గవర్నర్‌ను ఆయన నివాసంలో కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీటీడీ పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలందరూ ఈ ఏడాది ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు విషెస్ తెల్పుతూ ఈ సంవత్సరం యావత్ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ని వేడుకున్నట్లు చెప్పారు. గడిచిన ఏడాది రాష్ట్ర ప్రజలు చిరునవ్వులతో తమ ప్రభుత్వాన్ని ఆహ్వానించి ఆనందంగా గడిపారని ఈ ఏడాది అందరి ఇళ్లల్లో సంతోషం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడాలని దుర్గమ్మని వేడుకున్నట్లు తెలిపారు. విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని చంద్రబాబు దంపతులు ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను నాడు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారన్నారు. కానీ నేడు 2020 సత్ఫలితాల్ని తెలంగాణ అనుభవిస్తోందని చెప్పారు. నూతన సంవత్సరం తొలిరోజున దుర్గమ్మని దర్శించుకొని అమరావతిని పరిరక్షించాలని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. `రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలి..అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి`..అని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. ఆయనకు దుర్గగుడి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉన్నారు.

Tuesday, December 31, 2019

Malavath Poorna conquered Mt Vinson Massif in Antarctica

అంటార్కిటికా మౌంట్ విన్సన్ మాసిఫ్‌ను అధిరోహించిన పూర్ణ

ఏడు ఖండాలలో ఉన్న ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్నదే భారతమాత ముద్దు బిడ్డ మాలవత్ పూర్ణ లక్ష్యం. ఆ సాధనలో ఆమెకు మరో మెట్టు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా  పూర్ణ అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాసిఫ్‌ను జయించి 2019ను ముగించింది. ఈ ఘనత తరువాత ఇప్పటికి ఆమె ఆరు ఖండాల్లోని ఆరు ఎత్తైన పర్వత శిఖరాలపై అడుగు పెట్టి చరిత్ర లిఖించింది. ఈ కీర్తిని సొంతం చేసుకున్న ప్రపంచంలోనే తొలి గిరిజన మహిళగా 18 ఏళ్ల పూర్ణ నిలిచింది. మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా, 2014), మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా, 2016), మౌంట్ ఎల్బ్రస్ (యూరప్, 2017), మౌంట్ అకాన్కాగువా (దక్షిణ అమెరికా, 2019), మౌంట్ కార్ట్స్నెజ్ (ఓషియానియా, 2019), మౌంట్ విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా, 2019) పూర్ణ అధిరోహించిన పర్వతాల జాబితాలో చేరాయి. 13 సంవత్సరాల 11 నెలల వయస్సులో ఆమె మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలు పూర్ణ.

Monday, December 30, 2019

Uddhav Thackeray inducts son, 35 others; Ajit Pawar sworn in Dy CM

`మహా` కేబినెట్ లో అజిత్ పవార్, ఆదిత్య ఠాక్రే
మహారాష్ట్ర మంత్రివర్గంలో అజిత్ పవార్, ఆదిత్య ఠాక్రేలకు చోటు లభించింది. రాజ్ భవన్ లో  సోమవారం జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో పాటు నాసిక్ రావు తిర్పుడే, సుందరరావు సోలంకీ, రామ్ రావ్ అదిక్, గోపినాథ్ ముండే, ఆర్.ఆర్.పాటిల్, విజయ్ సింహ్ మిమితే పాటిల్ తది రులతో గవర్నర్  బి.ఎస్.కోష్యారీ ప్రమాణం చేయించారు. దారితప్పినా మళ్లీ శరద్ పవార్ తంత్రంతో ఎన్సీపీ గూటికి చేరిన ఆ పార్టీ అగ్రనేత అజిత్ పవార్ మరోసారి ఉపముఖ్యమంత్రిగా పీఠమెక్కారు. 32 రోజుల క్రితం కొలువుదీరిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ లో కేబినెట్ సంఖ్య 36కు చేరింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే `మహా వికాస్ అగాడి`(కూటమి)కి నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నెల్లాళ్ల క్రితం హడావుడిగా అధికారానికి వచ్చిన బీజేపీ సర్కార్ లో 60 ఏళ్ల అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 80 గంటల పాటు పదవిలో ఉన్నారు. అప్పటి దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారు బలనిరూపణకు నిలువలేక రాజీనామా చేయడంతో ఆయన పదవి కోల్పోయారు. తిరిగి బాబాయ్ శరద్ పవార్ పంచనే చేరిన అజిత్ పవార్ మళ్లీ డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. అజిత్ పవార్ డిప్యూటీ గా పదవిలోకి రావడం ఇది నాల్గోసారి. తొలిసారి 2010 నవంబర్ లో ఆ తర్వాత అక్టోబర్ 2012లో ఇటీవల నవంబర్ 2019లో మళ్లీ డిసెంబర్ 2019లో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. కాగా ఠాక్రేల వారసుడు ఆదిత్య ఠాక్రే కు తండ్రి ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ లో తాజాగా చోటు దక్కింది.