Monday, September 16, 2019

AP CM YSJagan arial survey at kachuluru


లాంచీ మునిగిన కచ్చులూరు ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
గోదావరి లాంచీ మునక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించారు. దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన లాంచీ దుర్ఘటన లో 12 మంది మృతదేహాల్ని వెలికితీశారు. ఆదివారం 8, సోమవారం మరో నాలుగు మృతదేహాల్ని వెలికితీసి రాజమండ్రి  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మునిగిపోయిన లాంచీ, అందులో చిక్కుకుపోయిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు దుర్ఘటన ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రెండు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో 34 మంది గల్లంతైనట్లు భావిస్తున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుర్ఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. సీఎం జగన్‌  వెంట ఏపీ హోంమంత్రి సుచరిత, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ తదితరులు ఉన్నారు. అనంతరం జగన్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాద బాధితులను పరామర్శించారు. బోటు ప్రమాదానికి గల కారణాలను అధికారుల్నిఅడిగి తెలుసుకున్నారు. బాధితులు ఒక్కొక్కరి వద్దకు వెళ్లి యోగ క్షేమాలు కనుక్కున్నారు. బాధితులకు అందుతున్న చికిత్స గురించి సీఎం జగన్ వైద్యుల్ని ఆరా తీశారు. ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ సర్కారు ఆదివారమే రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తెలంగాణ సీఎం కె.సి.ఆర్. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Sunday, September 15, 2019

Microsoft CEO Satya Nadella Arrives In Hyderabad To Perform Father's Funeral


తండ్రి అంత్యక్రియల కోసం హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల శనివారం మధ్యరాత్రి  హైదరాబాద్ వచ్చారు. ఆయన తండ్రి ప్రఖ్యాత మాజీ ఐఏఎస్ అధికారి యుగంధర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక విమానంలో లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. పీవీ నరసింహారావు హయాంలో పీఎంఓలో యుగంధర్ సెక్రటరీగా పనిచేశారు. 1962 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన 2004_2009 వరకు ప్రణాళికా సంఘం సభ్యునిగా విధులు నిర్వర్తించారు. ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి ఎన్.ఎ.ఎ. అకాడెమీ డైరెక్టర్ గా (1988_93) బాధ్యతలు వహించారు. ఐఏఎస్ అధికారిగా పలు కీలక బాధ్యతలు చేపట్టిన యుగంధర్(82) ఈనెల13న పరమపదించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆదివారం జుబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు.

Saturday, September 14, 2019

IAF to felicitate locals who helped in locating missing AN-32 in Arunachal on sept 17


ఎ.ఎన్-32 జాడ చెప్పిన వారిని సన్మానించనున్న ఐఏఎఫ్ 
కూలిన తమ విమానం జాడ కనుగొనేందుకు సహకరించిన వారిని భారత వాయుసేన (ఐఏఎఫ్) సన్మానించనుంది. ఈ నెల17న వెస్ట్ సియాంగ్ జిల్లాలోని అలోలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. సెర్చ్ ఆపరేషన్స్ లో పాల్గొన్న అధికారులు, పర్వాతారోహకులు, స్థానికులకు ఐఏఎఫ్ రూ.5లక్షల నగదు నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. విమాన జాడ కనుగొనేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన అందరికీ నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాల్ని అందించనుంది. ఈ మేరకు ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రధానకార్యదర్శి నరేశ్ కుమార్, సియాంగ్ డిప్యూటీ కమిషనర్ రాజీవ్ తకూక్ కు వేర్వేరుగా రాసిన లేఖల్లో తెలిపారు. 
ఈ ఏడాది జూన్3న అసోంలోని జోర్హాట్ లో వరద బాధితులకు సహాయ సామగ్రి అందించి అరుణాచల్ ప్రదేశ్ మెచుకా ఎయిర్ ఫీల్డ్ కు తిరుగు ప్రయాణంలో వాయుసేన విమానం ఎ.ఎన్-32 కూలిపోయింది. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ విమానం అదృశ్యమయిందని తొలుత భావించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూం(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోవడంతో విమానం జాడ కోసం వాయుసేన వెతుకులాట ప్రారంభించింది. జోర్హాట్ నుంచి 13 మందితో మధ్యాహ్నం 12.25కు టేకాఫ్ అయిన ఎ.ఎన్-32కు అర్ధగంట తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. తర్వాత చేపట్టిన సెర్చ్ ఆపరేషన్స్ లో అరుణాచల్ ప్రదేశ్ అధికారులతో పాటు పర్వతారోహకులు, స్థానికులు పాల్గొన్నారు. జూన్ 19న అరుణాచల్ ప్రదేశ్ లోని లిపో ఉత్తర దిశలో విమాన శకలాలు గుర్తించారు. ఆ రోజు ఆరు మృతదేహాల్ని, మరుసటి రోజు జూన్ 20న మరో ఏడుగురి మృతదేహాల్ని వెలికితీశారు. విమానం బ్లాక్ బాక్స్, మృతులకు సంబంధించిన విలువైన వస్తువుల్ని ఐఏఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఈ విమానం జాడను ఐ.ఎ.ఎఫ్.కు తెలిపిన పాయూం గ్రామవాసి తదుత్ తాచుంగ్ కు రూ.1.5 లక్షలు, మొత్తం సహాయ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన పర్వతారోహకుడు తకాతాముత్ కు రూ.1లక్ష, కిషాన్ తెక్సెంగ్ కు రూ.20వేలు, తగుంగ్ తాముత్, తలిక్ దరుంగ్, ఒకెన్మా మిజేలకు రూ.15వేల చొప్పున, మిగిలిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాల్ని అందించనున్నారు.

