Friday, January 7, 2022

Chandrababu road show in Own constituency Kuppam

కుప్పంలో చంద్రబాబు విస్తృత పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన కుప్పం విచ్చేశారు. ఇటీవల ఆయన తరచు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి గ్రామగ్రామాన ప్రజల సాధకబాధలను తెలుసుకునేందుకే బాబు విస్తృతంగా పర్యటిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చంద్రబాబు 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తే ఓటమి పాలు కావడం ఖాయమని వైఎస్ ఆర్ సీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీని సైతం పాలకపక్షానికి టీడీపీ కోల్పోవడం ఆ పార్టీని కుంగదీసింది. మంత్రి పెద్దిరెడ్డి ఈ విషయంలో తన పంతం నెగ్గించుకున్నట్లు పాలక వర్గాలు కాలరేగరేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తనపట్టు చెక్కుచెదరలేదని పార్టీ శ్రేణులకు సైతం స్పష్టం చేసే ఉద్దేశంతో చంద్రబాబు కుప్పం తాజా పర్యటన చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా తమ అధినేతకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అదే ఉత్సాహంలో ఆయన దేవరాజుపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఈ పర్యటనకు వచ్చినట్లు బాబు స్వయంగా వెల్లడించారు. మూడ్రోజుల పాటు (శనివారం వరకు) నియోజకవర్గంలోనే ఉంటానని చెప్పారు. తను కుప్పం నియోజకవర్గాన్ని వదిలిపెడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని పాలకపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేతలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యకర్త ఒంటిపై పడే ప్రతిదెబ్బ తనకు తగిలినట్లుగానే భావిస్తానని పేర్కొన్నారు. 

Friday, December 31, 2021

Vijayawada 32 book exhibition starts tomorrow

విజయవాడలో 32వ పుస్తక మహోత్సవం షురూ

ఆంధప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా ఏటా ఏర్పాటవుతున్న పుస్తకమహోత్సవం విజయవాడలో శనివారం నుంచి ప్రారంభమవుతోంది. విజయవాడలో మూడు దశాబ్దాలుగా పుస్తక ప్రియుల్ని అలరిస్తోన్న ఈ పుస్తకాల పండుగ 32వది. పుస్తకప్రదర్శన 11 రోజుల పాటు లక్షల సంఖ్యలో పుస్తకప్రియులకు అందుబాటులో ఉండనుంది. కోవిడ్ నేపథ్యంలో నిబంధనల్ని అత్యంత కఠినంగా పాటించనున్నట్లు ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు. 


Saturday, December 25, 2021

Telangana KTR lashes out BJP body shaming son

తీన్మార్ మల్లన్నకు తలంటేస్తున్న నెటిజన్లు

అందరివాడుగా మన్ననలు అందుకున్న తీన్మార్ మల్లన్న ఒక్క ప్రోగ్రామ్ తో బదనాం అయిపోయాడు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖామంత్రి కె.టి.ఆర్ తనయుడు హిమాన్ష్ పై మల్లన్న సరదాగా చేసిన కార్యక్రమం అతని కొంపముంచేసింది. కుటుంబసభ్యుల్ని అందులోనూ ఓ స్కూల్ విద్యార్థి అయిన తన కుమారుడి పట్ల మల్లన్న చేసిన కామెంట్ హేయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్మార్గపు పోకడలకు సోషల్ మీడియా స్వర్గంగా తయారయిందని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. మరోవైపు నెటిజన్లు మూక్కుమ్మడిగా తీన్మార్ మల్లన్నకు తలంటేస్తున్నారు. వై.ఎస్.ఆర్.టి.పి. అధ్యక్షురాలు షర్మిల కూడా మల్లన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పబట్టారు. రాజకీయాలు కుటుంబ సభ్యుల వరకు తీసుకురాకూడదని మహిళలు, పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని  కామెంట్లు చేయడం తప్పన్నారు.  కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత సైతం తీన్మార్ మల్లన్న వైఖరిని ఖండించారు. ఏ విషయమూ దొరక్క పిల్లాడిని అతని శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానం చేయడం తగదన్నారు. స్వేరో నేత, బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ కూడా మల్లన్న ట్వీట్ ను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Friday, December 24, 2021

Shilpa Chowdary gets bail released from Chanchalaguda central jail

ఎట్టకేలకు శిల్పాచౌదరి విడుదల

 కిట్టీ పార్టీల పేరుతో కోట్లకు టోకరా వేసి అరెస్టయిన శిల్పాచౌదరి శుక్రవారం ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయింది. ఆమెపై నమోదైన మూడు కేసుల్లో రాజేంద్రనగర్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేయగా ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. అధిక వడ్డీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో బడావ్యక్తుల్ని కోట్ల రూపాయలకు ముంచేసిన కేసులో శిల్పా నిందితురాలు. బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయస్థానం శిల్పాచౌదరికి కొన్ని షరతులు విధించింది. రూ.10వేల ష్యూరిటీ సమర్పించడంతో విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఆదేశించింది. ఎవరితోనూ ఫోన్‌లో కానీ, నేరుగా కానీ ఈ కేసు విషయం మాట్లాడకూడదని, సాక్షులను బెదిరించరాదని కోర్టు గట్టిగా చెప్పింది. అలాగే ప్రతి శనివారం నార్సింగి పోలీస్‌‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. నవంబర్ 13న దివ్యారెడ్డి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు 25న శిల్పాచౌదరి, ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో మూడుసార్లు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించినా ఆమె నోరు విప్పలేదు. కొందరు మహిళలకు డబ్బు ఇచ్చానని, ఓ ఆసుపత్రి నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని, హయత్‌నగర్‌లో ఓ ప్లాటు, గండిపేటలో ఓ విల్లా ఉందని మాత్రం చెప్పుకొచ్చింది. వాటిని అమ్మి తనపై ఫిర్యాదులు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని విచారణ సందర్భంగా శిల్పా తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఆమె భర్తకు ఉప్పర్‌పల్లి కోర్టు గతంలోనూ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. శిల్పాచౌదరి బెయిల్ పిటిషన్లను మూడుసార్లు కోర్టు తిరస్కరించడం గమనార్హం.