Friday, May 17, 2019

UN health agency highlights lifestyle choices to prevent dementia



చక్కటి జీవనశైలి వ్యాయామంతో మతిమరుపు దూరం: డబ్లూహెచ్ఓ
ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న తాజా ఆరోగ్య సమస్య డెమెన్షియా (చిత్తవైకల్యం- మతిమరుపు). ప్రస్తుతం విశ్వ వ్యాప్తంగా అయిదు కోట్ల మంది (50మిలియన్లు) ఈ వ్యాధి బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల ప్రకటించింది. ఏటా కోటి మంది(10మిలియన్లు) కొత్తగా ఈ వ్యాధికి లోనవుతున్నారు. ఈ సమస్యకు చాలా సులభమైన పరిష్కారాన్ని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ధూమపానం(స్మోకింగ్), మద్యపానం(డ్రింకింగ్) మానేసి చక్కటి జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ డెమెన్షియా దరిచేరదని పేర్కొంది. అంతేగాక పై చిట్కా ద్వారా ఊబకాయం, రక్తపోటు, మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండి గుండె, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ  డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధ్నామ్ గాబ్రియెసిస్ సూచించారు. తమ సంస్థ ఇప్పటికే బోస్నియా, హెర్జ్ గొవినా, క్రోయేసియా,ఖతర్, స్లొవేనియా, శ్రీలంక తదితర దేశాల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. డెమెన్షియా వ్యాధిని గుర్తించే పరీక్ష శిబిరాలు, చికిత్స తదితరాల పైన డబ్ల్యూహెచ్ఓ దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. మరోవైపు ఆన్ లైన్ ద్వారా డెమెన్షియా వ్యాధిగ్రస్తులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు డబ్యూహెచ్ఓ మానసిక ఆరోగ్య పరిరక్షణ విభాగ డైరెక్టర్ డాక్టర్ డెవొరా కెస్టెల్ పేర్కొన్నారు. ఆన్ లైన్ కార్యక్రమాల ద్వారా ఎవరికి వారు తమ సమస్యను గుర్తించొచ్చని చెప్పారు. కుటుంబ సభ్యులు, విధి నిర్వహణలో సహ సిబ్బందితో వ్యవహారశైలి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా డెమెన్షియా లక్షణాల్ని గుర్తించి తగు చికిత్స ద్వారా సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చని తెలిపారు.

Thursday, May 16, 2019

mp teacher who got student slapped 168 times arrested



విద్యార్థిని హోంవర్క్ చేయలేదని 168 చెంపదెబ్బలు.. టీచర్ అరెస్ట్

హోంవర్క్ చేసుకురాలేదని ఓ విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయుడు 168 చెంపదెబ్బల కఠిన దండన విధించి జైలు పాలయిన ఘటన ఇది. మధ్యప్రదేశ్ లోని జబువా జిల్లాలో ఈ దారుణం జరిగింది. తాండ్లా పట్టణంలోని జవహర్ నవోదయ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలిక ఆరోగ్యం సరిగ్గా లేక 2018 జనవరి 1 నుంచి 10 వరకు స్కూలుకు రాలేదు. తర్వాత రోజు స్కూలుకు వచ్చిన బాలిక హోంవర్క్ చేయలేదని ఆగ్రహం చెందిన మనోజ్ వర్మ(35) తోటి విద్యార్థులతో 168 చెంపదెబ్బలు కొట్టించాడు. వారానికి ఆరు రోజులు ఒక్కొక్కరూ రెండేసి చెంప దెబ్బలు చొప్పున ఆ బాలికను కొట్టాలని 14 మంది తోటి విద్యార్థులను ఆదేశించాడు.  ఉపాధ్యాయుడు ఆ విధంగా తమ బిడ్డకు శిక్ష అమలు చేశాడని ఆవేదన చెందిన బాలిక తండ్రి శివప్రసాద్ సింగ్ బాలికా సంరక్షణ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన అవమానంతో తల్లిడిల్లిన తమ పాప మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. అప్పటి నుంచి ఆ విద్యార్థిని స్కూలుకు వెళ్లేందుకు నిరాకరిచింది. శివప్రసాద్ జరిగిన ఘోరాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వారు ఈ ఘటన దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ విచారణలో నిజమని తేలడంతో తాండ్లా పట్టణ పోలీసులు సోమవారం (మే13) ఉపాధ్యాయుడు మనోజ్ వర్మను అరెస్టు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన మేజిస్ట్రేట్ జైపటిదార్ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ 14 రోజుల రిమాండ్ విధించారు. అదే రోజు జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలిచ్చారు.

