Tuesday, February 11, 2020

Doctor attempts to commit suicide at Gandhi Hospital in Hyderabad

గాంధీ ఆసుపత్రిలో హైడ్రామా: డాక్టర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు యత్నించడంతో హైరానా నెలకొంది. మంగళవారం  డాక్టర్ వసంత్ కుమార్ (ఎంబీబీఎస్) తన చొక్కాలో పెట్రోల్ సీసాలను పెట్టుకుని లైటర్ తో నిప్పంటించుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఉదయం గంటన్నరపాటు నడిచిన ఈ హైడ్రామాకు పోలీసులు చాకచక్యంగా తెరదించారు. చెట్టు కింద నిలబడి వసంత్ తన ఆవేదనను వ్యక్తం చేస్తుండగా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గర్భిణిగా ఉన్న ఆయన భార్య కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. అదును చూసుకుని ఒక్కసారిగా పోలీసులు వసంత్ ను ఒడిసి పట్టుకుని ఆయన చేతిలో ఉన్న లైటర్ ను లాగేసుకున్నారు. వ్యాన్ లోకి ఆయనను బలవంతంగా ఎక్కించారు. వసంత్ షర్టును విప్పేసి అందులో దాచుకున్న పెట్రోల్ సీసాల్ని తీసి దూరంగా విసిరేశారు. అనంతరం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. `గాంధీ`లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సోషల్ మీడియాలో వసంత్ తదితరులు వదంతులు రేపారని ప్రభుత్వం ఆయనతో పాటు మరో ముగ్గురు వైద్యుల్ని విధులు నుంచి సస్పెండ్ చేసింది. మూడ్రోజులుగా వసంత్ తన పై అధికారులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి(డీఎంఈ) అవకతవకలకు పాల్పడుతున్నారంటూ వసంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే డీఎంఈ మీడియాతో మాట్లాడుతూ వసంత్ పైనే గత కొంతకాలంగా అవినీతి, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు ఉన్నాయన్నారు. వాస్తవానికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నందునే గాంధీ ఆసుపత్రి నేడు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతోందన్నారు. ఒకవేళ ఆసుపత్రిలో సౌకర్యాల లేమి, అవకతవకలుంటే ఆయన ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని డీఎంఈ ఎదురు ప్రశ్న వేశారు. ఒక డాక్టర్ అయి ఉండి కరోనా వంటి సంక్షోభ సమయంలో ఆసుపత్రి ఆవరణలోనే బరితెగింపు ధోరణి కనబర్చడమేంటని నిలదీశారు. శాఖాపరంగా డాక్టర్ వసంత్ పై చర్యలు తీసుకోక తప్పదని చెప్పారు. 

Monday, February 10, 2020

Jaanu Movie Team Visits Tirumala Temple

తిరుమలకు టాలీవుడ్ టూరు: నయా ట్రెండ్ షురూ
తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త ఒరవడి కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో తిరుమల శ్రీవారి దర్శనం సెంటిమెంట్ నయా ట్రెండ్. టాలీవుడ్ నమ్మకాలకు పెట్టింది పేరు. సినిమా ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి ముహూర్తాలు, సెంటిమెంట్లతో యావత్ చిత్ర నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం తమ సినిమాలు విడుదలై విజయం సాధించాక తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ యూనిట్లు క్యూ కడుతున్నాయి. తాజాగా `జాను` చిత్ర యూనిట్ కూడా స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చింది. శనివారం ఆ చిత్ర దర్శకులు, సినీ తారలు, నిర్మాతలు తిరుమలలో సందడి చేశారు. దిల్ రాజు, కిశోర్, సమంత, శర్వానంద్ వేంకటేశుని సన్నిధిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది మహేశ్ బాబు, అల్లు అర్జున్ చిత్రాలు `సరిలేరునీకెవ్వరు`..`అల వైకుంఠాపురం` బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో ఈ చిత్రాలు విడుదలై విజయవంతంగా బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తొలుత మహేశ్ బాబు అండ్ యూనిట్ ఆ తర్వాత బన్నీ కుటుంబం సహా ఆ సినిమా టీమ్ స్వామి వారి దర్శనం చేసుకుని తరించారు. మహేశ్ బాబు సకుటుంబ సమేతంగా.. బాబాయి ఆదిశేషగిరిరావు, నమత్రా, గౌతమ్, సితారలతో కలిసి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట అత్యంత సన్నిహితుడు యువదర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తన కుటుంబంతో దర్శనానికి వచ్చారు. మూవీ డైరెక్టర్ అనిల్ రావివూడి, లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్ తదితరులు స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే బన్నీ, త్రివిక్రమ్ టీమ్ తిరుమలలో శ్రీవారి సన్నిధికి విచ్చేశారు. ఈ నెలలోనే `జాను` విడుదలై తెలుగు ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూవీగా అలరిస్తోంది. దాంతో సెంటిమెంట్ గా ఈ చిత్ర యూనిట్ కూడా స్వామి వారి  మొక్కులు తీర్చుకుంది. గతంలోనూ బాలీవుడ్ టు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు, తారాగణం తిరుమల వెంకన్న దర్శనాలు చేసుకోవడం రివాజుగా వస్తున్నదే. అయితే ఇలా సినిమా యూనిట్లకు యూనిట్లే శ్రీవారి చెంతకు చేరుతుండడం తాజా విశేషం.

