Tuesday, September 24, 2019

Gandhians, social activists to take out year-long march from Delhi to Geneva


అక్టోబర్ 2న న్యూఢిల్లీ-జెనీవా `జై జగత్` యాత్ర
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీ-జెనీవా `జై జగత్` యాత్ర (victory of the world) ప్రారంభం కానుంది. అహింస, శాంతి సందేశాలపై విశ్వవ్యాప్త ప్రచారం సాగించడంలో భాగంగా 15000 కి.మీ. మేర ఈ యాత్ర కొనసాగనుంది. సుమారు 200 మంది గిరిజన, దళిత ఉద్యమకర్తలు, రచయితలు, ప్రఖ్యాత గాంధేయ సిద్ధాంతకర్తలు, అభిమానులు న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ నుంచి ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ మార్చ్ లో పాల్గొంటున్నారు.  ఈ యాత్ర 10 దేశాల గుండా సాగనుంది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, సెనెగల్, స్వీడెన్, బెల్జియం తదితర దేశాల నుంచి తరలిన జైజగత్ యాత్రికులందర్నీ కలుపుకుంటూ 2020 సెప్టెంబర్ 26 నాటికి జెనీవా చేరనున్నట్లు ఏక్తా పరిషద్ జాతీయ సంయోజకుడు అనీశ్ థిలెన్కెరి తెలిపారు. గతంలో అనుకున్న ప్రణాళిక ప్రకారం జైజగత్ యాత్ర న్యూఢిల్లీ నుంచి అట్టరి-వాఘా సరిహద్దుల మీదుగా సాగాల్సి ఉంది. పాక్ లో రెణ్నెల్లు యాత్ర కొనసాగించాలనుకున్నారు. అనంతరం లాహోర్ మీదుగా ఇరాన్ చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. తాజా యాత్రను రాజ్ ఘాట్ (ఢిల్లీ) నుంచి ప్రారంభించి మహారాష్ట్రలో గాంధీజీ నెలకొల్పిన సేవాగ్రామ్ కు చేరుకుంటారు. ఆ తర్వాత నాగ్ పూర్ నుంచి యాత్ర ఇరాన్ తరలుతుంది. అక్కడ నుంచి అర్మేనియా తదితర దేశాల గుండా ముందుకు సాగుతుందని అనీశ్ వివరించారు. గాంధీజీ ప్రవచించి, ఆచరించిన అహింసా సిద్ధాంతం పట్ల ఆకర్షితుడైన నికోల్ పష్నియాన్ (ప్రస్తుత ఆర్మేనియా ప్రధానమంత్రి) తమతో పాటు అహింసా సిద్ధాంత శిక్షణ, ప్రచార కార్యక్రమాల్లో కొన్నేళ్లుగా పాలుపంచుకుంటున్నారన్నారు. ఏడాది పాటు వివిధ దేశాల గుండా సాగే జైజగత్ యాత్రికులు ఆయా ప్రాంతాల్లో స్థానిక నిర్వాహకులు సహకారంతో అహింసా ఉద్యమ ప్రచారం, శాంతి స్థాపనలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారని అనీశ్ తెలిపారు. సంఘసేవకులు పి.వి.రాజగోపాల్, గాంధేయ సిద్ధాంతవేత్త, కెనడా నాయకులు జిల్ కార్ హారిస్, దళిత, గిరిజన హక్కుల ఉద్యమకారుడు రమేశ్ శర్మ జైజగత్ యాత్రకు నేతృత్వం వహించనున్నారన్నారు. జెనీవా చేరిన అనంతరం వారం రోజుల పాటు ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి పేదరికం, పర్యావరణ సమస్యలు, అహింసావాదం, సాంఘిక బహిష్కరణ తదితర అంశాలపై జాగృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Monday, September 23, 2019