Wednesday, May 15, 2019

i`ll fight it won't apologise for sharing mamata's photo: bjp activist



జైల్లో చాలా ఇబ్బంది పెట్టారు..క్షమాపణలు చెప్పను: ప్రియాంక శర్మ
`నేనేమీ క్షమాపణలు చెప్పేంత తప్పు చేయలేదు..ఈ కేసుపై పోరాడతా` అని మమతా బెనర్జీ ఫొటో మార్ఫింగ్ కేసులో అరెస్టయిన బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రియాంక శర్మ అన్నారు. న్యూయార్క్ మెట్ గాలాలో పాల్గొన్న ప్రియాంకచోప్రా ఫొటోలో సీఎం మమత ఫొటోను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేయడం, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడంతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టింది.  సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బుధవారం(మే15) ఉదయం ఆమె అలీపూర్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు.  ఈ సందర్భంగా ఆమె విలేకర్ల తో మాట్లాడుతూ జైలులో తన పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారని చెప్పారు. జైలర్ తనను జైలు గది లోకి నెట్టి తలుపు వేశారన్నారు. అప్పుడు ఆయనతో తనేమీ నేరస్తురాలిని కాదని ఈ విధంగా నెట్టడమేంటని ప్రశ్నించానన్నారు. జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ప్రియాంక శర్మ చెప్పారు. జైలుకు తరలించడంపై తన కుటుంబంతో పాటు తను కూడా వేదన చెందానన్నారు. ప్రియాంకశర్మ విడుదల సందర్భంగా దక్షిణ కోల్ కతాలో గల జైలుకు పెద్ద సంఖ్యలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు చేరుకుని ఆమెకు ఆహ్వానం పలికారు.

madona`s performance in doubt may 18 Eurovision conest



యూరో విజన్ లో మడోనా పాల్గొనడం అనుమానమే!
ఇజ్రాయిల్ నగరం టెల్ అవివ్ లో మే18న జరుగనున్న యూరో విజన్ పాటల ప్రదర్శనలో ప్రఖ్యాత పాప్ గాయని మడోనా పాల్గొనడం అనుమానంగానే ఉంది. మడోనా పాల్గొంటున్నట్లు ఆమె తరఫు అమెరికా, బ్రిటన్ ప్రచారకర్తలు ఏప్రిల్ లోనే ప్రకటించారు. అయితే ఇంతవరకు ఆమె ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయలేదని యూరోవిజన్ ఎగ్జిక్యూటివ్ సూపర్ వైజర్ జాన్ ఒలా శాండ్ తెలిపారు. ఆమె కాంట్రాక్ట్ పై సంతకం పెడితేనే తమ వేదికపై ప్రదర్శన ఇవ్వగలరన్నారు. తొలుత మడోనా రెండు పాటలు ప్రదర్శించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజా ఆల్బమ్ `మేడమ్ ఎక్స్` నుంచి ఓ పాట, 1989లో పేరొందిన తన మరో పాటను ఆమె వేదికపై ప్రదర్శిస్తారని భావించారు. 2010  నుంచి యూరోవిజన్ ను నిర్వహిస్తున్న శాండ్ మాట్లాడుతూ ఇంకా మడోనాతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తమ వేదికపై ప్రఖ్యాత కళాకారులు పాల్గొనాలనే కోరుకుంటామని అయితే అందుకు కొన్ని నియమనిబంధనలు కూడా పెట్టుకున్నామని వివరించారు. మే18న యూరో విజన్ కార్యక్రమంలో ద్వితీయ అర్ధభాగం మడోనా పాటల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఆమె టెల్ అవివ్ చేరుకుని రిహార్సల్స్ లో పాల్గొనాల్సి ఉంది. ఒకవేళ మడోనా ప్రోగ్రాం రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన యూరో విజన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.