Tuesday, October 27, 2020

Unlock guidelines issued in September to remain in force till November 30: MHA

నవంబర్ 30 వరకు అన్ లాక్-5 నిబంధనలే 

అన్ లాక్-5 నిబంధనలే నవంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి రాగా జూన్ 1 నుంచి దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను అమలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ లాక్-5 నిబంధల్ని నవంబర్ ముగిసేవరకు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ కొద్దిరోజుల క్రితం స్వయంగా మీడియా ముందుకు వచ్చి కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లాక్‌డౌన్ తీసేయడం అంటే కరోనా పోయినట్లు భావించొద్దని ఆయన స్పష్టం చేశారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు దాని విషయంలో అజాగ్రత్త వద్దని సూచించారు. పండగల సమయంలో కరోనా విషయంలో మరింత అప్రమత్తత అవసరమని సూచించారు. గత నెల అన్ లాక్-5 సడలింపులను ప్రకటించిన కేంద్రం అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు అనుమతించింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలు, విద్యాసంస్థలే నిర్ణయం తీసుకోవాలని కోరింది. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇదే సమయంలో ఆన్ లైన్, డిస్టెన్స్ విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని షరతు పెట్టింది.

Monday, October 26, 2020

Kanyaka Parameswari Mata decoration with worth above Rs.1 crore currency notes

రూ.కోటి కాంతుల కన్యకాపరమేశ్వరీ

తెలంగాణ గద్వాల్ లోని ప్రసిద్ధ శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆలయం సోమవారం కరెన్సీ నోట్లతో దగదగలాడింది. ఈరోజు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది. కన్యకాపరమేశ్వరీ మాతను రూ.1,11,11,111 విలువైన కరెన్సీతో అలంకరించారు. రంగురంగుల కరెన్సీ నోట్లను పుష్పాల మాదిరిగా మలచి అమ్మవారికి అలంకరించారు. చాలా కాలం లాక్ డౌన్ కారణంగా మూసివున్న ఆలయం దసరా పర్వదినం వల్ల తెరుచుకోవడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రంగురంగుల దీపపు కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ ఆలయం హైదరాబాద్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతేడాది దసరాతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య కూడా తగ్గింది. అదేవిధంగా గత దసరాలో అమ్మవారిని రూ.3 కోట్ల 33 లక్షల 33 వేల 33 నోట్లతో అలంకరించినట్లు ఆలయ కోశాధికారి పి.రాము తెలిపారు.

Saturday, October 24, 2020

Gitam University Constructions Demolished by Revenue officials

గీతం వర్సిటీ అక్రమ కట్టడాల కూల్చివేత

 విశాఖ గీతం యూనివర్సిటీలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. వర్సిటీకి చెందిన కొన్నికట్టడాల్ని రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వ భూములు అక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని అధికారులు పేర్కొన్నారు. రుషికొండ, ఎండాడ పరిధిలో 40.51 ఎకరాల్లో గీతం యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలు కొన్ని అక్రమమని రెవెన్యూ యంత్రాంగం విచారణలో తేలిందట. యూనివర్సిటీ ప్రహరీ (కొంత భాగం), ప్రధాన ద్వారాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆ పరిసరాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు. బీచ్ రోడ్డు మీదుగా యూనివర్సిటీ వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. ఆ పరిసరాల్లోకి ఎవర్ని అధికారులు అనుమతించడం లేదు. అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు నిర్మాణాల్ని కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తోంది. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత భరత్ ఈ వర్సిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Thursday, October 22, 2020

Vijayawada 6th day of Navratri festival goddess Durga worshiped as Lalitha Tripura Sundari Devi

లలితా త్రిపురసుందరిదేవిగా అనుగ్రహిస్తోన్న కనకదుర్గమ్మ

విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ లలితాత్రిపురసుందరిదేవిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఆరో రోజు గురువారం తెల్లవారుజాము 5 నుంచే పెద్ద సంఖ్యలో భక్తులకు అమ్మలగన్నమ్మ దర్శనం లభిస్తోంది. శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదాశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసిన అమ్మవారిని తిలకించి భక్తులు, ఉపాసకులు తరిస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మను సీఎం సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి దర్శించుకున్నారు. ఆయనకు అమ్మవారి ఫొటోను  దేవస్థానం ట్రస్ట్ బహుకరించింది. అదేవిధంగా సీఎం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గగుడి 2021 క్యాలెండర్‌ను జగన్ ఆవిష్కరించారు.