Friday, July 19, 2019

Tiger Found Resting On A Bed In A Shop In Assam


పాపం ఆ పులి అలసిపోయి.. ఓ ఇంట్లో మంచమెక్కి నిద్రపోయింది
పులి జనారణ్యంలోకి వచ్చేసింది. ఎంతగా అలసిపోయిందో ఏమో ఓ ఇంట్లోకి దూరి మంచమెక్కి మరీ అదమరచి హాయిగా నిద్రలోకి జారిపోయింది. ఈ ఘటన గురువారం ఉదయం 7.30 సమయంలో అసోం లోని నాగోన్ జిల్లా బగొరీలో జరిగింది. అసోం తో పాటు ఈశాన్య భారతంలో ఇటీవల ఎడతెగని వర్షాలకు వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక్కడకు సమీపంలో 2 కిలో మీటర్ల దూరంలోనే కజిరంగ జాతీయ అభయారణ్యం ఉంది. వర్షాలతో పోటెత్తిన వరదలకు వన్య ప్రాణులన్నీ చెల్లాచెదురైపోయాయి. వీటిలో చాలా జంతువులు చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. అలా వరదల్లో చిక్కుకుని ప్రాణాలు దక్కించుకున్న రాయల్ బెంగాల్ టైగ్రస్(ఆడ పులి) అనుకోని అతిథిలా ఇలా ఓ ఇంట్లోకి వచ్చి సేద తీరింది. రాయల్ బెంగాల్ పులులు ఈతలో నేర్పరులన్న సంగతి తెలిసిందే. ఇవి కిలోమీటర్ల కొద్దీ అలసిపోకుండా చాకచక్యంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతుంటాయి. ప్రపంచంలో అతి పెద్దవైన సుందర్బన్ (మాంగ్రూవ్స్) మడ అడవుల్లో ఇవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అటు పశ్చిమబెంగాల్, ఇటు బంగ్లాదేశ్ లో విస్తరించిన సుందర్ బన్ మడ అడవుల్లో  ఎక్కువగా గల రాయల్ బెంగాల్ పులులు రాత్రి వేళల్లో ఆహారం కోసం నదుల గుండా ఈదుతూ వేట కొనసాగిస్తుంటాయి. కానీ అసోం లోని బగోరిలో గల మోతీలాల్ ఇంటికి ఆహ్వానం లేని అతిథిలా జొరబడి అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. మోతీలాల్ ఇల్లు, షాప్ పక్కపక్కనే ఉంటాయి. ఆ ప్రాంగణంలోకి ఉదయాన్నే పులి దర్జాగా నడుచుకు వస్తుంటే చుట్టుపక్కల జనం కేకలు వేశారు. అప్పటికి పులి..మోతీలాల్ కు కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. బిక్కచచ్చిపోయిన మోతీలాల్ ను ఆ పులి ఏమీ చేయకుండా నేరుగా ఇంట్లోకి దూరి ఓ గదిలో గల మంచంపైకెక్కి నిద్రపోయింది. దాదాపు 10 గంటలు మోతీలాల్ ఇంట్లోనే పులి తనవితీరా సేద తీరింది. మోతీలాల్ కుటుంబ సభ్యుల్ని భద్రంగా ఆ ఇంటి నుంచి వేరో ఇంటికి తరలించారు. అప్పటి వరకు ఆ పులికి నిద్రా భంగం కల్గించకుండా వన్యప్రాణి సంరక్షణ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ ను సైతం క్రమబద్ధీకరించారు. అదే విధంగా జనానికి ఎటువంటి హాని జరగకుండా చర్యలు చేపట్టారు. సాయంత్రం 4.30 సమయంలో నిద్ర లేచిన పులి హైవే గుండా సురక్షితంగా అడవిలోకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నామని వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యు.టి.ఐ) అధికారి రతిన్ బ్రహ్మన్ తెలిపారు.