Friday, September 13, 2019

Ganpati immersions: 18 dead across Maharashtra


మహారాష్ట్ర గణేశ్ నిమజ్జనాల్లో 18 మంది మృతి

మహారాష్ట్రలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం అనంత చతుర్దశి ప్రారంభమైన తర్వాత గణేశ్ నిమజ్జనాలు మొదలయ్యాయి. గురు, శుక్రవారాల్లో పెద్ద ఎత్తున విగ్రహ నిమజ్జనాలకు ఆయా ప్రాంతాల్లో భక్తులు తరలివెళ్లారు. థానేలో గురువారం రాత్రి 7.30 సమయంలో కసారాకు చెందిన కల్పేశ్ జాదవ్ అనే 15 ఏళ్ల బాలుడు గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా మునిగిపోయినట్లు పోలీసులు తెలిపారు.  అమరావతిలోని పూర్ణా నదిలో విగ్రహాల నిమజ్జన సమయంలో వటోల్ శుక్లేశ్వర్ గ్రామానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. నాసిక్ లోని గోదావరి నది స్నాన ఘాట్ రామ్‌కుండ్ సమీపంలో మునిగిపోయిన ప్రశాంత్ పాటిల్(38), పహిన్ గ్రామంలోని చెరువులో మునిగిపోయిన యువరాజ్ రాథోడ్(28) మృతదేహాల్ని పోలీసులు వెలికితీశారు. సతారా జిల్లాలోని కరాడ్ వద్ద కోయనా నదిలో మల్కపూర్ నివాసి చైతన్య షిండే(20) కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. అకోలాలో నీటితో నిండిన క్వారీలో నిమజ్జనం చేస్తుండగా విక్కీ మోర్(27) అనే యువకుడు మునిగిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేసినా భక్తులు విగ్రహాలతో అక్కడకు చేరుకుని నిమజ్జన కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. నాసిక్‌లోని సోమేశ్వర్ జలపాతం సమీపంలో లైఫ్‌గార్డులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ముగ్గుర్ని రక్షించారు. భండారా జిల్లాలోని డోల్సర్ గ్రామ చెరువులో సోమరా శివానకర్ అనే వ్యక్తి మునిగిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. అమరావతి, నాసిక్, థానే, సింధుదుర్గ్, రత్నగిరి, ధూలే, భండారా, నాందేడ్, అహ్మద్ నగర్, అకోలా, సతారాతో సహా 11 జిల్లాల్లో జరిగిన నిమజ్జనాల్లో మొత్తం 18 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అమరావతిలో నాలుగు; రత్నగిరిలో మూడు; నాసిక్, సింధుదుర్గ్, సతారాల్లో రెండేసి; థానే, ధూలే, బుల్ధనా, అకోలా, భండారాలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదయినట్లు వివరాలు వెల్లడించారు.