Thursday, August 1, 2019

Make it mandatory for mps to visit child welfare centers demands supriya sule


లైంగిక అకృత్యాల నుంచి బాలల సంరక్షణ బిల్లుకు లోక్ సభలో ఏకగ్రీవంగా మద్దతు
లోకసభలో గురువారం పార్టీలకు అతీతంగా సభ్యులు లైంగిక అకృత్యాల నుంచి బాలల సంరక్షణ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి మరణశిక్ష పడుతుంది. ఈ బిల్లు పట్ల అన్ని పక్షాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్.సి.పి) సభ్యురాలు సుప్రియ సూలే(శరద్ పవార్ తనయ) ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఎంపీ బాలల సంరక్షణ కేంద్రాల్ని విధిగా సందర్శించాలనే నిబంధన విధించాలని డిమాండ్ చేశారు. పిల్లలపై ఈ లైంగిక వేధింపుల నిరోధక ముసాయిదా బిల్లుకు ఆమె మద్దతు తెల్పుతూ ఈవ్ టీజింగ్ (ఆకతాయిల ఆగడాలు)ను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలో దాదాపు అన్ని బాలల సంరక్షణ కేంద్రాలు అకృత్యాలకు అడ్డాలుగా మారిపోయాయని, పిల్లలు నిరంతరం అక్కడ మోసాలకు గురౌతున్నారని సభ దృష్టికి తెచ్చారు. అందుకే ఉభయ సభలకు చెందిన సభ్యులు ప్రతి ఒక్కరూ విధిగా ఆ కేంద్రాల్లో తనిఖీలకు వెళ్లేలా నిబంధన విధించాలన్నారు. అప్పుడే ఆ కేంద్రాల నిర్వాహకుల్లో అప్రమత్తత వస్తుందని బాలలకు భరోసా లభిస్తుందని చెప్పారు. ఎంపీల ఆకస్మిక తనిఖీలతో బాలల సంరక్షణ కేంద్రాలు సజావుగా నడుస్తాయని సుప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) సభ్యులు కున్వర్ దానిష్ అలీ బిల్లుకు మద్దతు ఇస్తూ తను ఉరిశిక్షకు వ్యతిరేకమైనా పిల్లలపై అకృత్యాలకు పాల్పడిన వారి విషయంలో బిల్లు నిర్దేశిస్తున్న ప్రకారం విధించే శిక్ష సరైనదిగానే భావిస్తున్నానన్నారు.

Wednesday, July 31, 2019

PM Khan orders roll back of roti, naan prices across Pakistan


పాకిస్థాన్ లో నాన్, రోటీల ధరలు తగ్గించాలని ఇమ్రాన్ ఆదేశం
పాకిస్థాన్ లో గ్యాస్, గోధుమ పిండిలపై సుంకాలు తగ్గించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గం సమన్వయ సమావేశంలో పాల్గొన్న ప్రధాని బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నాన్, రోటీ ధరల్ని వెంటనే తగ్గించాలని ఆదేశాలిచ్చారు. మునుపటి మాదిరిగా పేదలతో పాటు అందరికీ అందుబాటులో ఉండేలా నాన్, రోటీ ధరలు తగ్గించాలన్నారు. గతంలో పాకిస్థాన్ లో నాన్ ధర రూ.8-10 ఉండగా రోటీ రూ.7-8 కు లభించేది. అయితే గ్యాస్, గోధుమ పిండిలపై పన్నులు పెంచడం వల్ల నాన్, రోటీ ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం నాన్ ధర రూ.12-15, రోటీ ధర రూ. 10-12కు పెరిగిపోయింది. తక్షణం ఇదివరకటి ధరలకు నాన్, రోటీల ధరలు తగ్గాలని ఇమ్రాన్ హుకుం జారీ చేశారు.