Thursday, July 18, 2019

Imran Khan plans rally like modi`s style infront of president trumph in US tour


మోదీ ర్యాలీ తరహాలో ట్రంప్ ను ఆకట్టుకోవాలనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్

అగ్ర రాజ్యం అమెరికాను ప్రసన్నం చేసుకునే క్రమంలో పాకిస్థాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి పాక్ తో అమెరికా సంబంధాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ట్రంప్ హయాంలోనూ ఇరు దేశాల మధ్య  సంబంధాలు మెరుగుపడలేదు. ఉగ్రవాద మూలాల పాకిస్థాన్ లో అంతకంతకూ వేళ్లూనుకున్న నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా దూరం పెట్టింది. దాంతో ముంబయి   బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయిీద్ (జె.యు.డి. చీఫ్)ను అరెస్ట్ చేసిన పాకిస్థాన్ తమ సరిహద్దుల గగన తలంలో భారత్ విమానాల రాకపోకలకు ఆంక్షల్ని తొలగిస్తూ భారత్ తో పాటు అమెరికాను ఏకకాలంలో ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది. అమెరికా, పాక్ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఇమ్రాన్ నడుం బిగించారు. అందులో భాగంగానే నెల 22న ఆయన  అమెరికాలో పర్యటించనున్నారు. వైట్ హౌస్ లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. తన అమెరికా పర్యటన సందర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం ద్వారా ట్రంప్ దృష్టిలో పడాలని ఇమ్రాన్ ఉబలాటపడుతున్నారు. మోదీ ర్యాలీ తరహాలో ఈ ర్యాలీ ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ నాయకుల ర్యాలీలు అమెరికాలో గతంలో అనేకసార్లు నిర్వహించారు. కానీ పాక్ నాయకుడి ర్యాలీ ఏర్పాటు కాబోవడం ఇదే ప్రథమం. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ రాజధాని వాషింగ్టన్ డీసీలోని చైనాటౌన్ లో నిర్వహించతలపెట్టిన ఈ ర్యాలీ సందర్భంగా ఆయన అనుకూల వ్యతిరేక వర్గాల ప్రదర్శనలు జోరందుకోనున్నాయి.  అమెరికాలో పాకిస్థాన్ కు చెందిన పౌరులు దాదాపు అయిదు లక్షల మంది ఉంటారని అంచనా.  తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి వ్యతిరేకంగా ముజాహిర్లు, బలోచిస్థానీయులు, భుట్టో-జర్దారీ లకు చెందిన పీపీపీ అనుకూలురు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అభిమానులు ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జులై 23న యూఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీస్ (యూఎస్ఐపీ) ఆహ్వానంపై ఆ సంస్థ నిర్వహిస్తున్నమేధోమథనం కార్యక్రమంలో ఇమ్రాన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కూడా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. 



Wednesday, July 17, 2019

ICJ asks Pakistan to hold death sentence of kulbhushan jadhav, calls for fair trial


కులభూషణ్ జాదవ్ ఉరి నిలిపివేయాలని పాకిస్థాన్ కు ఐసీజే ఆదేశం
పాకిస్థాన్ చెరలో మగ్గుతున్న భారత మాజీ నేవీ కమాండర్ కులభూషణ్ జాదవ్ కు ఆ దేశ న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు విధించిన ఉరిశిక్షను నిలిపివేసి నిష్పక్షపాత న్యాయవిచారణ చేపట్టాలని పాకిస్థాన్ కు సూచించింది. ఐసీజేలో 15:1 నిష్పత్తిలో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) విభాగమైన ఐసీజే 1945లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ స్కోలో ఏర్పాటయింది. ప్రస్తుతం నెదర్లాండ్స్ లోని హేగ్ లో అంతర్జాతీయ న్యాయ విచారణలు నిర్వహిస్తోంది. 
 తమ దేశంలో గూఢచర్యం నిర్వహించి కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణలతో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ ఆయనను నిర్బంధించింది. వాస్తవానికి ఆయనను ఇరాన్ లో నిర్బంధించిన పాకిస్థాన్ నిఘా అధికారులు తమ దేశానికి తరలించారని భారత్ వాదిస్తోంది. 2003 నుంచి 2016 వరకు నేవీ కమాండర్ గా విధులు నిర్వర్తించిన కులభూషణ్ పదవీ విరమణ చేశారు. ఆయన వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు 10 ఏప్రిల్ 2017న ఇరాన్ వెళ్లిన సందర్భంగా అక్కడ పట్టుకుని పాకిస్థాన్ కు అపహరించుకు వెళ్లారు. కులభూషణ్ భారత రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్ తరఫున తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పాక్ ఆయనకు ఉరిశిక్ష విధించింది. భారత్ ఐసీజే దృష్టికి తీసుకెళ్లడంతో పాక్ న్యాయస్థానం తీర్పునకు అడ్డుకట్టపడింది. సుదీర్ఘ విచారణల అనంతరం  ఐసీజే నిష్పాక్షపాత, సమగ్ర విచారణ చేపట్టాలని పాక్ ఉన్నత న్యాయస్థానానికి సూచిస్తూ విధించిన ఉరిశిక్ష తీర్పును సస్పెండ్ చేసింది. 1970 లో మహారాష్ట్రలోని సాంగ్లిలో సుధీర్ జాదవ్, అవంతి జాదవ్ లకు కులభూషణ్ జన్మించారు. కులభూషణ్ కు ఉరిశిక్ష విధిస్తూ పాక్ న్యాయస్థానం విధించిన తీర్పుపై ఐసీజే వేటు వేస్తూ ఇచ్చిన తీర్పు భారత్ వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఈ కేసు విషయంలో పాక్ కు అమెరికా, చైనాలు మద్దతు ఇవ్వడం గమనార్హం.

