Thursday, August 15, 2019

Phone tapping: Cong demands probe as ruling BJP steps up



కర్ణాటకలో మళ్లీ ఫోన్ల ట్యాపింగ్ రగడ
కర్ణాటక మరో వివాదానికి వేదికయింది. తాజాగా కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు తాజా వివాదానికి తెరతీశారు. ప్రస్తుత సీఎం బి.ఎస్.యడ్యూరప్ప కాంగ్రెస్ నేతల ఆరోపణలకు స్పందిస్తూ విచారణకు ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ నేతలతో పాటు సీనియర్ పోలీసు అధికారుల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.ఎస్.సదానంద గౌడ విలేకర్లతో మాట్లాడుతూ అనధికారికంగా ఫోన్లను ట్యాప్ చేయడం క్రిమినల్ నేరంగా పేర్కొన్నారు. సమగ్ర విచారణతో ట్యాపింగ్ దోషుల్ని పట్టుకుని శిక్షించడం జరుగుతుందన్నారు. సదానంద గౌడ స్వల్ప కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూర్ ఉత్తర లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నగర అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సీఎం యడ్యూరప్ప నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎంగా కుమారస్వామి పదవిలో ఉన్నప్పుడు నగరానికి కొత్త కమిషనర్ గా భాస్కర్ రావు నియమితులు కానున్నారంటూ ముందుగానే మీడియాకు విడుదలయిన ఆడియో టేప్ తాజా టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతానికి కేంద్రబిందువయింది. కమిషనర్ తో పాటు ఇద్దరు ఐ.పి.ఎస్ ఆఫీసర్ల టెలిఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ ఉదంతంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైం) ఇచ్చిన మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు (ఏప్రిల్ 18,23) ముగిశాక మే,జూన్ ల్లో మొత్తం మూడుసార్లు భాస్కర్ రావు ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు బట్టబయలయింది. కొత్త సీఎం యడ్యూరప్ప బెంగళూర్ సిటీ పోలీస్ కమిషనర్ గా అలోక్ కుమార్ సింగ్ (1994 బ్యాచ్) స్థానంలో భాస్కర్ రావు(1990 బ్యాచ్)ను ఆగస్ట్ 2న నియమించిన సంగతి తెలిసిందే. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు భాస్కర్ రావు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) హోదాలో కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కె.ఎస్.ఆర్.పి) విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు నిర్ధారణ అయింది. అలోక్ సింగ్ కమిషనర్ గా కనీసం మూడు నెలలు పనిచేయకుండానే కె.ఎస్.ఆర్.పి.కి బదిలీ అయ్యారు. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి సీఎల్పీ  నాయకుడు సిద్ధరామయ్య ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం తనకు తెలియదన్నారు.
1988లో ఇదే తరహా ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో రాష్ట్ర 10వ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన జనతా పార్టీ లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. 1983 నుంచి 88 వరకు తిరుగులేని నాయకుడిగా రాష్ట్రాన్ని పాలించి చివరకు ఫోన్ల ట్యాపింగ్ వివాదం వల్ల పదవి నుంచి తప్పుకున్నారు.

Wednesday, August 14, 2019

Chandrayaan-2 Successfully Enters Lunar Transfer Trajectory


చంద్రుని పరిభ్రమణ కక్ష్యలోకి చంద్రయాన్-2 వ్యోమనౌక

చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని పరిభ్రమణ మార్గంలోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి 02.21కి విజయవంతంగా వ్యోమనౌక చంద్రుని కక్ష్య దిశగా ముందుకు సాగుతున్నట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన చంద్రయాన్-2ను జులై 23 న శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. జీఎస్ఎల్వీ ఎం.కె-3 ఎం-1 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్-2 వ్యోమనౌక వివిధ దశలను దిగ్విజయంగా దాటుతూ పురోగమిస్తోంది. బెంగళూరులోని అబ్జర్వేటరీ కేంద్రం నుంచి వ్యోమనౌక స్థితిగతుల్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తున్నారు. తాజాగా వ్యోమనౌక ఇంజిన్ లోని ద్రవ ఇంధనాన్ని 1,203 సెకన్ల పాటు మండించారు. ఆగస్ట్ 20న ప్రస్తుత చంద్రుని కక్ష్యలోకి వ్యోమనౌక చేరుకుంటుంది. మరోసారి ఆ రోజు వ్యోమనౌక ఇంజిన్ లో ద్రవ ఇంధనాన్ని మండించనున్నారు. అక్కడ నుంచి అయిదు దశల ప్రయాణం అనంతరం తుది లక్ష్యంలోకి అడుగుపెడుతుంది. తుది అయిదో దశలో చంద్రగ్రహ ఉపరితలానికి 100 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. సెప్టెంబర్ 7న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోకి వ్యోమనౌక చేరుకుంటుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