Pak has reactivated terror camp at Balakot, India ready for challenge: Rawat


బాలాకోట్ లో మళ్లీ తిష్ట వేసిన పాక్ ఉగ్రమూకలు:ఆర్మీ చీఫ్ రావత్
భారత వాయుసేన మెరుపుదాడులతో భస్మీపటలం చేసి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని బాలాకోట్ లో మళ్లీ ఉగ్రతండాలు వెలిశాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. చెన్నైలోని సైనికాధికారుల శిక్షణ కేంద్రం (ఓటీఏ)లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావత్ విలేకర్లకు ఈ విషయం తెలిపారు. సుమారు 500 మంది చొరబాటుదారులు సరిహద్దులు దాటి భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పాకిస్థాన్ ప్రజల మాటు నుంచి ఈ కుయత్నాలకు పాల్పడుతోందన్నారు. భారత సైన్యం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పుల్వామాలో (ఫిబ్రవరి 14న) పాక్ ప్రేరేపిత ఆత్మాహుతి దళ ఉగ్రవాదులు 46 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న అనంతరం భారత్ దీటుగా బదులిచ్చినా ఆ దేశం కళ్లు తెరవలేదన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తిలోదకాలిచ్చిన పాక్ సైన్యం  నియంత్రణ రేఖ (ఎల్.ఒ.సి) వెంబడి కాల్పులు జరుపుతూ భారత్ ను రెచ్చగొడుతోంది. పుల్వామా బాంబు పేలుడు తర్వాత (ఫిబ్రవరి 26న) భారత వాయుసేన పీఓకేలోని బాలాకోట్ లో దాగిన ఉగ్రమూకలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం రెండ్రోజుల క్రితం యుద్ధమంటూ వస్తే పాకిస్థాన్ ప్రపంచ పటంలో కనపడదని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి (ఆర్టికల్ 370) రద్దు అనంతరం హోంమంత్రి అమిత్ షా ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనమే మిగిలిఉందని పార్లమెంట్ లో ప్రకటించిన విషయం విదితమే. అయినా బలహీన పాకిస్థాన్ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా కయ్యానికి కాలు దువ్వాలని ఉవ్విళ్లూరడమే విచిత్రంగా కనిపిస్తోంది. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వేదికలపై భంగపడుతూనే సమరనాదం చేస్తున్నారు. యుద్ధంలో ఎవరూ గెలవరనే మాట అంటూనే కుయుక్తులు పన్నుతున్నారు. పీఓకే లోని వివిధ ప్రాంతాలలో జైష్-ఇ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ నిర్వహిస్తున్న 13 శిక్షణ శిబిరాలను తమ దేశం మూసివేసినట్లు ఇటీవల ప్రకటించారు. అందుకు భిన్నంగా తాజాగా అక్కడ ఉగ్ర కార్యకలాపాలు మళ్లీ ఊపందుకోవడం ఎవరు తీసిన గోతిలో వారే పడతారనడానికి తార్కాణంగా కనబడుతోంది.

