Saturday, October 29, 2022

World's 'tallest' Shiva statue unveiled in Rajasthan's Rajsamand

మహాశివయ్య@369

·        రాజస్థాన్ లో విశ్వాస్ స్వరూపం విగ్రహావిష్కరణ

ప్రపంచంలోనే అతి ఎత్తైన మహాశివుని విగ్రహం రాజస్థాన్ లో కొలువుదీరింది. శనివారం ఈ 369 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లొత్ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారీ బాపు, సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ ఛైర్మన్ మదన్ పలీవాల్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఉదయ్ పూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో గల నాథ్ ద్వారలో ధ్యానముద్రలో కూర్చున్న శివయ్య `విశ్వాస్ స్వరూపం`గా భక్తుల్ని అలరిస్తున్నాడు. 2012లో ముఖ్యమంత్రి గెహ్లొత్ ఆధ్వర్యంలోనే ఈ మహా విగ్రహావిష్కరణకు అంకురార్పణ జరిగింది. భారీ శివయ్య విగ్రహం తయారవ్వడానికి 10 ఏళ్లు పట్టింది. తాట్ పదమ్ సంస్థాన్ ఈ విగ్రహాన్ని నెలకొల్పింది. దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో కొండపైన నెలకొల్పిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచీ కనిపిస్తుంది. ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం వల్ల రాత్రిపూట కూడా విగ్రహాన్ని స్పష్టంగా చూడొచ్చు. విగ్రహ నిర్మాణం కోసం మూడు వేల టన్నుల స్టీలు, ఐరన్. 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను వినియోగించారు. 250 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచినా చెక్కుచెదరనంత పటిష్టంగా 250 ఏళ్లు నిలిచేలా విగ్రహ నిర్మాణం చేపట్టారు. విగ్రహం నెలకొల్పిన ప్రదేశం చుట్టూ బంగీ జంప్, జిప్ లైన్, గో-కార్ట్ వంటి సాహసక్రీడలు, పర్యాటకులు ఆస్వాదించే ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్‌ లను ఏర్పాటు చేశారు.

Friday, October 14, 2022

Rajahmundry road cum railway bridge closed till 21 Oct 2022

కొత్త బ్రిడ్జి మూసివేత

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిని వారం రోజులపాటు మూసివేశారు. ఈరోజు శుక్రవారం నుంచి మళ్లీ ఈనెల 21 వరకు ఈ బ్రిడ్జిపై రోడ్ ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయనున్నారు. అత్యవవసర మరమ్మత్తులు చేపట్టడంతో రాజమండ్రి- కొవ్వూరు మధ్య గల ఈ వారధిపై అన్ని ప్రయాణ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. 4.1 కిలోమీటర్లు (2.5 మైళ్లు) పొడవైన ఈ బ్రిడ్జిపై  ప్రతి అయిదేళ్లకోసారి రోడ్డు భవనాల శాఖ విధిగా మరమ్మత్తులు చేపడుతోంది. దాంతో ఈసారి కూడా అన్ని ప్రయాణ వాహనాలు; చిన్న, మధ్యతరహా రవాణా వాహనాల ట్రాఫిక్ ను ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇక భారీ రవాణా వాహనాలైన లారీలు, ట్రక్కులు మొదలైన వాటిని దివాన్ చెరువు జంక్షన్ రహదారిని కలుపుతూ నిర్మించిన నాల్గో వంతెన మీదుగా మళ్లిస్తున్నారు. 1974 నుంచి గోదావరి నదిపై అందుబాటులోకి వచ్చిన ఈ రోడ్ కం రైల్వే వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా ప్రధాన నగరమైన రాజమండ్రి, వాణిజ్య పట్టణం కొవ్వూరుల మధ్య రాకపోకలకు అనువుగా మారింది.

Monday, July 25, 2022

Droupadi Murmu to take oath as President followed by 21-gun salute

 రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

దేశ నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సోమవారం ఉదయం 10.15కి ఆమెతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్.వి.రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై ముర్ముతో పాటు, సీజేఐ జస్టిస్ రమణ, రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్ ఓం బిర్లా ఆశీనులయ్యారు. వేదిక కింద ముందు వరుసలో ప్రధాని నరేంద్రమోదీ, సోనియాగాంధీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రతిభాపాటిల్, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, స్మృతి ఇరానీ తదితరులు కూర్చున్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత ఈ ఉదయం 8.30కి ముర్ము రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధిని సందర్శించి జాతిపితకు నివాళులర్పించారు. అనంతరం ఆమె తన తాత్కాలిక నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ కు విచ్చేశారు. ఆమెను సెంట్రల్ హాల్ లోని ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రామ్ నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, జస్టిస్ రమణ, ఓం బిర్లా తోడ్కొని వచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత ముర్ము మాట్లాడుతూ ఆజాదికీ అమృత మహోత్సవాలు జరుగుతున్న వేళ భారత రాష్ట్రపతిగా పదవి చేపట్టడంతో అమితానందం కల్గుతోందన్నారు. ఇందుకు దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒడిశా నీటిపారుదల శాఖలో ఓ సాధారణ క్లర్కుగా జీవితం ప్రారంభించిన ఆమె దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి చేరుకున్నారు.  రాజకీయాల్లో తను కౌన్సిలర్ స్థానం నుంచి రాష్ట్రపతి స్థాయికి చేరుకోవడం ముదావహమని ముర్ము అన్నారు. భారత ప్రజాస్వామ్యం గొప్పతనానికి ఇదే నిదర్శనమని సగర్వంగా ప్రకటించారు. ప్రపంచంలోనే భారత్ ఓ అమేయశక్తిగా అవతిరించిందని పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్లల్లో దేశం మరింతగా పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అందుకు అందరూ సహకరించాలన్నారు. దేశ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తానని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.

Friday, July 15, 2022

andhra pradesh cm ys jagan conducts aerial survey of flood hit areas

గోదావరి వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం వై.ఎస్.జగన్ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఉదయం విశాఖపట్టణంలో వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి నేరుగా జగన్ హెలికాఫ్టర్లో గోదావరి ముంపు గ్రామాల పర్యటనకు బయలుదేరారు. వరద పరిస్థితిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పోలవరంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితిని సీఎం జగన్ పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని చెప్పారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. అలాగే వరద పరిస్థితి కొలిక్కివచ్చే వరకు వారికి తగిన సౌకర్యాలను కల్పించాలని సూచించారు.