Tuesday, November 10, 2020

Indian Premier League 2020 title winner again Mumbai

ఐపీఎల్ విజేత మళ్లీ ముంబయే!!

ఐపీఎల్ టాప్ క్లాస్ విన్నింగ్ టీమ్ ముంబయి మరో ఫైనల్ విజయాన్ని నమోదు చేసింది. డ్రీమ్ ఏ లెవన్ టోర్నీ తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి మరోసారి ఐపీఎల్ విన్నర్ గా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయికి ఇది అయిదో ఐపీఎల్ టైటిల్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. గెలుపునకు 157 పరుగులు చేయాల్సిన ఎం.ఐ జట్టు కలిసికట్టుగా ఆడి టైటిల్ ను ముద్దాడింది. మరో ఎనిమిది బంతులు మిగిలివుండగానే అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డీసీని కట్టడి చేయడంలో సక్సెస్ అయిన ఎం.ఐ. జట్టు బ్యాటింగ్ లోనూ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా స్కిపర్ రోహిత్ శర్మ (68) అర్ధ సెంచరీ, ఇషాంత్ కిషన్ అద్భుత బ్యాటింగ్ (19 బంతుల్లో 33 పరుగులు) నైపుణ్యంతో జట్టును తేలిగ్గా విజయతీరానికి చేర్చారు. ఈ మ్యాచ్ తొలి బంతికే స్టోయినెస్ ను బౌల్ట్ బోల్తా కొట్టించాడు. పరుగులేమీ చేయకుండానే స్టోయినెస్ కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత రహానె(2), సూపర్ ఫామ్ లో ఉన్న ధావన్ (15) పరుగులకే వెనుదిరగ్గా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, యంగ్ టాలెంట్ రిషబ్ పంత్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అయ్యర్ 50 బంతుల్లో 65 పరుగులు, రిషబ్ 38 బంతుల్లో 56 పరుగులతో అర్ధ  సెంచరీలు సాధించారు. రిషబ్ కి ఈ టోర్నీలో తొలి అర్ధ సెంచరీ ఇది. వీరిద్దరి జోడి నాల్గో వికెట్ కు 96 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. అయితే చివరి ఓవర్లలో ముంబయి బౌలర్లు బూమ్రా, బోల్ట్, జయంత్, కోల్ట్రెనైల్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీ పరుగులకు కళ్లెం వేశారు. బోల్ట్ నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు, కోల్ట్రెనైల్ 29 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ట్రెంట్ బౌల్ట్ సాధించాడు.మ్యాచ్ తొలిబంతికే అవుటైన స్టోయినెస్ తన బౌలింగ్ లో తొలి బంతికే డీకాక్ ను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. టోర్నీలో చక్కగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ రోహిత్ కోసం తన వికెట్ ను త్యాగం చేశాడు. ముంబయి పటిష్ట స్థితిలో ఉండగా లేని పరుగు కోసం యత్నించిన రోహిత్ కోసం సూర్యకుమార్ రనౌట్ గా వెనుదిరిగాడు. తాజా విజయంతో ముంబయి జట్టు 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నట్లయింది.

Monday, November 9, 2020

Trailblazers lifted JioT-20 womens Trophy for the first time

ట్రయల్ బ్లేజర్స్ దే టీ20 కప్

స్మృతి మంధాన విజృంభణతో ట్రయల్ బ్లేజర్స్ తొలిసారి మహిళల టీ20 కప్ ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన  జియో 2020 టీ20 చాలెంజర్ కప్ ఫైనల్స్ లో  సూపర్ నోవాస్ పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మృతి బ్యాటర్ గానే కాక కెప్టెన్ గానూ రాణించి మ్యాచ్ ను తన జట్టుకు తొలిసారి ట్రోఫీని సాధించిపెట్టింది. గతంలో ఈ ట్రోఫీని సూపర్ నోవాస్ రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసినా ట్రయల్ బ్లేజర్స్ అన్నిరంగాల్లో రాణించి కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగులు చేసింది. స్మృతి 49 బంతుల్లో 3 సిక్సర్లు 5 ఫోర్లతో 68 పరుగులు స్కోరు చేసింది. ప్రత్యర్థి జట్టులో రాధా యాదవ్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకుంది. టీ20 మహిళా టోర్నీల్లో ఓ మ్యాచ్ లో 5 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సూపర్ నోవాస్ 7 వికెట్లు కోల్సోయి 102 పరుగులే చేయగల్గింది. సల్మా కాతున్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా పొదుపుగా పరుగులిచ్చి దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. ఈ ఫైనల్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్మృతి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మొత్తం మూడు అవార్డుల్ని సాధించడం విశేషం.

Sunday, November 8, 2020

CM Jagan condolences to YSRCP Kakinada city president Frooti Kumar`s Death

వైఎస్సార్సీపీ తూ.గో. నేత మృతి: సీఎం సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ కరోనాతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చురుగ్గా పనిచేస్తున్నారు. కరోనా సోకడంతో గత కొంతకాలంగా విశాఖపట్నంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇటీవల సీఎం జగన్.. ఫ్రూటీకుమార్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి చంద్రకళా దీప్తికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన అకాల మరణం బాధిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలా జరగడం పట్ల విచారం వెలిబుచ్చారు.

Friday, November 6, 2020

TV9 has bagged a record 17 NT awards

టీవీ9 కు ఎన్టీ అవార్డుల పంట

టీవీ9 తెలుగు రికార్డు స్థాయిలో న్యూస్ టెలివిజన్ అవార్డులు సాధించింది. వివిధ విభాగాల్లో మొత్తం 17 అవార్డులు సొంతం చేసుకుని కాలరేగరేసింది. బెస్ట్ న్యూస్ డిబేట్ షో అవార్డును `బిగ్ న్యూస్ బిగ్ డిబేట్` దక్కించుకోగా బెస్ట్ ప్రైమ్టీవీ న్యూస్ యాంకర్ అవార్డును మురళీకృష్ణ కైవసం చేసుకున్నారు. బెస్ట్ టీవీ న్యూస్ ప్రెజెంటర్ అవార్డు పూర్ణిమకు లభించింది. బెస్ట్ డైలీ న్యూస్ బులిటెన్ అవార్డు `టాప్ న్యూస్ 9` ఖాతాలో వేసుకుంది. అదేమాదిరిగా బెస్ట్ టీవీ న్యూస్ రిపోర్టర్ గా అశోక్ వేములపల్లి, బెస్ట్ యంగ్ టీవీ జర్నలిస్ట్ గా స్వప్నిక అవార్డులు గెలుచుకున్నారు. బెస్ట్ ప్రైమ్ టైమ్ న్యూస్ షో అవార్డును `అనగనగా ఒక ఊరు` దక్కించుకుంది. అలాగే టీవీ9 తెలుగు బెస్ట్ న్యూస్ చానల్ వెబ్సైట్ అవార్డు tv9telugu.com ను వరించింది.