Tuesday, September 3, 2019

3 CISF personnel among 4 killed in fire at ONGC plant; 3 hurt

ఓఎన్జీసీ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం:నలుగురి దుర్మరణం

నవీ ముంబయిలోని ఓఎన్జీసీ చమురు, సహజవాయువు శుద్ధి కర్మాగారంలో మంగళవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా కాలిన గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో ముగ్గురు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సి.ఐ.ఎస్.ఎఫ్) సిబ్బంది కాగా ప్లాంట్ కు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన ముగ్గురు కూడా సి.ఐ.ఎస్.ఎఫ్.కు చెందిన వారేనన్నారు. నవీ ముంబయికి 50 కి.మీ. దూరాన గల ఉరాన్ లోని ప్లాంట్ లో అగ్నిప్రమాదం ఉదయం 6.47కు జరిగినట్లు సమాచారం. ఓ యూనిట్ పైప్ లైన్  లో గ్యాస్ లీకై రాజుకున్న నిప్పుతో రెండుగంటల్లోనే మొత్తం ప్లాంట్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. భారీ అగ్ని కీలలు చెలరేగడంతో పాటు ఉరాన్ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు వెళ్లిన సిబ్బంది మృత్యువాత పడినట్లు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్(వెస్ట్ జోన్) నీలిమా సింగ్ తెలిపారు. అయితే స్థానికులు భయపడనక్కర్లేదని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాద ప్రభావం తమ ఉత్పత్తిసరఫరా కార్యకలాపాలపై పడబోదని ఓఎన్జీసీ రెసిడెంట్ ప్రోడక్షన్ సూపరింటెండెంట్ సీఎన్ రావు తెలిపారు. గ్యాస్ ను సూరత్(గుజరాత్) లోగల తమ హజిరా ప్లాంట్ కు మళ్లిస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజీని అదుపు చేస్తున్నట్లు చెప్పారు. 22 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఘటన వార్త తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జె.ఎన్.పి.టి)రిలయన్స్ గ్రూప్తలోజాలోని మహారాష్ర్త ఇండస్రిా్యల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిబ్బందినవీ ముంబయి వాసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Monday, September 2, 2019

Man arrested for trying to enter Parliament with knife


కత్తితో పార్లమెంట్ లోకి వెళ్లబోయిన దుండగుడి అరెస్ట్
భారత పార్లమెంట్ లోకి కత్తితో వెళ్లేందుకు యత్నించిన 26 యువకుణ్ని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని లక్ష్మీ నగర్ కు చెందిన సాగర్ ఇన్సాగా అతణ్ని గుర్తించారు. అత్యాచార కేసులో అరెస్టయి జైలులో ఉన్న డేరా సచ్ఛా సౌధ అధినేత గుర్మీత్ రామ్ సింగ్ అనుచరుడిగా భావిస్తున్నారు. ఈ ఉదయం సుమారు 11 గంటలకు దుండగుడు గేట్ నంబర్ 1 నుంచి పార్లమెంట్ లోకి ప్రవేశించాలని యత్నించాడు. అక్కడ తనిఖీల్లో అతని వద్ద కత్తిని గుర్తించిన రక్షణ సిబ్బంది వెంటనే నిర్బంధించారు. పోలీసులు దుండగుణ్ని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐ.బి) అధికారులు కూడా అక్కడకు చేరుకుని అతణ్ని ప్రశిస్తున్నారు. న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈష్ సింఘాల్ ఈ మేరకు పాత్రికేయులకు వివరాలు వెల్లడించారు. కత్తిని రహస్యంగా దుస్తుల్లో దాచిపెట్టుకుని బైక్ పై దుండగుడు పార్లమెంట్ కు వచ్చినట్లు  తెలిపారు. కత్తితో పాటు బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతణ్ని నిర్బంధించినప్పుడు డేరా సచ్ఛా సౌధకు అనుకూలంగా నినాదాలు చేశాడన్నారు. దుండగుడు ఏ ఉద్దేశంతో పార్లమెంట్ లోకి ప్రవేశించాలనుకున్నాడో విచారణలో తేలనుందని సింఘాల్ చెప్పారు. అతని తల్లిదండ్రులు చిరువ్యాపారులని, సోదరుడి బైక్ ను తీసుకుని వచ్చి ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడన్నారు.