Tuesday, July 30, 2019

Triple talaq bill passed by Parliament


ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర
దేశంలో వివాహిత ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ బిల్లు ఆమోదాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభ లోనూ గట్టెక్కింది. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. ఎస్.పి, బీఎస్పీలు సభకు హాజరుకాలేదు. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. సభ నుంచి వాకౌట్ చేసింది. కూటమి మిత్ర పక్షం జేడీయూ కూడా వాకౌట్ చేయడం గమనార్హం. వై.ఎస్.ఆర్.సి.పి, టి.ఆర్.ఎస్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనలేదు. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఎంపీలు ఓటేయగా 84 మంది వ్యతిరేకిస్తూ ఓటేశారు. దాంతో రాజ్యసభ లోనూ బిల్లు ఆమోదం పొందగల్గింది. ఎగువ సభలో మోదీ ప్రభుత్వానికి వాస్తవంగా 107 మంది ఎంపీల బలముంది. బిల్లు ఆమోదానికి 121 ఓట్లు అవసరం. ఎస్.పి, బీఎస్పీ సభ్యులు సభకు హాజరుకాకపోవడం, టి.ఆర్.ఎస్, వై.ఎస్.ఆర్.సి.పి. సభ్యులు ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో ట్రిపుల్ తలాఖ్ బిల్లు కు రాజ్యసభ లో కూడా ఆమోద ముద్ర పడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం పొందాక.. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి అమలులో ఉన్న ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు చట్టరూపాన్ని దాల్చి అమలులోకి రానుంది.

Monday, July 29, 2019

Financier 'kidnapped and freed' after paying Rs 1 crore in hyderabad


రూ.కోటి తీసుకొని ఫైనాన్షియర్ని విడిచిపెట్టిన కిడ్నాపర్లు

హైదరాబాద్ లో కిడ్నాపర్ల ముఠా రూ.కోటి వసూలు చేసి ఓ ఫైనాన్షియర్ ను సోమవారం విడుదల చేసింది. ఆదివారం రాత్రి దోమలగూడ లో గజేంద్ర ప్రసాద్ అనే ఫైనాన్షియర్ ను ఓ ముఠా కిడ్నాప్ చేసింది. అతని కుటుంబ సభ్యుల్ని రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. ఆ సొమ్ము ఇస్తేనే గజేంద్రను విడిచిపెడతామని హెచ్చరించారు. చివరకు కుటుంబ సభ్యులు రూ.కోటి చెల్లించడంతో ముఠా అతణ్ని అబిడ్స్ లో వదిలి పరారయింది. ఈ మేరకు గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గజేంద్ర తనకు ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో లావాదేవీల్లో వివాదమున్నట్లు తెలిపారు. గత రాత్రి తనను అపహరించిన కిడ్నాపర్లు తర్వాత నిర్భందించి దాడి చేశారన్నారు. గజేంద్ర ఒంటిపై గాయాలు కనిపిస్తున్నాయి. మొహం కూడా కమిలిపోయింది. కిడ్నాపర్లు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తుండగా రూ.5 లేదా 10 లక్షలు ఇస్తానని చెప్పగా తనను వాళ్లు తీవ్రంగా కొట్టారన్నారు. చివరకు రూ.50 లక్షలు తీసుకుని వదిలివేయాలని కోరినా కనికరించలేదని చెప్పారు. తప్పక రూ.కోటి ఇస్తానని చెప్పడంతో అంగీకరించి తనను విడుదల చేశారని గజేంద్ర పోలీసులకు వివరించారు. తన స్నేహితుడు ఆ మొత్తాన్ని కారులో తీసుకొని వచ్చి సమీపంలోని ఓ స్కూల్ వద్ద పార్క్ చేశారన్నారు. అనంతరం ఆ డబ్బును ముఠాలోని ఇద్దరు సభ్యులు వెళ్లి తీసుకుని వచ్చారన్నారు. ఆ తర్వాతే నిర్బంధ ప్రాంతం నుంచి తనను కిడ్నాపర్లు అబిడ్స్ కు తరలించి పరారయినట్లు తెలిపారు.