Saturday, July 27, 2019

All 1,050 passengers of stranded Mahalaxmi Express rescued:Railways


ఈ నీళ్ల పైన రైలుంది
·       ముంబయిలో పోటెత్తిన వరదలు
·       మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ నుంచి 1050 మంది ప్రయాణికుల తరలింపు
కుంభవృష్టి తాజాగా మహారాష్ట్రలోని ముంబయి, థానేల్ని అతలాకుతలం చేసింది. ఉల్హాస్ నది పోటెత్తడంతో సెంట్రల్ రైల్వే జోన్ లోని రైల్వే ట్రాక్ లు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం రాత్రి ముంబయి నుంచి కోల్హాపూర్ బయలుదేరిన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వరదల తాకిడికి ముంపునకు గురై నిలిచిపోయింది. బద్లా పూర్, వంగణి రైల్వే స్టేషన్ల మధ్యమార్గంలో రైలు వరద పోటెత్తి ప్రవహించడంతో జలదిగ్బంధనానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న 1050 మంది రైల్లోనే చిక్కుబడిపోయారు. వారందర్ని శనివారం మధ్యాహ్నం సహాయ రక్షణ బృందాలు సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చాయి. మొత్తం ప్రయాణికులందర్ని వారు చేరుకోవాల్సిన గమ్య స్థానం కోల్హాపూర్ కు వేరే మార్గంలో మరో రైలులో తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి కుండపోత వర్షానికి వరద పోటెత్తడంతో మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తున్న రైల్వే ట్రాక్ ముంపునకు గురైంది. గంటల కొద్దీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణికులు కాలం గడిపారు. శనివారం ఉదయానికే సహాయ రక్షణ బృందాలు రైలు జలదిగ్బంధానికి గురైన ప్రాంతానికి చేరుకున్నాయి. భారత నేవీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ వీరికి సహకరించారు. సహాయ రక్షణ చర్యలు చేపట్టిన సెంట్రల్ రైల్వే సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్), జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్)  ప్రయాణికులందరి ప్రాణాలు కాపాడాయి. లైఫ్ జాకెట్లు, బోట్ల తో భారత నేవీ బృందం కూడా వరదల్లో దిగ్బంధనానికి గురైన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వద్దకు చేరుకుని ప్రయాణికుల్ని సురక్షితంగా తీరానికి చేర్చడానికి సహకరించింది. వెలుపలికి తీసుకువచ్చిన ప్రయాణికుల్ని తొలుత బద్లాపూర్ లోని కన్వెన్షన్ హాల్ కు తరలించారు. వైద్య సహాయం అవసరమైన ప్రయాణికుల్లో కొందర్ని అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ రైల్వే సిబ్బంది ప్రయాణికులంతా తేరుకున్నాక వారి గమ్య స్థానం కోల్హాపూర్ కు వేరే మార్గంలో ప్రత్యేక రైలులో తరలించే ఏర్పాట్లు పూర్తి చేసింది.


Friday, July 26, 2019

Rahul priyanka pay tribute to kargil war heroes


కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన రాహుల్ ప్రియాంక
20వ విజయ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. కార్గిల్ లో పాకిస్థాన్ చొరబాటుదారులపై భారత్ సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై26న విజయ దివస్ ను ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలోఅసువులు బాసిన వీర జవాన్లకు రాహుల్, ప్రియాంక శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు ఆ వీర జవాన్లని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం దేశాన్ని రక్షించడానికి ప్రాణాలు పణంగా పెట్టిన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అదే విధంగా దేశ రక్షణలో నిరంతరం ప్రాణాలొడ్డి పోరాడుతున్న మహిళా, పురుష జవాన్లకు వందనాలంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
చొరబాటుదారుల పీచమణచిన భారత సైన్యం
సైన్యం నాటి విజయ క్షణాల్ని స్మరించుకుంటూ నూతనోత్తేజంతో సవాళ్లను ఎదుర్కొనేందుకు `విజయ్ దివస్` ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. 1999 జులై 26 న కార్గిల్ లో చిట్టచివరి చోరబాటుదారుణ్ని మట్టుబెట్టాక భారత సైన్యం విజయగర్వంతో జాతీయ పతాకను కార్గిల్ లో ఎగురవేసింది. మే 3న పాక్ ముష్కరుల చొరబాటును గుర్తించిన దగ్గర నుంచి జులై 26 వరకు `ఆపరేషన్ విజయ్` చేపట్టిన భారత్ సైన్యం (వైమానిక దళం ప్రధాన భూమిక పోషించింది) ఎడతెగని పోరాటం చేసి కార్గిల్ భూభాగాన్ని కాపాడింది. `టోలింగ్` శిఖరాన్ని రాజ్ పుతానా రైఫిల్స్-2 స్వాధీనం చేసుకోగా, జమ్ముకశ్మీర్ రైఫిల్స్-13 `పాయింట్ 4875(బాత్రా టాప్)`ను భారత్ వశం చేసింది. `ఖలుబార్` శిఖరాన్ని 1/9  గూర్ఖా రైఫిల్స్ స్వాధీనం చేసుకుని జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. అదేవిధంగా టైగర్ హిల్, జుబర్, కుకర్ థాంగ్ శిఖరాలపై ఐఏఎఫ్ యుద్ధ విమానాలు మిగ్-21 మిగ్-27 మిరాజ్- 2000లు లేజర్ గైడెడ్ బాంబుల్ని ప్రయోగించి పాక్ చొరబాటుదారుల బంకర్లను భస్మీపటలం చేశాయి.

