Friday, November 4, 2022

Fridge blast at home kills 3, injures 2 in Tamil Nadu

తమిళనాడులో ఫ్రిడ్జ్ పేలి ముగ్గురి దుర్మరణం

తమిళనాడులో ఫ్రిడ్జ్ పేలిన దుర్ఘటనలో మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శుక్రవారం ఈ ప్రమాదం చెంగల్‌పేట జిల్లా గుడువాంచేరి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ఆర్‌ఆర్‌ బృందావన్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్ లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ కంప్రెషర్ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భారీ పేలుడు శబ్దం విని అపార్ట్‌మెంట్‌లోని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఇల్లంతా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. దుర్ఘటనలో గిరిజ (63), ఆమె సోదరి రాధ (55), ఆమె సోదరుడు రాజ్‌కుమార్ (47) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ అపార్ట్‌మెంట్‌లో ఏడాది క్రితం మృతి చెందిన వెంకట్‌రామన్‌ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న అతని భార్య గిరిజ సహా అతని కుటుంబం వెంకట్రామన్‌కు వార్షిక కర్మలు (శ్రాద్ధం) చెల్లించడానికి గురువారం రాత్రి ఇక్కడ ఇంటికి వచ్చారు. ప్రమాద సమయంలో వీరితో పాటు రాజ్‌కుమార్ భార్య భార్గవి (35), అతని కుమార్తె ఆరాధన (6) ఉన్నారు. వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని క్రోంపేట ప్రభుత్వ కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tuesday, November 1, 2022

Andhra Pradesh formation day celebrations held at CM camp office Tadepalli

ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్‌ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొలుత ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ అచీవ్‌మెంట్‌-2022 అవార్డుల్ని ప్రకటించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన 20 మందికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 10 మందికి అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఎంతో గొప్ప సంస్కృతి ఉందనన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయం, విద్య, వైద్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. అవార్డులు అందుకుంటున్న వారందరికీ గవర్నర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వై.ఎస్.విజయమ్మ కూడా పాల్గొన్నారు.

Saturday, October 29, 2022

World's 'tallest' Shiva statue unveiled in Rajasthan's Rajsamand

మహాశివయ్య@369

·        రాజస్థాన్ లో విశ్వాస్ స్వరూపం విగ్రహావిష్కరణ

ప్రపంచంలోనే అతి ఎత్తైన మహాశివుని విగ్రహం రాజస్థాన్ లో కొలువుదీరింది. శనివారం ఈ 369 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లొత్ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారీ బాపు, సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ ఛైర్మన్ మదన్ పలీవాల్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఉదయ్ పూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో గల నాథ్ ద్వారలో ధ్యానముద్రలో కూర్చున్న శివయ్య `విశ్వాస్ స్వరూపం`గా భక్తుల్ని అలరిస్తున్నాడు. 2012లో ముఖ్యమంత్రి గెహ్లొత్ ఆధ్వర్యంలోనే ఈ మహా విగ్రహావిష్కరణకు అంకురార్పణ జరిగింది. భారీ శివయ్య విగ్రహం తయారవ్వడానికి 10 ఏళ్లు పట్టింది. తాట్ పదమ్ సంస్థాన్ ఈ విగ్రహాన్ని నెలకొల్పింది. దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో కొండపైన నెలకొల్పిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచీ కనిపిస్తుంది. ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం వల్ల రాత్రిపూట కూడా విగ్రహాన్ని స్పష్టంగా చూడొచ్చు. విగ్రహ నిర్మాణం కోసం మూడు వేల టన్నుల స్టీలు, ఐరన్. 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను వినియోగించారు. 250 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచినా చెక్కుచెదరనంత పటిష్టంగా 250 ఏళ్లు నిలిచేలా విగ్రహ నిర్మాణం చేపట్టారు. విగ్రహం నెలకొల్పిన ప్రదేశం చుట్టూ బంగీ జంప్, జిప్ లైన్, గో-కార్ట్ వంటి సాహసక్రీడలు, పర్యాటకులు ఆస్వాదించే ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్‌ లను ఏర్పాటు చేశారు.

Friday, October 14, 2022

Rajahmundry road cum railway bridge closed till 21 Oct 2022

కొత్త బ్రిడ్జి మూసివేత

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిని వారం రోజులపాటు మూసివేశారు. ఈరోజు శుక్రవారం నుంచి మళ్లీ ఈనెల 21 వరకు ఈ బ్రిడ్జిపై రోడ్ ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయనున్నారు. అత్యవవసర మరమ్మత్తులు చేపట్టడంతో రాజమండ్రి- కొవ్వూరు మధ్య గల ఈ వారధిపై అన్ని ప్రయాణ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. 4.1 కిలోమీటర్లు (2.5 మైళ్లు) పొడవైన ఈ బ్రిడ్జిపై  ప్రతి అయిదేళ్లకోసారి రోడ్డు భవనాల శాఖ విధిగా మరమ్మత్తులు చేపడుతోంది. దాంతో ఈసారి కూడా అన్ని ప్రయాణ వాహనాలు; చిన్న, మధ్యతరహా రవాణా వాహనాల ట్రాఫిక్ ను ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇక భారీ రవాణా వాహనాలైన లారీలు, ట్రక్కులు మొదలైన వాటిని దివాన్ చెరువు జంక్షన్ రహదారిని కలుపుతూ నిర్మించిన నాల్గో వంతెన మీదుగా మళ్లిస్తున్నారు. 1974 నుంచి గోదావరి నదిపై అందుబాటులోకి వచ్చిన ఈ రోడ్ కం రైల్వే వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా ప్రధాన నగరమైన రాజమండ్రి, వాణిజ్య పట్టణం కొవ్వూరుల మధ్య రాకపోకలకు అనువుగా మారింది.