Monday, September 30, 2019

Close associate of gangster Kapil Sangwan held in Delhi


గ్యాంగ్ స్టర్ కపిల్ సంగ్వాన్ కీలక అనుచరుడి అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున గ్యాంగ్ స్టర్ కపిల్ సంగ్వాన్ ముఠా లోని కీలక సభ్యుణ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఉదయం ద్వారాక ప్రాంతంలో ఓ కారును అతను బైక్ పై వెంబడిస్తూ అటకాయించే ప్రయత్నం చేశాడు. తుపాకీతో కాల్పులకు తెగబడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో అతని ఎడమకాలులో నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో బైక్ పై నుంచి కింద పడ్డాడు. వెంటనే అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతణ్ని కపిల్ సంగ్వాన్ ప్రధాన అనుచరుడు కుల్దీప్ రాథిగా గుర్తించినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు తెలిపారు. దోపిడీ, దౌర్జన్యాలు, అపహరణలు, హత్య, హత్యా యత్నాలు, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, భూకబ్జాలు తదితర పలు కేసుల్లో రాథి నిందితుడన్నారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న కపిల్ సంగ్వాన్ పెరోల్ పై ఈ జూన్ లో విడుదలైనప్పుడు పెద్ద ఎత్తున పార్టీ చేసుకునేందుకు ముఠా సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న కరుడగట్టిన అతడి అనుచరులు 15 మందిని స్పెషల్ సెల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నజఫ్ గఢ్ లోని గొయల డైరీ ప్రాంతంలో వీరంతా సమావేశమైనట్లు ఏఎస్ఐ దినేశ్ కుమార్ కు సమాచారం అందడంతో స్పెషల్ సెల్ ను అప్రమత్తం చేశారు. ఏసీపీ మనోజ్ పంత్ ఆధ్వర్యంలో స్పెషల్ సెల్ పోలీసులు రెండు జట్లుగా విడిపోయి ఈ ముఠాపై మెరుపుదాడి చేసి పట్టుకున్నారు.  పట్టుబడ్డ వారిలో ఇద్దరు కొత్తవారు కాగా మిగిలిన 13 మంది పలు దారుణాలకు పాల్పడి పోలీసు రికార్డులకు ఎక్కినవారే. ఈ గ్యాంగ్ కు చెందిన మరో ఎనిమిది మందిని సైతం 2018 జులైలో వసంత్ కుంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

Sunday, September 29, 2019

Government bans onions export


ఉల్లి ఎగుమతులపై భారత సర్కారు నిషేధాస్త్రం
దేశంలో ఉల్లి కొరత నివారణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం ఎగుమతుల్ని నిషేధించింది. దేశవ్యాప్తంగా ఈ నిషేధ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వచ్చాయి. ఆదివారం ఈ మేరకు ఉల్లి ఎగుమతుల విధానాన్ని సవరిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో ఉల్లి ఎగుమతులపై ఎటువంటి పరిమితులు లేవు. ఆ నిబంధనను రద్దు చేస్తూ కేంద్రం సవరించిన ఉల్లి ఎగుమతుల నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 ఏడాదిలో భారత్ నుంచి రూ.3,497 కోట్ల ఉల్లి ఎగుమతులు జరిగాయి. దేశీయ మార్కెట్ లో చుక్కలనంటుతున్న ఉల్లి ధరల్ని దారిలోకి తెచ్చేందుకు కేంద్ర సర్కార్ 15 రోజుల క్రితం కనీస ఎగుమతి ధరను టన్నుకు రూ. 59,932గా నిర్ణయించింది. అయినా దేశీయ అవసరాలకు ఉల్లి అందుబాటులో లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ మేరకు సాంతం ఉల్లి ఎగుమతులపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. దేశంలో గరిష్ఠంగా ఉల్లిని ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వరదలతో అల్లాడుతుండడంతో దిగుబడి తగ్గిపోయి గిరాకీ గణనీయంగా పెరిగింది. దాంతో ఎంతకూ ధరలు దిగిరావడం లేదు. భారత్ నుంచి ప్రధానంగా బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈలకు ఉల్లి ఎగుమతయ్యేది.

Saturday, September 28, 2019

Chattisgarh: Wild elephant crushes woman, son to death


అడవి ఏనుగు దాడిలో మహిళ నాల్గేళ్ల కొడుకు మృతి
ఛత్తీస్ గఢ్ లోని అడవిలో ఏనుగు దాడిలో ఓ మహిళ సహా ఆమె నాల్గేళ్ల కొడుకు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పొద్దుపోయాక చోటుచేసుకుంది. బలరామ్ పూర్ జిల్లాలోని సెవరి గ్రామ పరిధిలో ఈ భారీ ఏనుగు దాడి చేసింది. సరోజ్ తికిరి(35), వివేక్ తికిరి(4) ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు రాజ్ పూర్ అటవీ సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్.డి.ఒ) కె.ఎస్.కుతియా శనివారం వివరాలు తెలిపారు. ఏనుగు దాడిలో ఇంకా శాంతిసంజె తికిరి(59), అమర్ మణి తికిరి(58) కూడా తీవ్రగాయాల పాలయ్యారన్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏనుగు తల్లీకొడుకుపై దాడి చేస్తుండగా కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరూ కూడా గాయపడ్డారని కుతియా తెలిపారు.

Friday, September 27, 2019

BJP's Yuvraj Singh wins Hamirpur bypoll


యూపీ ఉప ఎన్నికలో బీజేపీ నాయకుడు యువరాజ్ సింగ్ గెలుపు
ఉత్తరప్రదేశ్(యూపీ) లోని హమిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక్కడ గతంలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ సింగ్ చందల్ హత్య కేసులో నేరం రుజువుకావడంతో అతని శాసనసభ్యత్వం రద్దయింది. 22 ఏళ్ల నాటి హత్య కేసులో ఆయనకు శిక్ష పడింది. దాంతో సెప్టెంబర్ 23 (సోమవారం)  హమిర్పూర్ లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఓట్ల లెక్కింపును శుక్రవారం చేపట్టగా తాజా బీజేపీ అభ్యర్థి యువరాజ్ సింగ్ 17,846 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 74,373 ఓట్లు పడగా సమీప ప్రత్యర్థి సమాజ్ వాది పార్టీ(ఎస్పీ) అభ్యర్థికి 56,528 ఓట్లు వచ్చాయి. మూడు నాలుగు స్థానాల్లో నౌషిద్ అలీ(బీఎస్పీ), హర్దీపక్ నిషద్ (కాంగ్రెస్) నిలిచారు. ఈ ఉపఎన్నికలో మొత్తం 9మంది అభ్యర్థులు పోటీపడగా 51 శాతం ఓటింగ్ నమోదయింది. హమిర్పూర్ లో పార్టీ సీటును నిలబెట్టుకోవడంలో కృషి చేసిన కార్యకర్తలు, ప్రజలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభాభినందనలు తెలిపారు.