Friday, October 4, 2019

Shooting down chopper on Feb 27 was 'big mistake', action against officers: IAF chief


ఐఏఎఫ్ సొంత హెలికాప్టర్ నే కూల్చేయడం పెద్ద తప్పు: భదౌరియా
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలాకోట్ లో ఉగ్రతండాలపై మెరుపుదాడులు జరిపిన మరుసటి రోజున సొంత హెలికాప్టర్ నే క్షిపణితో కూల్చేసి ఐఏఎఫ్ గ్రౌండ్ సిబ్బంది చాలా పెద్ద తప్పు చేశారని ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా అన్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారిగా విలేకర్లతో మాట్లాడారు.  జమ్ముకశ్మీర్ నౌషెరా సెక్టార్ లోని బుద్గామ్‌లో ఫిబ్రవరి 27న చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోనున్నామన్నారు. భారత-పాకిస్థాన్ ల గగనతలంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఐఏఎఫ్ మిగ్-17 ప్రయాణిస్తోంది. హెలికాప్టర్‌లోని ఐఎఫ్ఎఫ్ ('ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ లేదా శత్రువు'వ్యవస్థ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం,  గ్రౌండ్ సిబ్బంది, ఛాపర్ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపం కారణంగా శత్రు విమానంగా భావించి క్షిపణితో సొంత చాపర్ నే కూల్చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వాయుసేన సిబ్బందితో పాటు ఓ పౌరుడు దుర్మరణం చెందారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఐఏఎఫ్ చాపర్ శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలోని గగనతలంలో ఉండగా అధికారులు తిరిగి రావాల్సిందిగా ఆదేశాలిచ్చారు. తిరిగి వస్తున్న చాపర్ ను గ్రౌండ్ సిబ్బంది శత్రు విమానంగా భావించి క్షిపణి దాడి చేశారు. ఇందుకు బాధ్యులైన నలుగురు అధికారులపై ఇప్పటికే పరిపాలనా చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రొసీజర్స్ క్రమశిక్షణ చర్యలు ప్రారంభిస్తున్నట్లు భదౌరియా తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు మే ప్రారంభంలో, శ్రీనగర్ బేస్  ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (ఏఓసీ) ను వాయుసేన బదిలీ చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం కారదని చీఫ్ మార్షల్ భదౌరియా ఈ సందర్భంగా హెచ్చరించారు.

Thursday, October 3, 2019

Sarad Pawar kicks off poll campaign in Junnar; hits out at BJP


ప్రచార శంఖం పూరించిన శరద్ పవార్
మహారాష్ట్ర దిగ్గజ రాజకీయ నాయకుడు శరద్ పవార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించారు. గురువారం ఆయన తమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి గెలుపు కోసం జునార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ పై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా వారిని సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరికిస్తున్నారని తాజాగా మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని తీహార్ జైలు పాలు చేశారని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించడమే కాక  రాజకీయ మైలేజ్ వచ్చే అంశాలపైనే ఆ పార్టీ నేతలు దృష్టి సారించారని ఆరోపించారు. అక్టోబర్ 21 న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పవార్ తన మొదటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ పాలన ఘోరంగా ఉందని ఫడ్నవిస్ జమానాలో శాంతిభద్రతల పరిస్థితి వెంటిలేటర్ పైకి చేరుకుందని ఘాటుగా విమర్శలు గుప్పించారు.ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను అనాలోచితంగా రద్దు చేయడం అనంతరం జీఎస్టీ కొరడా ఝళిపించడంతో వ్యాపార, వాణిజ్యరంగాలు దెబ్బతిన్నాయని దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైందని పవార్ వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీత మాట అటుంచి దేశంలోని ప్రతి వ్యక్తి నోట్ల కోసం సతమతమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఎన్సీపీ పోరాడి గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని పవార్ ధీమా వ్యక్తం చేశారు.  

Wednesday, October 2, 2019

Gandhi jayanthi: Air India paints Gandhi portrait onits aircraft


ఢిల్లీ-ముంబయి ఎయిర్ ఇండియా విమానంపై గాంధీజీ బొమ్మ
మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా తన విమానంపై బాపూజీ బొమ్మను చిత్రీకరించి నడుపుతోంది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి ముంబయి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం వెనుక భాగంలో ఉన్న గాంధీజీ పెయింటింగ్ ప్రయాణికుల్ని ఆకట్టుకుంది. సుమారు 11 అడుగుల పొడవు, 4.9 అడుగుల వెడల్పుతో గాంధీజీ పెయింటింగ్ ను ఈ ఢిల్లీ-ముంబయి ఎయిర్ ఇండియా విమానంపై అందంగా చిత్రీకరించారు. ఎయిర్ ఇండియా లోగో కింద చిత్రీకరించిన గాంధీజీ పెయింటింగ్ చూపరుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఎయిర్ లైన్స్ హౌస్ మెయింటెనెన్స్ సిబ్బంది ఈ బొమ్మ చిత్రీకరణ ప్రారంభించి పూర్తి చేశారు. ఇదిలావుండగా సెంట్రల్ రైల్వే జోన్ (ముంబయి ప్రధాన కేంద్రం) లోని డీజిల్ రైల్వే ఇంజన్లపై ఇదేవిధంగా మహాత్ముని బొమ్మను చిత్రీకరించారు. 22 లోకోమోటివ్ ఇంజన్లకు ఒకవైపున గాంధీ బొమ్మలను పెయింటింగ్ చేశారు. జాతీయ పతాకం పై అందంగా బాపూజీ బొమ్మను చిత్రీకరించి ఆ ఇంజన్లతో కూడిన రైళ్లను సెంట్రల్ రైల్వే జోన్లో ఈరోజు నడుపుతున్నారు.

BJP should first pursue path of truth and then talk about Mahatma Gandhi: Priyanka


బీజేపీ సత్యం చెప్పి.. అప్పుడు గాంధీజీ గురించి మాట్లాడాలి:ప్రియాంక
భారతీయ జనతా పార్టీ ముందు సత్యం పలకడం అలవాటు చేసుకుని ఆ తర్వాతే మహాత్మాగాంధీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఉత్తరప్రదేశ్ (యూపీ)లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన మౌన ప్రదర్శనలో పాల్గొనే ముందు విలేకర్లతో మాట్లాడారు. గాంధేయ మార్గంలో తొలుత పాటించాల్సింది నిజం చెప్పడం.. ఆ అంశాన్ని బీజేపీ గుర్తించి ఆచరించాలని ఆ తర్వాతే ఆయన గురించి మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మౌన పాదయాత్రతో తన బలాన్ని ప్రదర్శించేందుకు సమాయత్తమయింది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్‌ తనపై అత్యాచారం జరిపారని ఆరోపించిన న్యాయ విద్యార్థికి మద్దతుగా ర్యాలీకి యత్నించిన సుమారు 80 మంది కాంగ్రెస్ కార్యకర్తలను సోమవారం యూపీ సర్కారు అరెస్ట్ చేసింది. బహిరంగ సభ అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీకి సిద్ధమైన దశలో పోలీసులు వారిని నిర్బంధించారు. ఈ అరెస్టుల్ని ప్రియాంక తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో `మహిళలపై దురాగతాలు జరుగుతున్నాయి.. వాటికి వ్యతిరేకంగా పోరాడ్డానికి గొంతెత్తిన వారిపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది.` యూపీ సర్కార్ నిరంకుశ వైఖరిపై తమ ఆందోళనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రియాంక హెచ్చరించారు.