Sunday, July 21, 2019

UP CM Adityanath meets affected families in Sonbhadra


సోన్ భద్ర లో వరాల జల్లు కురిపించిన యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్ (యూపీ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోన్ భద్ర జిల్లాలో ఆదివారం పర్యటించారు. ఇటీవల ఈ జిల్లాలోని ఉంభా గ్రామంలో రెండు వర్గాల భూతగాదాల్లో కాల్పులు చోటు చేసుకోవడంతో 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ మృతుల కుటుంబాలను సీఎం యోగి పరామర్శించారు. ఒక్కో మృతుని కుటుంబానికి ఆయన రూ.18 లక్షలు పరిహారంగా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2.5 లక్షల సహాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కాల్పులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని సీఎం చెప్పారు. ఈ ఘటనకు రాష్ట్రంలోని సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ బాధిత కుటుంబాల్లోని వృద్ధులకు పింఛను అందిస్తామని చెప్పారు. ఉంభా గ్రామంలో అంగన్ వాడి కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. వసతి గృహంతో కూడిన పాఠశాలను నిర్మిస్తామని, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్లను కూడా నెలకొల్పనున్నామని సీఎం యోగి ప్రకటించారు. దశాబ్దాలకు తరబడి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు, వారి భూముల జోలికి ఇకపై ఎవరూ రాకుండా చూసుకుంటామని సీఎం ఉంభా గ్రామస్థులకి అభయం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఉంభా చేరుకున్న ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర డీజీపీ, సీఎస్ ఉన్నారు. 
ప్రియాంక ప్రభావంతోనే..సీఎం ఆఘమేఘాల పర్యటన
ఈనెల 17న ఈ ఘోర కలి జరగ్గా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ రెండ్రోజుల వ్యవధిలోనే యూపీ చేరుకున్నారు. సోన్ భద్రకు ఆమె పయనం కాగానే అడ్డుకుని యోగి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ప్రియాంకను చునూర్ ప్రభుత్వ అతిథి గృహానికి తరలించి విద్యుత్, నీళ్లు లేకుండా వేధించింది. అయినా ఆమె బాధితుల్ని పరామర్శించేవరకు ఢిల్లీ వెనుదిరిగేది లేదని అక్కడే భీష్మించారు. దాంతో తప్పనిసరై కేవలం ఇద్దరు బాధితుల్ని మాత్రమే ప్రియాంక ఉన్న అతిథి గృహానికి అనుమతించింది. అక్కడే ఆమె బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెబుతూ మళ్లీ ఇంకోసారి తప్పక సోన్ భద్రకు వస్తానని హామీ ఇచ్చి ఢిల్లీ తిరుగుప్రయాణమయ్యారు.. ప్రియాంక పర్యటన ప్రభావం వల్లే సీఎం యోగి రాజకీయ కోణంలో  ఆఘమేఘాల మీద బాధితుల పరామర్శకు బయలుదేరారని పరిశీలకులు భావిస్తున్నారు.