Sunday, September 22, 2019

Rohingas are Bangladeshi, says Suu Kyi


రోహింగ్యాలు బర్మా వారు కాదన్న సూకీ: బిట్రన్ మాజీ ప్రధాని
రోహింగ్యా ముస్లింలు బర్మా జాతీయులు కాదు.. వాళ్లు బంగ్లాదేశ్ పౌరులు.. ఈ వ్యాఖ్య చేసిన వారెవరో ఆషామాషి వ్యక్తులు కాదు. ప్రజాస్వామ్య ఉద్యమ కెరటంగా ప్రపంచవ్యాప్త కీర్తి పొందిన మయన్మార్ (బర్మా) పోరాటయోధురాలు ఆంగ్ సాన్ సూకీ మాట. తాజాగా ఈ విషయాన్ని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ బయటపెట్టారు. ఆయన రచించిన `ఫర్ ది రికార్డ్` అనే పుస్తకం ద్వారా ఈ విషయం వెల్లడయింది. గురువారం లండన్ లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. కెమెరూన్ తన పదవీ కాలం (2010-2016)లో చోటు చేసుకున్న అనేక పరిణామాల్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. మయన్మార్ పాలకులు మొదటి నుంచి రోహింగ్యాలపై ఇదే వైఖరి కనబరుస్తుండగా సూకీ సైతం అదే పంథా కల్గి ఉండడమే యావత్ ప్రపంచానికి విస్మయం కల్గించింది. సైనిక పాలన నుంచి మయన్మార్ కు విముక్తి కల్పించాలని నిజమైన ప్రజాస్వామ్యం దేశంలో పరిఢవిల్లాలని పరితపించి స్ఫూర్తిమంతమైన ఉద్యమాన్ని నడిపిన ధీర సూకీ. 1989 నుంచి 2010 వరకు సూకీ సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. అందుకు వేదికగా `నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ)` అనే ప్రజాస్వామ్య అనుకూల రాజకీయ పార్టీకి నాయకత్వం వహించారు. దాంతో సైనిక పాలకులు మొత్తం 15 ఏళ్ల పాటు సూకీని గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమె కారాగారవాసంలో ఉండగానే 1991లో నోబెల్ శాంతి బహుమతిని పొందారు. ప్రస్తుతం మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ హోదాలో ఉన్న సూకీ కాబోయే అధ్యక్షురాలు. సూకీ అంటే తనకెంతో గౌరవాభిమానాలున్నాయంటూ కెమెరూన్ తన పుస్తకంలో రాశారు. 2013 అక్టోబర్ లో ఆమె లండన్ పర్యటనకు రావడంతో ప్రపంచం మొత్తం కళ్లు ఇక్కడే కేంద్రీకృతమయ్యాయన్నారు. అప్పటికే మయన్మార్ లో రోహింగ్యాలపై హింస చెలరేగింది. వారిపై అత్యాచారాలు, హత్యలు, జాతి నిర్మూలన దాష్టీకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాఖైన్స్ (ప్రావిన్స్) లో బౌద్ధుల దాడులతో రోహింగ్యాలు లక్షల సంఖ్యలో పొరుగునున్న బంగ్లాదేశ్ కు పారిపోయారు. దాంతో ప్రపంచం నలుమూలల నుంచి రోహింగ్యాలకు సానుభూతి వెల్లువెత్తుతోందని సూకీ దృష్టికి తెచ్చినట్లు కెమెరూన్ పేర్కొన్నారు. అందుకు సూకీ చెప్పిన సమాధానంతో ఆయన అవాక్కయ్యారు. 'వారు నిజంగా బర్మా వారు కాదు, వాళ్లు బంగ్లాదేశ్ జాతీయులు` అంటూ సూకీ బదులిచ్చారని ఆ పుస్తకంలో కెమెరూన్ రాశారు. పైగా రోహింగ్యాలే కాదు.. బౌద్ధులు హింసకు గురౌతున్నట్లు సూకీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేవలం భయాందోళనల వల్లే అక్కడేదో జరిగిపోతున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆ క్రమంలోనే సూకీ మయన్మార్ లో జాతి ప్రక్షాళన జరుగుతోందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సూకీ పాలనాపగ్గాలు చేపట్టాక రోహింగ్యాలపై దాడులు ఆగకపోగా మరింత పెచ్చుమీరినట్లు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిషన్ నివేదిక  స్పష్టం చేసిన అంశాన్ని కెమెరూన్ తన పుస్తకంలో ప్రస్తావించారు. దేశంలో మారణహోమాన్ని నిలువరించడం, దోషులపై దర్యాప్తు జరపడం, నేరస్తుల్ని శిక్షించే చట్టాన్ని రూపొందించడంలో సూకీ ప్రభుత్వం విఫలమైంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆగస్ట్ 2017లో సుమారు 7,00,000 మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ పారిపోయి తలదాచుకున్నారు. తాజాగా విడుదలైన కెమెరూన్ పుస్తకం ద్వారా మరోసారి రోహింగ్యాల కడగండ్లు తెరపైకి వచ్చినట్లయింది.


Saturday, September 21, 2019

UP farmers stopped at Delhi border


ఢిల్లీలో యూపీ రైతుల ర్యాలీ అడ్డగింత
తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరిన ఉత్తరప్రదేశ్ రైతుల్ని పోలీసులు ఢిల్లీ లోని వివిధ ప్రాంతాల్లో నిలిపివేశారు. యూపీలోని నోయిడా నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ కిసాన్ సంఘటన్ కు చెందిన రైతులు శనివారం ర్యాలీ ప్రారంభించారు. చెరకు బకాయిల చెల్లింపు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, వ్యవసాయ రుణ వితరణల కోసం రైతులు తమ గోడును కేంద్ర మంత్రితో వెళ్లబోసుకునేందుకు బయలుదేరారు. ఘాజీపూర్ సరిహద్దుల నుంచి జాతీయ రహదారులు నం.9, నం.24 గుండా వేల సంఖ్యలో రైతులు ర్యాలీ తీయడంతో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఏదో విధంగా వివిధ మార్గాల్లో రైతునేత దివంగత మాజీ ప్రధాని చరణ్ సింగ్ సమాధి ప్రాంతం కిసాన్ ఘాట్ చేరుకున్న రైతుల్ని పోలీసులు నిలిపివేశారు. ఇందిరాపురం, ఆనంద్ విహార్ తదితర ప్రాంతాల్లో రైతు ర్యాలీల్ని పోలీసులు భగ్నం చేసి వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతకుముందు నోయిడాలో ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు విఫలం కావడంతో రైతులు ఛలో ఢిల్లీ ర్యాలీ తీయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే మంత్రితో భేటీకి రైతు సంఘం ప్రతినిధులకు అధికారులు అనుమతి ఇచ్చారు. రైతుల ర్యాలీ సందర్భంగా పోలీసులు దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.