Saturday, February 8, 2020

AP CM YS Jagan Inaugurates First Disha Police Station In Rajahmundry

రాజమండ్రిలో తొలి `దిశ` పోలీస్ స్టేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి `దిశ పోలీస్ స్టేషన్` రాజమండ్రిలో ఏర్పాటయింది. శనివారం ఉదయం 11 గంటలకు ఈ పీఎస్ ను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మహిళల తోనే  రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించారు. మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దిశచట్టంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 13 ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళలే ఉంటారని సీఎం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శిమన్ శర్మ కూడా మహిళే కాబట్టి మరో అడుగు ముందుకేసి ఏకంగా 47 మంది మహిళా సిబ్బందిని ఈ పోలీస్ స్టేషన్ లో నియమించారని ప్రశంసించారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. త్వరితగతిన శిక్షలు పడితేనే వ్యవస్థలో భయం వచ్చి నేరాలు తగ్గుతాయని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణనూ పూర్తి చేసి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఉరి శిక్షలు విధిస్తామని చెప్పారు. మహిళలు, చిన్నారులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. తొలిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి అదే తప్పు చేస్తే నాల్గేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈసందర్భంగా `దిశ` యాప్‌ను సీఎం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖమంత్రి సుచరిత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ వంగాగీతా, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.

Friday, February 7, 2020

Telangana CM KCR Inaugurate JBS-MGBS Metro carridor

జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ కు జెండా ఊపిన కేసీఆర్
హైదరాబాద్ మణిహారంగా అలరారుతున్న మెట్రో రైల్ ప్రాజెక్టు (హెచ్.ఎం.ఆర్.ఎల్) లో భాగమైన జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. జేబీఎస్ స్టేషన్ లో ఈ సాయంత్రం 4గంటలకు మెట్రో రైలు సర్వీసుకు సీఎం పచ్చ జెండా ఊపారు. 11 కిలోమీటర్ల ఈ రూట్లో ప్రయాణికులు కేవలం 16 నిమిషాల్లోనే గమ్య స్థానం చేరుకుంటారు. ఈ కారిడార్లో జేబీఎస్ (పరేడ్ గ్రౌండ్స్), సికింద్రాబాద్ వెస్ట్, న్యూగాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లు ఉన్నాయి. రోజూ సుమారు లక్ష మంది ప్రయాణిస్తారని అంచనా. ఈ కారిడార్ తో కలుపుకొని హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైలు మార్గం 69 కిలోమీటర్ల కు చేరుకుంది. ఇప్పటికే అమలులో ఉన్న ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లతో పాటు తాజాగా జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చినట్లయింది. మొత్తంగా ఈ మూడు కారిడార్లలో 16 లక్షల మంది నిత్యం ప్రయాణిస్తారని హైదరాబాద్ మెట్రో వర్గాలు ఆశిస్తున్నాయి. కోల్ కతా దేశంలో మొట్టమొదట మెట్రో రైలు వ్యవస్థను కల్గిన నగరం. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అయితే దేశంలో ఢిల్లీ (డీఎంఆర్సీ) ఎక్కువ దూరం విస్తరించిన మెట్రోగా రికార్డు నెలకొల్పింది.  2002లో కేవలం ఆరుస్టేషన్లతో షహదర-తీస్ హజారీ (8.5 కిలోమీటర్లు) మార్గం తొలుత అందుబాటులోకి వచ్చింది. 17 ఏళ్లలో మొత్తం 11 లైన్లతో 391 కిలోమీటర్ల మేర ఢిల్లీ మెట్రో విస్తరించింది. నగరంలో గల 285 స్టేషన్లలో రోజూ సుమారు 35 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. కోలకతా మెట్రో రైలు సర్వీసు (కె.ఎం.ఆర్.సి) 1984లోనే ప్రారంభమయింది. ప్రస్తుతం 24 స్టేషన్లతో నౌపరా-కవి సుభాష్ (27.22 కిలోమీటర్ల) మార్గమే అందుబాటులో ఉండగా మరో నాలుగు లైన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 7.5 లక్షల మంది ఇక్కడ మెట్రో రైలు సేవల్ని పొందుతున్నారు.