Saturday, August 10, 2019

Tens of thousands join Moscow opposition rally after crackdown


నిష్పాక్షిక ఎన్నికల కోసం రష్యాలో కదం తొక్కిన జనం
నిష్పాక్షికంగా స్వేచ్ఛాయుత రీతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ (ఓపెన్ రష్యా మూవ్ మెంట్) రష్యా రాజధాని మాస్కో లో పెద్ద సంఖ్యలో జనం ఆందోళనకు దిగారు. మాస్కో స్క్వేర్ లో శనివారం సుమారు 40 వేల మంది నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ `పుతిన్ ఇప్పటికీ చెప్పిన అబద్ధాలు చాలించండి..మాకు ఓటు వేసే స్వేచ్ఛ కల్పించండి` అంటూ నినాదాలు చేశారు. దాదాపు 20 ఏళ్లగా అధ్యక్ష, ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న 66 ఏళ్ల పుతిన్ నేరుగా ప్రజల నిరసనల్ని ఎదుర్కోవడం ఇదే ప్రథమం. తాజా ర్యాలీలో 20 వేల మంది వరకు హాజరుకావచ్చని పోలీసులు వేసిన అంచనా తప్పింది. 2012లో దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టడం ఇదే ప్రథమం. జులై 21న కూడా మాస్కో స్క్వేర్ లో పెద్ద ఎత్తున జనం ఆందోళనకు దిగారు.16 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ సందర్భంగా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మాస్కో మేయర్ సెర్గి సొబ్యానిన్ రాజకీయ వివాదాన్ని రాజేస్తున్నారని ఆరోపించారు. మాస్కోలో గల 1 కోటీ 50 లక్షల మందిని  ఆ వివాదంలోకి లాగుతున్నారన్నారు. ప్రజా పక్షం వహిస్తున్న ప్రతిపక్ష అభ్యర్థుల్ని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికారులు అంగీకరించకపోవడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. దాంతో వందల సంఖ్యలో నిరసనకారుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. దేశమే ఒక ఖైదుగా పౌరులు బందీలుగా మారినట్లు ప్రస్తుత పరిణామాలు పరిణమించాయని ఓపెన్ రష్యా ఉద్యమ కర్త డిమిత్రి ఖోబోటోవ్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 2 వేల మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు చర్యల్ని ఖండిస్తూ తాజాగా ఈరోజు మళ్లీ ప్రజలు ఆందోళనకు దిగారు. సెప్టెంబర్ లో సిటీ ఆఫ్ పార్లమెంట్స్ (స్థానిక సంస్థలు) కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పుతిన్ వ్యతిరేకులైన పలువురు ప్రతిపక్ష నాయకుల్ని పోటీ చేయడానికి వీలులేకుండా జైళ్లకు తరలించారు. ఆందోళనకు దిగి చట్టాల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ప్రతిపక్ష నాయకుడు డిమిత్రి గుడ్ కోవ్ కు 30 రోజుల కారాగారం విధించారు. ఆయన భార్య వలెరియా గుడ్ కోవ్ శనివారం నిర్వహించిన మాస్కో ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రతి పౌరులకు అధికారంలో భాగస్వామ్యం వహించే హక్కు ఉందని కానీ అందుకు పాలకులు భీతిల్లుతున్నారని వ్యాఖ్యానించారు.