Sunday, September 1, 2019

Indian American shireen Mathews nominated as federal judge


కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు జడ్జిగా షిరీన్ మాథ్యూస్ నియామకం
ఇండో అమెరికన్ షిరీన్ మాథ్యూస్ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కార్యాలయం (వైట్ హౌస్) ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమితులైన ఇండో అమెరికన్లలో ఆమె ఆరోవారు. దక్షిణాది రాష్ట్రమైన కాలిఫోర్నియాలోని శాన్ డియోగోలో గల ఫెడరల్ కోర్టులో ఆమె జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందుకు సెనెట్ ఆమోదముద్ర పడాల్సి ఉంది. ఆమె నియామకంతో న్యాయస్థానంలో సమర్థంగా దక్షిణాసియా గొంతు వినిపించగలదనే ఆశాభావాన్ని దక్షిణాసియా బార్ అసోసియేషన్ (ఎస్.ఎ.బి.ఎ-నార్త్ అమెరికా) అధ్యక్షుడు అనీశ్ మెహతా వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు న్యాయవాదిగా షిరీన్ రాణించారని కాలిఫోర్నియా కోర్టు ధర్మాసనంలోనూ ఆమె తనదైన ముద్ర వేయగలరని ఎన్.ఎ.పి.ఎ.బి.ఎ. అధ్యక్షులు డేనియల్ సాకాగుచి ఆకాంక్షించారు.  జార్జిటౌన్ యూనివర్సిటీ లో ఆర్ట్స్ డిగ్రీ చేసిన షిరీన్ న్యాయశాస్త్ర పట్టాను డ్యూక్ వర్సిటీ నుంచి పొందారు. ఆమె 2008 నుంచి 2013 వరకు కాలిఫోర్నియా కోర్టులో అసిస్టెంట్ క్రిమినల్ లాయర్ గా విధులు నిర్వహించారు. అంతకుముందు షిరీన్ శాన్ డియోగోలోని లాథమ్ అండ్ వాట్కిన్స్ (ఎల్.ఎల్.పి) అసోసియేట్ గా బాధ్యతలు వహించారు. న్యాయశాస్త్ర పట్టా పొందిన తొలిరోజుల్లో ఆమె కాలిఫోర్నియా కోర్టు జడ్జి ఇర్మాఈ గోంజలెజ్ వద్ద క్లర్క్ గా పనిచేశారు. అంచెలంచెలుగా న్యాయశాస్త్రాన్ని అవపోశన పట్టిన ఆమె అవినీతి కేసుల్ని వాదించడంలో దిట్టగా రాణించారు. క్రిమినల్ కేసుల్లోనూ సమర్ధురాలైన న్యాయవాదిగా పేరొందారు. ప్రతిష్టాత్మక న్యాయ సంస్థ `జోన్స్ డే` భాగస్వామి అయిన షిరీన్ వైద్య పరికరాల భారీ చోరీ కేసును వాదించి విజయం సాధించారు.

Saturday, August 31, 2019

Final NRC out in Assam, nearly 2 million stare at uncertain future


అసోం లో ఎన్.ఆర్.సి. తుది జాబితా తకరారు
 ·    అనర్హులుగా 19 లక్షల మంది


అసోంలో జాతీయ పౌర పట్టి (ఎన్.ఆర్.సి) తుది జాబితాను శనివారం విడుదల చేశారు. జాతీయ పౌరసత్వ నమోదుకు మొత్తం 3,30,27,661 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 3,11,21,004 మంది ధ్రువీకరణ పొందారు. మరో 19,06,657 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో వారంతా విదేశీయులుగా పరిగణనలోకి రానున్నారు. అయితే ప్రభుత్వం వారిపై ఇప్పటికిప్పుడు చర్యలేవీ ఉండవని హామీ ఇస్తోంది. వారికి నాలుగు నెలలు గడువు ఇవ్వనున్నారు. న్యాయస్థానాల్లో తమ భారత పౌరసత్వం గురించి వారు కేసులు దాఖలు చేసుకోవచ్చు. అందుకయ్యే న్యాయసేవా ఖర్చును ప్రభుత్వం భరించనున్నట్లు పేర్కొంది. ఆల్ అసోం స్టూడింట్స్ యూనియన్ (ఆసు) తుది జాబితాపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్.ఆర్.సి. లోని అవకతవకలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆసు ప్రధానకార్యదర్శి లురింజ్యోతి గొగొయ్ చెప్పారు. 1971లో బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చి భారత్ లో నివసిస్తున్న శరణార్థుల ధ్రువపత్రాల్ని ఎన్.ఆర్.సి. అధికారులు తిరస్కరించడం వివాదం రేపుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చి ఉంటున్న వారి పౌరసత్వాన్ని అధికారులు ధ్రువీకరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న భారతీయుల్ని అనర్హులుగా పరిగణించడంపై పెద్దఎత్తున ఆరోపణల సెగరేగుతోంది. ఈ తుది జాబితాపై తాము ఏమాత్రం సంతోషంగా లేమని బీజేపీ మాజీ ఎంపీ  మంగల్దోయ్ వ్యాఖ్యానించారు. ఎన్.ఆర్.సి. విడుదల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని 10 జన్ పథ్ నివాసానికి వెళ్లి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కలుసుకున్నారు. ఈ విషయంలో కేంద్రం విఫలమైందని సమావేశంలో ఏకే అంటోనీ, గౌరవ్ గొగొయ్, గులాంనబీ అజాద్, లోక్ సభ పక్ష నేత అధిర్ రంజిన్ చౌధురి వ్యాఖ్యానించినట్లు సమాచారం. అనంతరం అధిర్ విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్యలపై వ్యంగ్యోక్తులు విసిరారు. దేశంలో తమ పార్టీ అధికారంలో ఉండబట్టే ఎన్.ఆర్.సి. నిర్వహించగల్గుతున్నామన్న తివారీ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ పార్లమెంట్ లోనూ ఎన్.ఆర్.సి. నిర్వహిస్తారా అని అధీర్ ఎద్దేవా చేశారు.  తనూ బయట నుంచే వచ్చానంటూ తన తండ్రి బంగ్లాదేశ్ లో ఉండేవారని గుర్తు చేశారు. నిజమైన పౌరుల్ని దేశం నుంచి బహిష్కరించరాదని వారందరికీ రక్షణ కల్పించాలని అధీర్ హితవు చెప్పారు. మరో వంక అసోంలో అల్లర్లు చెలరేగకుండా 144వ సెక్షన్ విధించారు.