Tuesday, July 16, 2019

Mischievous Penguins Raid Sushi Bar in newzealand Even After Being Removed by the Police


వెల్లింగ్టన్ వాసుల్ని భయపెట్టిన నీలిరంగు పెంగ్విన్ల జోడి
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ లో చిట్టి పెంగ్విన్ పక్షుల జోడి కలకలం రేపింది. మంగళవారం ఈ ఘటన స్థానిక సుషి బార్ లో చోటు చేసుకుంది. వెల్లింగ్టన్ రైల్వే స్టేషన్ కు సమీపంలో గల ఈ బార్ లో సోమవారం కూడా ఈ పక్షుల జోడిని అక్కడ సిబ్బంది గమనించారు. మళ్లీ మంగళవారం కూడా ఈ పక్షులు బార్ ప్రాంగణంలోని ఓ రూమ్ ఏసీ బాక్స్ వద్ద తచ్చాడాయి. వీటి జాడను గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వీటిని పట్టుకుని తీసుకెళ్లి కిలోమీటర్ దూరంలో గల హార్బర్ ప్రాంతంలో విడిచిపెట్టారు. అదే ప్రాంతంలో అప్పుడప్పుడు ఈ నీలి రంగు పెంగ్విన్ పక్షులు తిరుగాడుతుంటాయి. అయితే ఇలా రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో వీటిని చూడ్డం అరుదేనట. ఇంతకీ జనం అంతగా భయాందోళనకు గురి కావడానికి కారణమేంటంటే ఇవి అన్ని పక్షుల్లా మనుషులకు భయపడవు. పైగా ఇవే మనుషులపై దాడి చేస్తాయి. తమ ఉనికికి ఇబ్బందిగా అనిపించినా వీటి ఏకాంత వాసానికి భంగం కల్గినా ఆహారం లభించకపోయినా మనుషులే లక్ష్యంగా సూదంటి ముక్కు, గోళ్లతో మనుషుల్ని గాయపరుస్తుంటాయని అధికారులు తెలిపారు. దాంతో వీటిని క్రూర జంతువుల మాదిరిగా ప్రమాదకర పక్షుల జాబితాలో జనం చేర్చారు. అదీ గాక ఇవి ఒకచోట గూడు ఏర్పాటు చేసుకున్నాయంటే ఎంత దూరం తీసుకెళ్లి విడిచినా తిరిగి అదే చోటుకి వచ్చి చేరతాయట. దాంతో బార్ సిబ్బంది సత్వరం స్పందించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి వీటి బెడదను వదిలించుకున్నారు. సుషి బార్ సిబ్బంది రేడియో న్యూజిలాండ్ (ఆర్.ఎన్.జి) తో ఈ నీలి పెంగ్విన్ల సమాచారాన్ని పంచుకున్నారు. వీటిని వెల్లింగ్టన్ హార్బర్ ప్ర్రాంతంలో విడిచివచ్చిన పోలీస్ కానిస్టేబుల్ జాన్ జు సోషల్ మీడియా (ఫేస్ బుక్)లో ఈ సమాచారాన్ని పోస్టు చేశాడు. జంతు సంరక్షణ శాఖ (డిపార్ట్ మెంట్ ఆఫ్ కన్జర్వేషన్-డీఓసీ) కార్యనిర్వహణాధికారి జాక్ మేస్ మాత్రం ఈ పక్షులు మళ్లీ తిరిగి రావచ్చని భావిస్తున్నారు. తొలుత ఈ పెంగ్విన్ల రాకను బార్ సిబ్బంది వీనీ మోరిస్ పసిగట్టింది. అయితే ఈ పక్షులంటే జనానికి భయం కావచ్చు గానీ అవి మాత్రం ప్రేమించదగినవేనని ఆమె పేర్కొంది.