Friday, August 9, 2019

Hong Kong protesters kick off three-day airport rally


హాంకాంగ్ లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య ఉద్యమం
చైనా ఏలుబడిలోకి వచ్చిన హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమం మహోజ్వల రూపం దాల్చింది. శుక్రవారం చెక్ లాప్ కాక్ విమానాశ్రయంలోకి వేల సంఖ్యలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు చొచ్చుకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే రహదారులన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. దేశంలో (చైనా ఆధీనంలో ఉన్న తమ ప్రాంతం-టెరిటరీ) ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని కోరుతూ గత ఏప్రిల్ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మూడ్రోజులు విమానాశ్రయాల ముట్టడికి ఆందోళనకారులు పిలుపునిచ్చారు. తమ ఉద్యమకాంక్షను వెలిబుచ్చడం ద్వారా అంతర్జాతీయంగా మద్దతు సాధించేందుకు విమానాశ్రయాల ముట్టడికి శ్రీకారం చుట్టారు. నిరసనకారులు ముఖ్యంగా యువత ఉద్యమాన్ని ముందుకు నడుపుతోంది. నల్లని దుస్తులు ధరించిన ఆందోళనకారులు ప్లకార్డులు, బేనర్లు చేతపట్టుకుని రహదారుల మీదుగా నినాదాలు చేసుకుంటూ చెక్ లాప్ కాక్ విమానాశ్రయంలోకి చొచ్చుకువచ్చారు. ఏప్రిల్ లో తొలిసారి ఈ విమానాశ్రయాన్ని ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఇదేవిధంగా ముట్టడించారు. సామాజిక మాధ్యమాల్ని వినియోగించుకుంటూ ఉద్యమకారులు వందలు, వేల సంఖ్యలో విమానాశ్రయం ముట్టడి దిశగా ముందుకు కదిలారు. హాంకాంగ్ 1997లో బ్రిటన్ నుంచి చైనా ఏలుబడిలో వచ్చిన సంగతి తెలిసిందే. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉద్యమాన్ని శాంతింపజేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. నిరసనకారులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం దిగరావడం ఉండదని తేల్చి చెప్పారు. రాజకీయ సంప్రదింపుల ద్వారానే సమస్య పరిష్కారమౌతుందన్నారు. వాస్తవానికి ఏప్రిల్ లో ప్రతిపక్షాల ద్వారా ఈ ప్రజాస్వామ్య ఉద్యమం సెగ రేగింది. అనంతరం విద్యార్థులు, యువత చెంతకు చేరిన ఉద్యమం ప్రస్తుతం ఊపందుకుంది. 428 చదరపు మైళ్ల విస్తీర్ణం కల్గిన హాంకాంగ్ జనాభా సుమారు 74 లక్షలు. ద్రవ్య వినిమయంలో హాంకాంగ్ డాలర్ ప్రపంచంలోనే 13 స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ ప్రజల భాష కంటోనీస్ కాగా ప్రస్తుతం అధికార భాషలుగా మాండరీన్ (చైనీస్), ఇంగ్లిష్ చలామణి అవుతున్నాయి. బ్రిటన్ హయాంలో హాంకాంగ్ వలస ప్రాంతానికి `సిటీ ఆఫ్ విక్టోరియా` నగరం రాజధానిగా ఉండేది. ప్రసుత్తం హాంకాంగ్ టెరిటరీ రాజధాని బీజింగ్. తమర్ లో గల చట్ట సభ (లెజిస్లేటివ్ కౌన్సిల్) లో ప్రతినిధులు సమావేశమవుతుంటారు. బిల్లుల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు రూపొందిస్తారు. ప్రాంతీయంగా చట్టాలు చేసే అధికారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే ఉంటుంది. హాంకాంగ్ లో 2016లో జరిగిన ఎన్నికల్లో 22 పార్టీలకు చెందిన సభ్యులు లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. బీజింగ్ అనుకూల పార్టీల కూటమి, ప్రజాస్వామ్య ఉద్యమ పార్టీల కూటమి, స్థానిక ప్రయోజనాల పరిరక్షణ పార్టీల కూటమిగా ఈ 22 పార్టీల నుంచి మూడు గ్రూపులు ఏర్పడ్డాయి.

Thursday, August 8, 2019

Narendra Modi speech: Article 370 was a hurdle for development of Jammu & Kashmir, says PM


జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రజలు ప్రపంచానికి తమ సత్తా చాటాలి:ప్రధాని

జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రజలు తమ శక్తిసామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జమ్ముకశ్మీర్ లో అధికరణం 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆ రాష్ట్రాన్ని విడగొట్టిన అనంతరం తొలిసారి ప్రధాని మోదీ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగాన్ని టీవీలు గురువారం ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అయితే జె&కె ను నిరంతరం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచబోమన్నారు. పరిస్థితులు చక్కబడిన అనంతరం తిరిగి రాష్ట్ర హోదాను కట్టబెడతామని చెప్పారు. భద్రతా బలగాలు జె&కె లో శాంతిభద్రతల పరిరక్షణకు ఇతోధిక సేవలు అందిస్తున్నారని ప్రధాని కొనియాడారు. దేశ రక్షణలో అమరులైన వారి త్యాగాలను తమ సర్కారు సదా స్మరించుకుంటోందన్నారు. జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రాంతాల ప్రత్యేకతల్ని, ప్రజల ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 త్వరలో అసెంబ్లీ ఎన్నికలు

జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగిన సంగతిని ఆయన ప్రస్తావించారు. ఎన్నికైన సర్పంచ్‌లు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా మహిళా సర్పంచ్‌లు బాగా పనిచేస్తున్నారని చెప్పారు. అదే క్రమంలో రానున్న రోజుల్లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాలని కోరారు. తద్వారా సమర్థులైన  ముఖ్యమంత్రి అధికారాన్ని చేపడతారని చెప్పారు. క్రితంసారి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దాంతో పీడీపీకి బీజేపీ మద్దతిచ్చింది. మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు రావడంతో బీజేపీ తమ మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రం మళ్లీ గవర్నర్ పాలన లోకి వెళ్లింది. ఆర్నెల్ల తర్వాతా అక్కడ పరిస్థితి చక్కబడకపోవడంతో గవర్నర్ పాలన కొనసాగుతోంది. 

Wednesday, August 7, 2019

Prez, PM, Sonia among hundreds who pay homage to Swaraj at her residence


సుష్మా స్వరాజ్ కు నేతల కన్నీటి వీడ్కోలు
భారత మాజీ విదేశాంగశాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సుష్మాస్వరాజ్ (67)కు దేశ విదేశాలకు చెందిన నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం రాత్రి ఆమె ఆకస్మికంగా (కార్డియక్ అరెస్ట్-గుండె ఆగిపోవడం) మరణించారు. అంతకు కొద్ది సేపు క్రితం కూడా జమ్ముకశ్మీర్ దేశంలో పరిపూర్ణంగా విలీనమైనందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా దేశ ప్రధాని, హోంమంత్రులు మోదీషాల్ని అభినందిస్తూ చిరకాల స్వప్నాన్ని ఈరోజు నిజం చేశారంటూ ప్రశంసించారు. సమాచారం అందగానే పార్టీలకతీతంగా నేతలు బుధవారం ఢిల్లీలోని సుష్మాస్వరాజ్ నివాసానికి చేరుకుని ఆమె పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. సుష్మా మరణవార్త విని ఆమె గురువు బీజేపీ అగ్రనేత అద్వానీ తల్లడిల్లిపోయారు. కంటతడి పెడుతూ ఆమెతో సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. సుష్మా తన ప్రతిపుట్టిన రోజుకు వచ్చి ఇష్టమైన చాక్లెట్ కేక్ ఇచ్చి వెళ్లేవారంటూ అద్వానీ గుర్తు చేస్తుకున్నారు. తమ పార్టీలోకి యువకెరటంలా వచ్చిన సుష్మా అనంతర కాలంలో అత్యున్నతమైన నేతగా ఎదిగారన్నారు. ఉగాండా అధ్యక్షులు మరియా ఫెర్నాండ ఎస్పినోస నివాళులర్పించారు. సుష్మా జీవిత కాలం ప్రజాసేవకు అంకితమైన ఓ గొప్ప నేతగా సంతాప సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి, హోంమంత్రి అమిత్ షా, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు గులాంనబీ అజాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం నాయకులు బృందా కారత్, బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎస్పీ సీనియర్ నాయకుడు ములాయం సింగ్ తదితరులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు, అభిమానుల కడసారి నివాళుల కోసం సుష్మా పార్థివ దేహాన్ని ఆమె ఇంటి నుంచి తరలించి కొద్దిసేపు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. అనంతరం లోదీ రోడ్ లోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియల్ని నేతలు, అభిమానులు అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.