Saturday, July 20, 2019

Sindhu reaches first final of year beating chen yufei in semis


ఇండోనేసియా ఓపెన్ ఫైనల్స్ చేరిన స్టార్ షట్లర్ సింధు
భారత స్టార్ షట్లర్ సింధు ఇండోనేసియా ఓపెన్ ఫైనల్ కు చేరింది. ఫైనల్ లో ఆదివారం ఆమె చిరకాల ప్రత్యర్థి జపాన్ షట్లర్ ఫోర్త్ సీడ్ అకానె యమగూచితో తలపడనుంది.  సింధు ఈ ఏడాది ఫైనల్స్ కు చేరడం ఇదే ప్రథమం. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్ లో ఆమె సెకండ్ సీడ్ చైనా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి చెన్ యు ఫై 21-19 21-10 గేమ్ ల తేడాతో ఓడించింది. సింధు తనదైన శైలిలో శక్తివంతమైన స్మాష్ లు, నెట్ దగ్గర అమోఘమైన డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. సింధు చురుకైన ఆటతీరుకు చెన్ యు వద్ద సమాధానమే లేకపోయింది. అయితే తొలిగేమ్ మొదట్లో చెన్ దూకుడు కనబరచగా సింధు నెమ్మదిగా ఆట కొనసాగించింది. చెన్ 18-14 తో ముందంజలో ఉండగా సింధు పుంజుకుని వరుసగా నాల్గు పాయింట్లు సాధించి 18-18 తో సమఉజ్జీగా నిలిచింది. ఈ గేమ్ ను ప్రత్యర్థి చెన్ గెలుచుకోకుండా చాలా సేపు సింధు నిలువరించగల్గింది. గేమ్ పాయింట్ వద్ద నుంచి సింధు ఆటపై పట్టుకోల్పోకుండా కొనసాగించింది. ఆ తర్వాత సింధు ఆటలో వేగం పెంచి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. స్మాష్ లు, డ్రాప్ షాట్లతో పాయింట్లను గెలుచుకుంది. తొలి గేమ్ ను 21-19తో సొంతం చేసుకుంది. నివ్వెరపాటు నుంచి తేరుకున్న చెన్ తొలిగేమ్ లో మాదిరిగానే రెండో గేమ్ లోనూ తనదైన రీతిలో చెలరేగి వరుసగా 4 పాయింట్లను సాధించి 4-0 తో సింధుపై ఆధిపత్యాన్ని కనబర్చింది. ఆటపై ఏకాగ్రత కోల్పోకుండా పట్టుదలగా ఆడిన సింధు డిఫెన్సివ్ ప్లేతో చెన్ ఆట లయను దెబ్బతీసింది. సింధు ఎత్తుగడ ఫలించి చెన్ చాలా అనవసరమైన తప్పిదాలు చేసింది. ప్రత్యర్థికి అవకాశమే లేకుండా ఆటపై పట్టు కనబరస్తూ సింధు 21-10 తేడాతో గేమ్ ను మ్యాచ్ ని గెలుచుకుని ఫైనల్ లో అడుగుపెట్టింది.  


Friday, July 19, 2019

Tiger Found Resting On A Bed In A Shop In Assam


పాపం ఆ పులి అలసిపోయి.. ఓ ఇంట్లో మంచమెక్కి నిద్రపోయింది
పులి జనారణ్యంలోకి వచ్చేసింది. ఎంతగా అలసిపోయిందో ఏమో ఓ ఇంట్లోకి దూరి మంచమెక్కి మరీ అదమరచి హాయిగా నిద్రలోకి జారిపోయింది. ఈ ఘటన గురువారం ఉదయం 7.30 సమయంలో అసోం లోని నాగోన్ జిల్లా బగొరీలో జరిగింది. అసోం తో పాటు ఈశాన్య భారతంలో ఇటీవల ఎడతెగని వర్షాలకు వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక్కడకు సమీపంలో 2 కిలో మీటర్ల దూరంలోనే కజిరంగ జాతీయ అభయారణ్యం ఉంది. వర్షాలతో పోటెత్తిన వరదలకు వన్య ప్రాణులన్నీ చెల్లాచెదురైపోయాయి. వీటిలో చాలా జంతువులు చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. అలా వరదల్లో చిక్కుకుని ప్రాణాలు దక్కించుకున్న రాయల్ బెంగాల్ టైగ్రస్(ఆడ పులి) అనుకోని అతిథిలా ఇలా ఓ ఇంట్లోకి వచ్చి సేద తీరింది. రాయల్ బెంగాల్ పులులు ఈతలో నేర్పరులన్న సంగతి తెలిసిందే. ఇవి కిలోమీటర్ల కొద్దీ అలసిపోకుండా చాకచక్యంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతుంటాయి. ప్రపంచంలో అతి పెద్దవైన సుందర్బన్ (మాంగ్రూవ్స్) మడ అడవుల్లో ఇవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అటు పశ్చిమబెంగాల్, ఇటు బంగ్లాదేశ్ లో విస్తరించిన సుందర్ బన్ మడ అడవుల్లో  ఎక్కువగా గల రాయల్ బెంగాల్ పులులు రాత్రి వేళల్లో ఆహారం కోసం నదుల గుండా ఈదుతూ వేట కొనసాగిస్తుంటాయి. కానీ అసోం లోని బగోరిలో గల మోతీలాల్ ఇంటికి ఆహ్వానం లేని అతిథిలా జొరబడి అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. మోతీలాల్ ఇల్లు, షాప్ పక్కపక్కనే ఉంటాయి. ఆ ప్రాంగణంలోకి ఉదయాన్నే పులి దర్జాగా నడుచుకు వస్తుంటే చుట్టుపక్కల జనం కేకలు వేశారు. అప్పటికి పులి..మోతీలాల్ కు కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. బిక్కచచ్చిపోయిన మోతీలాల్ ను ఆ పులి ఏమీ చేయకుండా నేరుగా ఇంట్లోకి దూరి ఓ గదిలో గల మంచంపైకెక్కి నిద్రపోయింది. దాదాపు 10 గంటలు మోతీలాల్ ఇంట్లోనే పులి తనవితీరా సేద తీరింది. మోతీలాల్ కుటుంబ సభ్యుల్ని భద్రంగా ఆ ఇంటి నుంచి వేరో ఇంటికి తరలించారు. అప్పటి వరకు ఆ పులికి నిద్రా భంగం కల్గించకుండా వన్యప్రాణి సంరక్షణ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ ను సైతం క్రమబద్ధీకరించారు. అదే విధంగా జనానికి ఎటువంటి హాని జరగకుండా చర్యలు చేపట్టారు. సాయంత్రం 4.30 సమయంలో నిద్ర లేచిన పులి హైవే గుండా సురక్షితంగా అడవిలోకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నామని వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యు.టి.ఐ) అధికారి రతిన్ బ్రహ్మన్ తెలిపారు.