Thursday, July 25, 2019

Nalini released from vellore prison on parole


వెల్లూర్ జైలు నుంచి పెరోల్ పై విడుదలైన నళిని
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏడుగురిలో ఒకరైన నళిని గురువారం వెల్లూర్ జైలు నుంచి పెరోల్ పై విడుదలయింది. కూతురు పెళ్లి ఏర్పాట్లు నిర్వహించుకునేందుకు ఆమెకు నెలరోజుల పెరోల్ లభించింది. ఈ మేరకు నళిని జులై5న అభ్యర్థించింది. మన్నించిన మద్రాస్ హైకోర్టు 30 రోజుల సాధారణ సెలవు మంజూరు చేసింది. నళినిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలు నుంచి ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. వెల్లూర్ సాతువాచారి గ్రామం నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో రంగాపురం తరలించారు. నళిని కూతురు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుల్ని కలవరాదు..మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదనే షరతుపై నళినికి పెరోల్ మంజూరయింది. అయితే ఆమె తన కూతురు పెళ్లి ఏర్పాట్లకుగాను ఆరు నెలలపాటు పెరోల్ కోరింది. ప్రభుత్వం కేవలం నెల రోజులు మాత్రమే సాధారణ సెలవులు ఇవ్వగలమని తేల్చి చెప్పింది. 30 రోజుల సమయం పెళ్లి ఏర్పాట్లు చేయడానికి ఏమాత్రం సరిపోదని నళిని వాదించినా ఫలితం లేకపోయింది. నళిని, మురగన్ (జీవిత ఖైదీ) లు జీవితఖైదు అనుభవిస్తుండగా వెల్లూర్ జైలులోనే కూతురు జన్మించింది. 28 ఏళ్లగా తామిద్దరం జైలులోనే గడుపుతున్నామని తల్లిదండ్రులుగా తమ కూతురు ఆలానాపాలనకు కూడా నోచుకోలేకపోయామని నళిని ఆవేదన వ్యక్తం చేసింది.

Wednesday, July 24, 2019

BJP MLA demands resignation of Karnataka legislative assembly speaker following fall of coalition government


కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్
మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కర్ణాటక విధానసభ స్పీకర్ కె.రమేశ్ కుమార్ (కాంగ్రెస్) రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రేణుకాచార్య బుధవారం డిమాండ్ చేశారు. కుమారస్వామి ప్రభుత్వ పతనంతో రాష్ట్ర ప్రజల అభీష్టం నెరవేరిందని వారి ఆకాంక్షల ప్రకారం బీజేపీ పాలన కొనసాగుతుందని రేణుకాచార్య పేర్కొన్నారు.  కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం విశ్వాస తీర్మానం వీగి పోవడంతో 14 నెలల కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. 
కుమారస్వామికి రెండో సారి ముఖ్యమంత్రి పదవి అర్ధాంతరంగా పోయింది. తొలుత 2006 ఫిబ్రవరి 3 నుంచి 2007 అక్టోబర్ 9 వరకు సీఎంగా ఆయన బీజేపీ తో కూడిన జేడీ(ఎస్) సంకీర్ణ సర్కార్ కు సారథ్యం వహించారు. బీజేపీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. మళ్లీ దశాబ్దం తర్వాత రెండోసారి 2018లో ఊహించని వరంలా కాంగ్రెస్ తో జట్టుకట్టి బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. 23 మే 2018 నుంచి ఆయన 23 జులై 2019 వరకు సీఎంగా పదవిలో ఉన్నారు. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జనతాదళ్(ఎస్) ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి శాసనసభ్యత్వాలకు రాజీనామా సమర్పించడంతో రగడ మొదలైంది. తాజాగా శాసనసభలో బలం నిరూపించుకోలేక ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కుమారస్వామి తండ్రి మాజీ ప్రధాని దేెవెగౌడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వల్పకాలమే పనిచేశారు. కేంద్రంలో నాడు సంకీర్ణ కూటమికి ప్రధానిగా ఆయన నేతృత్వం వహించాల్సి రావడంతో కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేశారు. 1994 డిసెంబర్ నుంచి 1996 మే వరకు ఆయన రాష్ట్ర సారథ్య బాధ్యతలు వహించారు.