Tuesday, August 13, 2019

Jahnavi kapoor prays lord sri venkateswara in tirumala today


శ్రీదేవి జయంతి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న జాహ్నవి
బాలీవుడ్ నటి జాహ్నవి మంగళవారం తిరుమలలో స్వామి వారిని  దర్శించుకున్నారు. తన తల్లి శ్రీదేవి 56వ జయంతి సందర్భంగా ఆమె కాలినడక మార్గంలో శ్రీవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో తల నేలకు తాకించి మోకాలి  ఆరాధన చేశారు. హ్యాపీ బర్త్ డే అమ్మా, ఐ లవ్ యూ అంటూ జాహ్నవి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. తరచు జాహ్నవి స్వామి ఆలయానికి విచ్చేస్తుంటారు. ఈసారి తెలుగు సంప్రదాయ దుస్తుల్లో స్నేహితులతో కలిసి స్వామి సన్నిధికి విచ్చేశారు. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన ప్రతిసారీ విధిగా ఆమె స్వామి వారి సన్నిధికి వస్తుంటారు. ఇంతకుముందూ జాహ్నవి తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ లతో కలిసి తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకుపచ్చ వోణి బంగారు రంగు పరికిణి ధరించిన ఆమె స్వామి సేవలో పాల్గొన్న ఫొటోలు అభిమానుల్ని అలరిస్తున్నాయి. ఈ ఫొటోలకు వేల సంఖ్యలో లైక్ లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా స్టార్ డమ్ సాధించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్లోని బాత్ రూమ్ టబ్ లో ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

Monday, August 12, 2019

Vikram lander will land on moon as tribute to Vikram Sarabhai from crores of Indians:PM Modi


చందమామపై విక్రమ్ ల్యాండర్.. అదే భారత అంతరిక్ష పితామహునికి ఘన నివాళి:ప్రధాని మోది
చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక పార్శ్వమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుండడమే భారత అంతరిక్ష ప్రయోగ పితామహుడు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ కి నిజమైన నివాళి అని ప్రధాని మోది పేర్కొన్నారు. విక్రమ్ సారాభాయ్ శత జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని అహ్మదాబాద్ లో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మోది వీడియో సందేశమిస్తూ ఆయన సేవల్ని స్మరించుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వ్యవస్థాపకుడిగా విక్రమ్ సారాభాయ్ సేవలు చిరస్మరణీయమన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాకుండా భారతీయ సంస్కృతి, సంస్కృత భాషా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారన్నారు. పిల్లల్లో ఆధునిక శాస్త్ర విజ్ఞాన జిజ్ఞాసతో పాటు, భారతీయ సంస్కృతి విలువల్ని పెంపొందించడం, సంస్కృత భాషా అభిలాషను ప్రోత్సహించేందుకు పాటు పడ్డారని ప్రధాని చెప్పారు. డాక్టర్ హోమీ బాబా మరణంతో యావత్ ప్రపంచం శాస్త్రసాంకేత విజ్ఞాన రంగంలో ఎదుర్కొంటున్న లోటును విక్రమ్ సారాభాయ్ తీర్చారన్నారు. అంతరిక్ష ప్రయోగాలతో విశ్వ వ్యాప్తంగా నీరాజనాలందుకుంటున్న ఇస్రోను నెలకొల్పిన విక్రమ్ సారాభాయ్ `భారతమాతకు నిజమైన పుత్రుడు` అని చైర్మన్ డాక్టర్ కె.శివన్ పేర్కొన్నారు. ఆయన ఓ అద్భుతమైన సంస్థకు అంకురార్పణ చేశారని కొనియాడారు. భౌతికశాస్త్రం, ఆధునిక శాస్త్ర విజ్ఞానం, అణుశక్తి రంగాల్లో విక్రమ్ సారాభాయ్ సేవలు నిరుపమానమన్నారు.
విక్రమ్ సారాభాయ్ ఆగస్ట్ 12, 1919లో అహ్మదాబాద్ (ఉమ్మడి మహారాష్ట్ర) లో జన్మించారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1942లో ఆయన ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకళాకారిణి మృణాళిని వివాహం చేసుకున్నారు. ఇస్రోతో పాటు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎంఎ) సంస్థలను నెలకొల్పారు. భారత అణుశక్తి సంస్థ (అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా) కి 1966-1971 వరకు చైర్మన్ గా వ్యవహరించారు. 1966లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు లభించింది. 1971లో తన 52వ ఏట తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ పరమపదించారు. మరణానంతరం 1972లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.