Friday, August 30, 2019

India pays in advance for S-400 missiles to Russia


2023లో భారత సైన్యం చేతికి రష్యా ఎస్-400 క్షిపణులు
రష్యాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎస్-400 గగనతల రక్షణ క్షిపణులు 2023లో భారత సైన్యం చేతికి అందనున్నాయి. ఈ మేరకు రష్యాకు భారత్ ముందస్తు మొత్తాన్ని (బయానా) చెల్లించింది. భూఉపరితలం నుంచి గగనతలంలో శత్రుదుర్భేద్య మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థ (ఎస్-400) నిర్ణీత గడువులో భారత సైన్యం అమ్ములపొదిలో చేరనుంది. ఇందుకు సంబంధించి భారత్ తో అన్ని అంశాలు పరిష్కృతమై ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు రష్యా ఫెడరల్ సర్వీసెస్ మిలటరీ అండ్ టెక్నికల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తను భారత్ లోని రష్యా రాయబార వ్యవహారాల మంత్రి రోమన్ బబుష్కిన్ ధ్రువీకరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రానున్న నాల్గేళ్లలో ఈ  ఎస్-400  క్షిపణి రక్షణ వ్యవస్థ (మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్/ యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్) భారత్ కు అందనున్నట్లు తెలిపారు. భారత్, రష్యాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేర్చడంలో భాగంగా ఒప్పందం ప్రకారం ఈ క్షిపణుల్ని సకాలంలో అందజేయనున్నామన్నారు. రష్యా తయారీ ఎస్-400 క్షిపణికి 600 కి.మీ దూరంలోని లక్ష్యాలను తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. రెండంచెల రక్షణ వ్యవస్థ కల్గిన ఈ క్షిపణులు 1990లో రూపుదిద్దుకుని అనేక పరీక్షల అనంతరం 2007లో రష్యా సైన్యం చెంతకు చేరాయి. ప్రపంచంలో ఈ ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థే ప్రస్తుతానికి అత్యంత ఆధునికమైంది. నాటో (ఉత్తర అమెరికా, యూరప్) దేశాల్లో ఈ క్షిపణుల్ని ఎస్.ఎ-21 గ్రోవ్లర్ గా పిలుస్తారు.

Thursday, August 29, 2019

One of the stalwarts of people's telugu movement Gidugu Rama Murthy


అచ్చతెలుగు దివ్య వెలుగు గిడుగు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. తెలుగు మాతృభాషగా మాట్లాడే వారు సుమారు 11 కోట్ల మంది. దేశంలో ప్రాంతీయ భాషలలో మాట్లాడే వారి సంఖ్యలో తెలుగు వారు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగుది 15వ స్థానం. దేశంలో హిందీ తర్వాత స్థానంలో తెలుగు నిలుస్తోంది. `ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్` గా కీర్తి పొందింది. `దేశ భాషలందు తెలుగు లెస్స` అని శ్రీకృష్ణదేవరాయలతో ప్రశంసలు అందుకుంది. అటువంటి తెలుగును సామాన్య జనం వాడుక భాష లో అందరి దరికి చేర్చిన మహానుభావుల్లో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు ఆద్యులు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడాయన. గిడుగు వాడుక భాషా ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు తర్వాత  అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 29 ని `తెలుగు భాషా దినోత్సవం` గా జరుపుకుంటున్నాం.
గిడుగు రామ్మూర్తి పంతులు 1863 లో శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వీర్రాజు విష జ్వరంతో మరణించారు. ప్రాథమిక విద్య అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు విజయనగరంలోని మేనమామ గారి ఇంటికి చేరి హైస్కూలు చదువు పూర్తి చేశారు. ఆయనకు 10వ తరగతిలో గురజాడ అప్పారావు గారు సహాధ్యాయి. అనంతరం పర్లాకిమిడి రాజా వారి పాఠశాల్లో 8వ తరగతి చరిత్ర ఉపాధ్యాయుడిగా గిడుగు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ప్రయివేటుగా బి.ఎ. చేశారు. డిగ్రీలో చరిత్రను ముఖ్య పాఠ్యాంశంగా ఎంచుకున్న ఆయన రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించారు.
చదువంటే ఎనలేని మమకారం గల గిడుగు బహుభాషా కోవిధుడు. తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతంతో పాటు సవర భాషను పట్టుబట్టి నేర్చుకున్నారు. సవరలు వారి భాషలోనే చదువుకొనేలా ప్రోత్సహించారు. సొంతంగా పాఠశాల ప్రారంభించి ఉపాధ్యాయుల్ని నియమించి వారికి జీతాలు ఇస్తూ సవరలకు చదువు నేర్పారు. వారిని తన ఇంట్లోనే పెట్టుకుని భోజనం పెడుతూ చదువు చెప్పించారు. స్వయంగా ఆయన సవర భాషలో పుస్తకాలు రాశారు. సవర-ఇంగ్లీషు డిక్షనరీ రూపొందించారు. మద్రాస్ ప్రభుత్వం గిడుగు కృషిని గుర్తించి `రావుబహుదూర్` బిరుదుతో పాటు, కైజర్-ఇ-హింద్ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. ఆనాడే సవరలు, హరిజనులు అంటరాని వారు కాదని వారితో మమేకం అయిన ధీశాలి.
1907లో  ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా ఇంగ్లీషు దొర యేట్సు వచ్చారు. ప్రజలు మాట్లాడే భాష, పాఠ్య పుస్తకాల భాష మధ్య తేడాలు ఎందుకు ఉన్నాయని యేట్సుకు సందేహం వచ్చింది. ఆ విధంగా వాడుక భాష ఉద్యమం గురజాడ, గిడుగు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సుల ద్వారా ప్రారంభమైంది. జనం మాట్లాడే తెలుగు భాషను గ్రంథ రచనకు అనువుగా చేయడానికి ఎనలేని కృషి చేసిన గిడుగుకు వీరేశలింగం పంతులు ఊతం కూడా లభించింది. 1919లో వాడుక భాషా ఉద్యమ ప్రచారం కోసం 'తెలుగు' అనే మాసపత్రిక నడిపారు. వ్యాసాలు, ఉపన్యాసాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. స్కూలు, కాలేజీ పుస్తకాల్లోని  గ్రాంథికభాషను క్రమంగా వాడుకభాషలోకి తేవడానికి గిడుగు సాగించిన కృషి ఫలించింది. ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వాడుక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది. తాపీ ధర్మారావు సంపాదకుడిగా ప్రారంభమైన `జనవాణి` అనే పత్రిక వాడుక భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది. వాడుక భాష లో విద్య బోధిస్తేనే ప్రయోజనం ఉంటుందని గిడుగు నిరూపించారు. జనం మాట్లాడే భాష అంతటా వినబడుతూ ఉంటుంది. అదే నిత్య జీవంతో కళకళలాడుతుందని లోకానికి చాటి చెప్పిన మహనీయులు గిడుగు రామ్మూర్తి.  ఆయన 1940 జనవరి 22న రాజమండ్రిలో మరణించారు.

