Wednesday, December 22, 2021

once again tension prevailed in Vizianagaram district Ramatheertham temple

వేడెక్కిన రామతీర్థం

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా మరోసారి వేడెక్కింది. ఏడాది క్రితం జిల్లాలోని రామతీర్థం ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ పురాతన రామాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం తల నరికేసిన దుండగులు అశేషభక్తుల మనోభావాలను  దెబ్బతీశారు. దీనికి సంబంధించి నిందితులెవ్వర్ని ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోయిందని ఆలయ ధర్మాధికారి మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది తర్వాత తీరిగ్గా ప్రభుత్వం ఇక్కడ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని విమర్శించారు. ఇది `సర్కస్ కాదు.. పూజ` అని గుర్తు పెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా ఆలయ జీర్ణోద్ధరణ కోసం తను విరాళం ఇవ్వగా మొహం మీదే తిప్పికొట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. భక్తులు ఆరాధనపూర్వకంగా చెల్లించే విరాళాల్ని ప్రభుత్వం తిరస్కరించడం మానుకోవాలని సూచించారు. ఇదిలావుండగా రామతీర్థం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు మంత్రులు వెల్లంపల్లిశ్రీనివాస్, బొత్స సత్యనారాయణ బుధవారం శంకుస్థాపన చేశారు.


Monday, December 13, 2021

Search continues for victims of tornadoes that killed dozens in 7 states of US

టోర్నడోల ధాటికి అమెరికా విలవిల

అమెరికాను టోర్నడోలు అతలాకుతలం చేశాయి. ఇటీవల విరుచుకుపడిన టోర్నడోల ధాటికి ఆ దేశంలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు వార్తలందుతున్నాయి. దాదాపు ఏడు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా తలెత్తిన టోర్నడోలు జనజీవితాన్ని ఛిద్రం చేశాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల వల్ల ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోయాయి. సుడిగాలులు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీలో పరిస్థితి భయంకరంగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన తుపాను అని  గవర్నర్‌ ఆండీ బెషియర్‌ చెప్పారు. మేఫీల్డ్‌ నగరంలో అమెజాన్‌ క్యాండిల్‌ ఫ్యాక్టరీ ధ్వంసమయింది. శిథిలాల కింద 110 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. వారిలో 29 మంది మరణించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఆర్డర్లు అధికంగా ఉండడంతో వారంతా రాత్రిపూట కూడా పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు చర్యలు చేపట్టారు. కెంటకీలో మొత్తంగా 70 మందికి పైగా మరణించినట్లు అధికారిక సమాచారం. ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 227 మైళ్ల మేర టోర్నడోల ప్రభావం కనిపించిందని గవర్నర్‌ తెలిపారు. స్థానిక అధికారులు, నేషనల్‌ గార్డు సభ్యులు, ఎమర్జెన్సీ వర్కర్స్‌ మేఫీల్డ్‌ సిటీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆర్కాన్సస్‌ రాష్ట్రంలో ఈ  ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంది. మోనెట్టి మానర్‌ నర్సింగ్‌ హోమ్‌ ధ్వంసం కావడంతో ఒకరు మరణించారు. మరో 20 మంది లోపలే ఉండిపోగా వారిని రక్షించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. టెన్నెస్సీ రాష్ట్రంలో ముగ్గురు మృతిచెందారు. లేక్‌ కౌంటీలో ఇద్దరు, ఒబియోన్‌ కౌంటీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ టోర్నడోల బీభత్సంపై  అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Saturday, December 4, 2021

Konijeti Rosaiah passed away in Hyderabad

కాంగ్రెస్ మహానేత అజాతశత్రువు కొణిజేటి రోశయ్య (88) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లో శనివారం ఉదయం 8 గంటలకు అస్వస్థత గురైన కొద్దిసేపటికే మరణించారు.  నాడి పడిపోతుండడంతో గమనించిన కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన స్టార్ హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఇటీవల బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్ లోనే ఆయన కొంతకాలం చికిత్స పొందారు. వైద్యులు రోశయ్య మరణించినట్లు ధ్రువీకరించిన అనంతరం పార్థివదేహాన్ని అమీర్ పేట, ధరంకరం రోడ్డులోని స్వగృహానికి తీసుకువచ్చారు. గాంధీభవన్ లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయన భౌతికకాయన్ని పార్టీ శ్రేణులు సందర్శనార్థం ఉంచనున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోశయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్, సన్నిహిత సహచరులు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి  రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Friday, November 5, 2021

Delay in communication of bail orders affects liberty:SC judge

బెయిల్ కాపీ జాప్యంపై సుప్రీం జడ్జి ఆగ్రహం

బెయిల్ ఆర్డర్ కాపీ అందజేతలో జాప్యాన్ని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది వ్యక్తుల స్వేచ్ఛను హరించడంగా పేర్కొన్నారు. ఈ అంశంలో దిద్దుబాటు చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని హితవు చెప్పారు. జైలు అధికారులకు సత్వరం బెయిల్ ఆర్డర్ కాపీలను అందించక అలసత్వం వహించడం వల్ల విచారణలో ఉన్న ఖైదీలపై మానసికంగా ప్రభావం పడుతోందన్నారు. ఇప్పటికే దేశంలోని ఆయా జిల్లా కోర్టుల్లో 2.97 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. వీటిలో 77 శాతం కేసులు ఏడాదిలోపువేనన్నారు.