Thursday, July 18, 2019

Imran Khan plans rally like modi`s style infront of president trumph in US tour


మోదీ ర్యాలీ తరహాలో ట్రంప్ ను ఆకట్టుకోవాలనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్

అగ్ర రాజ్యం అమెరికాను ప్రసన్నం చేసుకునే క్రమంలో పాకిస్థాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి పాక్ తో అమెరికా సంబంధాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ట్రంప్ హయాంలోనూ ఇరు దేశాల మధ్య  సంబంధాలు మెరుగుపడలేదు. ఉగ్రవాద మూలాల పాకిస్థాన్ లో అంతకంతకూ వేళ్లూనుకున్న నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా దూరం పెట్టింది. దాంతో ముంబయి   బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయిీద్ (జె.యు.డి. చీఫ్)ను అరెస్ట్ చేసిన పాకిస్థాన్ తమ సరిహద్దుల గగన తలంలో భారత్ విమానాల రాకపోకలకు ఆంక్షల్ని తొలగిస్తూ భారత్ తో పాటు అమెరికాను ఏకకాలంలో ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది. అమెరికా, పాక్ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఇమ్రాన్ నడుం బిగించారు. అందులో భాగంగానే నెల 22న ఆయన  అమెరికాలో పర్యటించనున్నారు. వైట్ హౌస్ లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. తన అమెరికా పర్యటన సందర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం ద్వారా ట్రంప్ దృష్టిలో పడాలని ఇమ్రాన్ ఉబలాటపడుతున్నారు. మోదీ ర్యాలీ తరహాలో ఈ ర్యాలీ ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ నాయకుల ర్యాలీలు అమెరికాలో గతంలో అనేకసార్లు నిర్వహించారు. కానీ పాక్ నాయకుడి ర్యాలీ ఏర్పాటు కాబోవడం ఇదే ప్రథమం. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ రాజధాని వాషింగ్టన్ డీసీలోని చైనాటౌన్ లో నిర్వహించతలపెట్టిన ఈ ర్యాలీ సందర్భంగా ఆయన అనుకూల వ్యతిరేక వర్గాల ప్రదర్శనలు జోరందుకోనున్నాయి.  అమెరికాలో పాకిస్థాన్ కు చెందిన పౌరులు దాదాపు అయిదు లక్షల మంది ఉంటారని అంచనా.  తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి వ్యతిరేకంగా ముజాహిర్లు, బలోచిస్థానీయులు, భుట్టో-జర్దారీ లకు చెందిన పీపీపీ అనుకూలురు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అభిమానులు ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జులై 23న యూఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీస్ (యూఎస్ఐపీ) ఆహ్వానంపై ఆ సంస్థ నిర్వహిస్తున్నమేధోమథనం కార్యక్రమంలో ఇమ్రాన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కూడా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తలెత్తవచ్చని భావిస్తున్నారు.