Wednesday, August 28, 2019

J&K administration says more schools to open today; parents worried


కశ్మీర్ లో విద్యార్థుల్లేక బోసిపోతున్న పాఠశాలలు
కశ్మీర్ లోయలో రెండు వారాల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నా విద్యార్థులు రాకపోవడంతో తరగతి గదులు బోసిపోతున్నాయి. ఈ నెల 5న కేంద్రప్రభుత్వం జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో అక్కడ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కొనసాగింది. పాఠశాలలతో పాటు అన్ని విద్యాలయాలు, వివిధ కార్యాలయాలు రోజుల తరబడి మూసివేశారు. క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో జనజీవనం యథావిధిగా కొనసాగుతోంది. దాంతో ప్రాథమిక పాఠశాలల్ని సోమవారం పున: ప్రారంభించారు. బుధవారం నుంచి ఉన్నత పాఠశాలల్ని తెరిచారు. అయితే కశ్మీర్ లోయ ఇంకా భద్రత దళాల జల్లెడలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో బాలల్ని పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. పేరుకే పాఠశాలలు తెరుచుకున్నాయి గానీ విద్యార్థులు లేక తరగతులు ఖాళీగా కనిపిస్తున్నాయి. బుధవారం నాటికి కూడా విద్యార్థుల హాజరుశాతం పెరగలేదని జె.కె. ప్రభుత్వ ప్రతినిధి రోహిత్ కన్సాల్ తెలిపారు. విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సి ఉందన్నారు. శ్రీనగర్ లో దాదాపు 200 ప్రాథమిక పాఠశాలల్ని పున: ప్రారంభించారు. అత్యధిక స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా నమోదయింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దక్షిణ కశ్మీర్ సోపియాన్ లో పదుల సంఖ్యలో పాఠశాలలు తెరిచినా ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదని కశ్మీర్ పాఠశాల విద్యా సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) యూనిస్ మాలిక్ తెలిపారు. స్కూళ్లకు పంపి తమ పిల్లల ప్రాణాలతో తల్లిదండ్రులు చెలగాటమాడరు కదా అని బాట్మాలూ జిల్లా కు చెందిన గుల్జార్ అహ్మద్ వ్యాఖ్యానించారు. తన ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్తుండగా అల్లర్లు చెలరేగాయన్నారు. దాంతో పరిస్థితి సద్దుమణిగే వరకు వాళ్లను ఇంటి వద్దనే ఉంచినట్లు గుల్జార్ తెలిపారు. కనీసం సెల్ ఫోన్ నెట్ వర్క్స్ పునరుద్ధరించినట్లయితే తమ పిల్లల్ని స్కూళ్లకు పంపగలమని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

Tuesday, August 27, 2019

PM meets PV Sindhu, congratulates her for winning gold at BWF World Championships


ప్రధాని మోదీ, మంత్రి రిజిజుల్ని కలిసిన పీవీ సింధు
స్విట్జర్లాండ్ (బాసెల్)లో ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని సాధించిన తొలి భారతీయ షట్లర్ గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు ప్రధాని మోదీ, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుల్ని కలుసుకుంది. కోచ్ లు పి.గోపీచంద్, కిమ్ జి హ్యూన్, తండ్రి పి.వి.రమణలతో కలిసి ఆమె మంగళవారం ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సింధూ సాధించిన ఘనత యావత్ భారతదేశానికి గర్వకారణమన్నారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ ప్రపంచ చాంపియన్ షిప్ లో తొలి స్వర్ణాన్ని సాధించడం ద్వారా సింధు దేశానికి కీర్తిని తీసుకువచ్చిందని..ఆమెను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ లో ఆమె మరిన్ని విజయాల్ని సాధించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి రిజిజు ఆమెకు ఈ సందర్భంగా రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని (చెక్) అందించారు.